కోయంబత్తూర్, ట్రిచీ నగరాల్లో ఏథర్ 450 డెలివరీలు ప్రారంభం
ఒకప్పుడు బెంగుళూరుకి మాత్రమే పరిమితమైన ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ను కంపెనీ ఇప్పుడు శరవేగంగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఏథర్ ఎనర్జీ, తమ పాపులర్ ఈవీని తాజాగా కోయంబత్తూర్ మరియు ట్రిచీ నగరాల్లో ప్రారంభించింది.

ఈ నగరాల్లో కూడా ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల టెస్ట్ రైడ్లను కూడా కంపెనీ ప్రారంభించింది. ఏథర్ ఎనర్జీ సంస్థ కోయంబత్తూర్లో 5 ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లను మరియు ట్రిచీలో 2 ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. రాబోయే నెలల్లో ఈ నగరాల్లో మరిన్ని ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఏథర్ ఎనర్జీ ఇప్పటికే చెన్నై నగరంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కాగా, ఇప్పుడు ఈ సంస్థ కోయంబత్తూర్ మరియు ట్రిచి నగరాలకు కూడా విస్తరించడంతో తమిళనాడులో మొత్తం మూడు నగరాల్లో ఏథర్ ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. ఆయా నగరాల్లో చార్జింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు కంపెనీ ప్రస్తుతం కేఫ్లు, హోటళ్ళు, టెక్ పార్కులు, మాల్స్ మరియు జిమ్లు వంటి ప్రదేశాలలో భాగస్వాముల కోసం చూస్తోంది.

ఏథర్ ఎనర్జీ ఇటీవలే ముంబై మరియు ఢిల్లీ నగరాల్లో తమ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించిన విషయం తెలిసినదే. కాగా, త్వరలోనే ఈ కంపెనీ జైపూర్లో కూడా ఏథర్ 450ఎక్స్ డెలివరీలను ప్రారంభించనుంది. కాగా, ఏథర్ ఎనర్జీ ఏర్పాటు చేస్తున్న చార్జింగ్ పాయింట్లను కేవలం ద్విచక్ర వాహనాలకే కాకుండా నాలుగు చక్రాల ఈవీలకు కూడా ఉపయోగించుకోవచ్చు మరియు కంపెనీ వీటిని సెప్టెంబర్ 2021 వరకు అందరికీ పూర్తిగా ఉచితంగా అందిస్తోంది.

ఈ ఛార్జింగ్ స్టేషన్లను కస్టమర్లు తమ ఏథర్ గ్రిడ్ యాప్ సహాయంతో యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ యాప్ సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్లను గుర్తించడానికి మరియు వాటి లభ్యతను తనిఖీ చేయడానికి యూజర్లకు సహకరిస్తుంది. ఏ నగరంలోనైనా తమ స్కూటర్ల డెలివరీని ప్రారంభించే ముందు ఆయా నగరాల్లో కనీసం 5 - 6 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం భారత మార్కెట్లో ఏథర్ 450 అనే స్కూటర్ను మాత్రమే విక్రయిస్తోంది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఏథర్ 450 ప్లస్ మరియు ఏథర్ 450ఎక్స్. మార్కెట్లో వీటి ధరలు ఇలా ఉన్నాయి:
-> ఏథర్ 450 ప్లస్ - రూ.1,42,416
-> ఏథర్ 450ఎక్స్ - రూ.1,61,426
(రెండు ధరలు ఎక్స్-షోరూమ్, కోయంబత్తూర్)
-> ఏథర్ 450 ప్లస్ - రూ.1,42,521
-> ఏథర్ 450ఎక్స్ - రూ.1,61,531
(రెండు ధరలు ఎక్స్-షోరూమ్, ట్రిచీ)

ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కంపెనీ నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ను మరియు లీజింగ్ ఆప్షన్లను కూడా అందిస్తోంది. అంతేకాకుండా, పరిమిత కాలపు ఆఫర్గా ఈ స్కూటర్ కొనుగోలుపై కంపెనీ బై బ్యాక్ అష్షూరెన్స్ను కూడా అందిస్తోంది. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ వెబ్సైట్లో కానీ లేదా మీ సమీపంలోని డీలర్షిప్ను సందర్శించి కానీ తెలుసుకోవచ్చు.

ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇందులో 6 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, ఇది 26 ఎన్ఎమ్ టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ స్కూటర్లో అమర్చిన ఐపి67 రేటెడ్ వాటర్ప్రూఫ్ 2.9 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్తో పనిచేస్తుంది.

ఏథర్ ఎనర్జీ ఈ బ్యాటరీపై మరియు ఎలక్ట్రిక్ స్కూటర్పై 3 ఏళ్ల సమగ్ర వారంటీని అందిస్తోంది. ఈ బ్యాటరీ పూర్తి ఛార్జ్పై గరిష్టంగా 85 కిలోమీటర్ల రేంజ్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్లోని బ్యాటరీని చార్జ్ చేసే ప్రతి నిమిషం 1.45 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్ లభిస్తుందని కంపెనీ తెలిపింది.

ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 10 నిమిషాల్లోనే 15 కిలోమీటర్లు ప్రయాణించేందుకు సరిపడా బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ వివరించింది. ఎథర్ 450 టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. ఇది కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 - 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.

ఏథర్ ఎనర్జీ అందిస్తున్న టాప్-ఎండ్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో అనేక స్మార్ట్ ఫీచర్లు లభిస్తాయి. ఇందులో 4G నెట్వర్క్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన స్మార్ట్ టచ్స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. దీని సాయంతోనే పూర్తి స్కూటర్ను కంట్రోల్ చేయవచ్చు. అలాగే, దీనిపై సంగీతం మరియు వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లను కూడా కంట్రోల్ చేయవచ్చు.

బెంగుళూరుకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ, రెండేళ్ల క్రితం ఓ స్టార్టప్ కంపెనీగా ప్రారంభమై ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలలో ఒకటిగా మారింది. ఈ సంస్థ ఇటీవలే తమిళనాడులోని హోసూర్లో ఓ అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంట్ను ప్రారంభించింది. మా డ్రైవ్స్పార్క్ బృందం కూడా సదరు ప్లాంట్ను సందర్శించింది. - ఆ ప్లాంట్ విశేషాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








