సింపుల్ ఎనర్జీ (Simple Energy) చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తోంది..
బెంగళూరుకి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ (Simple Energy), గతేడాది భారత మార్కెట్లో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ "సింపుల్ వన్" (Simple One) ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ధరల విషయానికి వస్తే, మార్కెట్లో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.1.09 లక్షల (సింగిల్ బ్యాటరీ) నుండి రూ.1.45 లక్షల (డబుల్ బ్యాటరీ) మధ్యలో ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, కంపెనీ ఇప్పుడు ఓ చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ను కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది.

భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతున్నప్పటికీ, కస్టమర్లు మాత్రం తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో, సింపుల్ ఎనర్జీ కూడా ఈ విభాగంలోని అవకాశాలను దక్కించుకునేందుకు తక్కువ ధర కలిగిన ఓ ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీపై దృష్టి సారించింది. ఓ నివేది ప్రకారం, కంపెనీ తమ తదుపరి ఎలక్ట్రిక్ స్కూటర్ను ఈ ఏడాది జూన్లో ఆవిష్కరించనుంది మరియు వచ్చే ఏడాది నాటికి మార్కెట్లో విడుదల కానుంది.

సింపుల్ ఎనర్జీ ప్రస్తుతం విక్రయిస్తున్న సింపుల్ వన్ ఇ-స్కూటర్ కంటే ఇది చాలా చౌకగా ఉంటుందని సమాచారం. ఈ తదుపరి స్కూటర్ పూర్తిగా కొత్తగా ఉంటుందని మరియు ప్రస్తుతం విక్రయిస్తున్న సింపుల్ వన్ అప్గ్రేడ్ కాబోదని కంపెనీ తెలిపింది. సింపుల్ వన్ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించే కొత్త ప్లాట్ఫారమ్పై కంపెనీ దీనిని నిర్మిస్తోంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఎక్కువ వివరాలను వెల్లడించినప్పటికీ, ఇది మార్కెట్లో ఉన్న అనేక ఇతర సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడుతుందని మాత్రం తెలిపింది.

అధిక ధర కారణంగా చాలా మంది కస్టమర్లు పెర్ఫార్మెన్స్ ఆధారిత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్లను కోరుకోవడం లేదని, ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ లకు అధిక డిమాండ్ ఉందని. , అందుకనే తక్కువ బడ్జెట్ తో కస్టమర్ల కోసం ఓ సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకురావడంపై కంపెనీ దృష్టి సారిస్తోందని సింపుల్ ఎనర్జీ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి తమ చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేయాలని భావిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. సిపల్ వన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ రాబోయే నెలల్లో వెల్లడించే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే, సింపుల్ ఎనర్జీ లిథియం-అయాన్ బ్యాటరీలను తయారు చేసే C4V అనే సంస్థతో చేతులు కలిపింది. ఈ రెండు కంపెనీలు కలిసి దేశంలో లిథియం-అయాన్ పర్యావరణ వ్యవస్థను రూపొందించడంపై పని చేస్తాయి. సింపుల్ ఎనర్జీ తన మొదటి పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్ను ఆగస్టు 15, 2021న భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్కూటర్కు కస్టమర్ల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది మరియు కేవలం మూడు రోజుల్లోనే కంపెనీ 30,000 యూనిట్లకు బుకింగ్లను పొందింది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ను కంపెనీ ఇటీవలే మరింత శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారుతో అప్గ్రేడ్ చేసింది. ఈ అప్గ్రేడ్ ద్వారా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు మునుపటి కన్నా మెరుగైన పనితీరు, థర్మల్ మేనేజ్మెంట్ మరియు సామర్థ్యాన్ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ అప్గ్రేడ్ కారణంగా, ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 8.5 kW శక్తిని మరియు 72 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సరికొత్త సింపుల్ వన్ మోటార్ 96 శాతం సామర్థ్యాన్ని అందజేస్తుందని నివేదించబడింది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇతర ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగా ఫిక్స్డ్ బ్యాటరీని కాకుండా, తొలగించదగిన బ్యాటరీ ప్యాక్ని కలిగి ఉంటుంది. ఇది ఒకటి లేదా రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో సింగిల్ బ్యాటరీ ఆప్షన్ మాదిరిగానే, డబుల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ కూడా పూర్తిగా తొలగించదగినదిగా ఉంటుంది. వీటిని స్కూటర్ నుండి విడిగా తీసి చార్జ్ చేసుకునే వెసలుబాటు ఉంటుంది. అపార్ట్మెంట్లు మరియు చార్జింగ్ సౌలభ్యాలు అందుబాటులో లేని వారి కోసం ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇందులోని 2 బ్యాటరీలు మొత్తంగా 6.4 kWh సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సింపుల్ వన్ ను ఎకో మోడ్ లో రైడ్ చేసిన ప్పుడు, ఇది పూర్తి చార్జ్ గరిష్టంగా 236 కిమీ (వాస్తవ ప్రపంచంలో 203 కిమీ) రేంజ్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. సింపుల్ ఎనర్జీ ఇటీవల ప్రకటించిన పెద్ద 2-బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ సాయంతో దీనిని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 300 కంటే ఎక్కువ కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ స్కూటర్ కేవలం 2.85 సెకన్లలోనే గంటకు 0 నుండి 40 కిమీ వేగాన్ని చేరుకుంటుంది.

టాప్ స్పీడ్ విషయానికి వస్తే, దీని గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్లుగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఆన్బోర్డ్ నావిగేషన్ మరియు బ్లూటూత్ మరియు 4G కనెక్టివిటీతో కూడిన టచ్స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. సంగీతం మరియు ఫోన్ కాల్స్ ను యాక్సెస్ చేసుకునేందుకు వీలుగా వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్ ద్వారా స్కూటర్ కు రిమోట్ గా కనెక్ట్ అయ్యే సదుపాయం, ముందు మరియు వెనుక భాగంలో పూర్తి ఎల్ఈడి లైటింగ్, సీటు క్రింది భాగంలో 30 లీటర్ల బూట్ స్పేస్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ను వంటి ప్రధానమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








