కొత్త ఎమ్ఆర్ఎఫ్ టైర్లతో కెటిఎమ్ 390 సిరీస్ బైక్స్; ధర, ఇతర వివరాలు
కెటిఎమ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ 390 సిరీస్ మోటార్సైకిళ్లలో కంపెనీ సైలెంట్గా ఓ అప్డేట్ను చేసినట్లు తెలుస్తోంది. కెటిఎమ్ నుండి లభిస్తున్న అడ్వెంచర్ 390, డ్యూక్ 390 మరియు ఆర్సి 390 మోడళ్లు ఇప్పుడు ఎమ్ఆర్ఎఫ్ టైర్లతో లభ్యం కానున్నాయి. ఇదివరకు వాటి స్థానంలో మెట్జెలర్ టైర్లు లభించేవి.

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, దేశంలోని మొత్తం 390 మోటార్సైకిళ్లపై టైర్ ప్యాకేజీని కంపెనీ అప్డేట్ చేసింది. భారత్లో ఇప్పటి వరకూ 390 డ్యూక్ మరియు 390 ఆర్సిలను ‘మెట్జెలర్ ఎమ్5 స్పోర్టెక్' టైర్లతో అందించారు. కొత్త అప్డేట్ తర్వాత ఇవి టాప్-స్పెక్ ఎమ్ఆర్ఎఫ్‘రెవ్జ్ సి1' పెర్ఫార్మెన్స్ టైర్లతో లభ్యం కానున్నాయి.

కెటిఎమ్ అడ్వెంచర్ 390 కూడా టైర్ అప్డేట్ను పొందినట్లుగా తెలుస్తోంది. ఈ అడ్వెంచర్ మోటార్సైకిల్ను ఇదివరకు డ్యూయెల్ టెర్రైన్ ‘మెట్జెలర్ టూరెన్స్' టైర్లతో అందించేవారు. కాగా, ఇప్పుడు దీనిని ఎమ్ఆర్ఎఫ్ తయారుచేసిన టైర్లతో భర్తీ చేస్తారు.

అయితే, కెటిఎమ్ అడ్వెంచర్ 390 మోటార్సైకిల్లో ఉపయోగించిన ఎమ్ఆర్ఎఫ్ టైర్ యొక్క ఖచ్చితమైన మోడల్ ఇంకా తెలియరాలేదు. కానీ చెన్నైకి చెందిన ఎమ్ఆర్ఎఫ్ కంపెనీ అందిస్తున్న డ్యూయెల్ పర్పస్ టైర్ ‘ఎమ్ఆర్ఎఫ్ మొగ్రిప్ మీటియోర్-ఎమ్' మోడల్ను ఇందులో ఉపయోగించవచ్చని అంచనా.

కొత్త టైర్ అప్డేట్ కారణంగా మోటార్సైకిళ్ల ధరలు ప్రభావితం కాలేదు, ఈ ఎమ్ఆర్ఎఫ్ టైర్లకు కూడా ఇంచు మించు అదే రీతిలో ఖర్చు అవుతుందని సమాచారం. వాస్తవానికి మెట్జెలర్ టైర్లే కాస్తంత ఖరీదైనవని చెప్పాలి. అయితే, ఇప్పటి వరకూ కెటిఎమ్ భారత మార్కెట్లో తమ మోటార్సైకిళ్లలో ఎమ్ఆర్ఎఫ్ టైర్ల అప్డేట్ గురించి కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. మరి ఈ టైర్లలో మార్పు శాశ్వతంగా ఉంటుందో లేదో అనేది తెలియాల్సి ఉంది.

టైర్ల మార్పుపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా, టైర్ల దిగుమతులకు అంతరాయం ఏర్పడి, వాటి లభ్యత సమస్యగా మారిన నేపథ్యంలో కంపెనీ స్థానికంగా లభించే టైర్లను ఉపయోగించాలని భావించినట్లుగా తెలుస్తోంది. మెట్జెలర్ టైర్లను జర్మనీలో తయారు చేసి, భారతదేశానికి దిగుమతి చేసుకుంటారు.

ఈ నేపథ్యంలో, దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి కారణంగా దిగుమతి కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. ఫలితంగా, కంపెనీ తమ వినియోగదారులకు నిరంతరాయంగా ఉత్పత్తులను సరఫరా చేయడం కోసం భారతీయ టైర్ కంపెనీ అయిన ఎమ్ఆర్ఎఫ్ను ఎంచుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇకపోతే, ప్రస్తుతం భారత మార్కెట్లో కెటిఎమ్ అడ్వెంచర్ 390, ఆర్సి 390 మరియు డ్యూక్ 390 మోడళ్ల ధరలు వరుసగా రూ.3.04 లక్షలు, రూ.2.53 లక్షలు మరియు రూ .2.58 లక్షలు (ఎక్స్షోరూమ్, బెంగళూరు)గా ఉన్నాయి.

కెటిఎమ్ బ్రాండ్కు సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ ఇటీవలే తమ ఆర్సి శ్రేణి మోటార్సైకిళ్లలో కొత్త కలర్ ఆప్షన్లను కూడా విడుదల చేసింది. ఇందులో ఆర్సి 125, ఆర్సి 200 మరియు ఆర్సి 390 మోడళ్లు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు కొత్త పెయింట్ స్కీమ్లో లభిస్తాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

కెటిఎమ్ డ్యూక్ 390 సిరీస్లో ఎమ్ఆర్ఎఫ్ టైర్లను జోడించడంపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
కెటిఎమ్ 390 సిరీస్ మోటార్సైకిళ్లలో కంపెనీ సైలెంట్గా టైర్ అప్డేట్ను ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తోంది. మునుపటి మెట్జెలర్ మోడల్ టైర్లతో పోల్చుకుంటే, ఎమ్ఆర్ఎఫ్ టైర్ల ధరలు తక్కువగా ఉన్నప్పటికీ, ఆయా మోటార్సైకిళ్ల ధరలు మాత్రం మారలేదు. మరి రానున్న రోజుల్లో కూడా ఎమ్ఆర్ఎఫ్ టైర్లు ఇలానే కొనసాగుతాయా, ఒకవేళ కొనసాగితే ఆయా మోటార్సైకిళ్ల ధరలు తగ్గుతాయా అనేది తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








