కరోనా సెకండ్ వేవ్: యమహా టూవీలర్లపై సర్వీస్ మరియు వారంటీ పొడగింపు
భారతదేశంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో, దేశంలోని అనేక రాష్ట్రాల్లో పాక్షిక మరియు సంపూర్ణ లాక్డౌన్లు అమలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా, తమ వాహనాల విషయంలో ఉచిత సర్వీస్ మరియు వారంటీ వ్యవధిని పొడగిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ సేవలను జూన్ 30, 2021 వరకు పొడిగిస్తున్నట్లు యమహా ఇండియా పేర్కొంది. ఇందులో భాగంగా, కంపెనీ తమ వాహనాలపై అందిస్తున్న సాధారణ వారంటీ, పొడగించిన వారంటీ మరియు వార్షిక నిర్వహణలో లభించే వారంటీల కాల వ్యవధిని కంపెనీ వచ్చే నెలాఖరు వరకు పొడిగించింది.

ఈ మేరకు యమహా తమ అన్ని డీలర్షిప్లకు సేవల పొడిగింపు మరియు వారెంటీ పొడగింపుపై సమాచారాన్ని అందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇకపై వినియోగదారులు తమ బైక్లను జూన్ 30 వరకూ ఎటువంటి సమస్యలు లేకుండా సర్వీసు పొందవచ్చు.

కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా, భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో పాక్షిక మరియు సంపూర్ణ లాక్డౌన్లు కొనసాగుతున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో అనేక ఆటోమొబైల్ కంపెనీలు తమ సర్వీస్ సెంటర్లను మరియు డీలర్షిప్లను పూర్తిగా మూసివేయటం లేదా కొన్ని గంటల పాటు మాత్రమే నిర్వహించడం చేస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో వాహన యజమానులు బయటకు రాలేక, సరైన సమయంలో తమ వాహనాలను సర్వీస్ చేయించుకోలేక పోతున్నారు. ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని యమహా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

యమహా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, "కంపెనీ వారంటీ మరియు సర్వీస్ వ్యవధిని జూన్ 30 వరకు పొడిగిస్తోంది. లాక్డౌన్ సమయంలో వారంటీ గడువు ముగిసిన వినియోగదారులకు జూన్ 30 వరకు వారంటీ మరియు ఉచిత సేవ యొక్క ప్రయోజనం ఇవ్వబడుతుంది." అని పేర్కొంది.

యమహా తమ కస్టమర్ల సంతృప్తికే అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, ఇందులో భాగంగానే ప్రస్తుత విపత్కర పరిస్థిల్లో తమ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని కంపెనీ తెలిపింది.

ఇదిలా ఉంటే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో యమహా కూడా ఇతర ఆటోమొబైల్ కంపెనీల మాదిరిగానే తమ ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేసింది. తమిళనాడు రాష్ట్రంలోని తమ కాంచీపురం ప్లాంట్లో మరియు ఉత్తరప్రదేశ్లోని సూరజ్పూర్ ప్లాంట్లో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ప్రకటించింది.

ఈ రెండు ప్లాంట్లను మే 15 నుండి మే 31, 2021 వరకు మూసివేయాలని కంపెనీ నిర్ణయించింది. యమహాతో పాటుగా హీరో మోటోకార్ప్, హోండా టూవీలర్స్ మరియు రాయల్ ఎన్ఫీల్డ్ వంటి సంస్థలు కూడా తమ తయారీ కర్మాగారాలను కొన్ని రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.

మారుతి సుజుకి సర్వీస్, వారంటీ పొడగింపు
దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా కూడా ఇటీవలే తమ కొత్త వాహనాల విషయంలో సర్వీస్ మరియు వారంటీ గడువును జూన్ 30 వరకూ పొడగిస్తున్నట్లు ప్రకటించింది. - దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








