సెంచురో సక్సెస్: మహీంద్రా టూవీలర్స్ నవంబర్ సేల్స్ జంప్
దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ద్విచక్ర వాననాల తయారీ విభాగం మహీంద్రా టూవీలర్స్, ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన చీప్ అండ్ బెస్ట్ 110సీసీ మోటార్సైకిల్ 'మహీంద్రా సెంచురో' కంపెనీ సక్సెస్కు వెన్నదన్నుగా నిలుస్తోంది. సెంచురో బైక్ సక్సెస్ కారణంగా, కంపెనీ అమ్మకాలు ఇదివరకెన్నడు లేని విధంగా వృద్ధిని కనబరుస్తున్నాయి.
మహీంద్రా సెంచురోకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింక్పై క్లిక్ చేయండి.
నవంబర్ 2012తో పోల్చుకుంటే, నవంబర్ 2013లో మహీంద్రా టూవీలర్స్ మొత్తం అమ్మకాలు (దేశీయ అమ్మకాలు, ఎగుమతులు కలిపి) 126 శాతం వృద్ధి చెంది 24,245 యూనిట్లుగా నమోదయ్యాయి. ఒక్క దేశీయ మార్కెట్లో మహీంద్రా టూవీలర్స్ అమ్మకాలు 23,831 యూనిట్లుగా నమోదయ్యి, 136 శాతం వృద్ధిని కనబరచాయి.
ఈ సందర్భంగా మహీంద్రా టూవీలర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వీరెన్ పోప్లీ మాట్లాడుతూ.. నవంబర్ అమ్మకాలు అత్యంత ప్రోత్సాహకరంగా ఉన్నాయని, తాము తాజాగా మార్కెట్లోకి విడుదల మహీంద్రా సెంచురో బైక్ను కొనుగోలుదారులు చక్కగా ఆదరిస్తున్నారని, అతి తక్కువ సమయంలోనే ఈ బైక్కు మంచి డిమాండ్ రావటం సంతోషంగా ఉందని అన్నారు.
ఈ సందర్భంగా తమ వినియోగదారులందరికీ ఆయన తన హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేశారు. వినియోగదారులు తమపై పెంచుకున్న అంచనాలకు అనుగుణంగా వారికి సేవలు అందించేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.
మహీంద్రా సెంచురో జులై 1, 2013న విడుదలైంది. ప్రస్తుతం దేశీయ విపణిలో ఈ బైక్ ధర రూ.46,500 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ బైక్లో కంపెనీ దేశీయంగా అభివృద్ధి చేసిన 106.7 సీసీ, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎమ్సిఐ-5 (మైక్రో చిప్ ఇగ్నైటెడ్ 5-కర్వ్) ఇంజన్ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 7500 ఆర్పిఎమ్ వద్ద 8.5 పిఎస్ల శక్తిని, 5500 ఆర్పిఎమ్ వద్ద 8.5 ఎన్ఎమ్ల టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్తో జతచేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 85.4 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications









