నితిన్ గడ్కరీని కలిసిన ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్, ఎందుకంటే..?
గడచిన కొన్ని వారాలుగా దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ బ్రాండ్లకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగిన సంఘటనల నేపథ్యంలో, ఎలక్ట్రిక్ స్కూటర్ల భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఓలా, ఒకినావా, ప్యూర్ ఈవీ, జితేంద్ర ఈవీ మరియు అనేక ఇతర ఇ-స్కూటర్ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల ఈవీలలో గతంలో ఎన్నడూ లేని విధంగా అగ్ని ప్రమాద సంఘటనలు నివేదించబడ్డాయి. దీంతో ఈ విషయంపై కేంద్రం కూడా సీరియస్ అయింది, ఈవీలలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలకు గల కారణాలను అన్వేషించాలని ఓ ప్రత్యేక బృందాన్ని ఆదేశించింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో, భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల భవిష్యత్తు గురించి మాట్లాడేందుకు ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) సీఈవో భవిష్ అగర్వాల్ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఈ సమావేశంలో నితిన్ గడ్కరీ స్వయంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ను పరిశీలించి, దాని ఫీచర్లను అడిగి తెలుసుకున్నారు.

భవిష్ అగర్వాల్ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఈ సమాచారాన్ని పంచుకుంటూ, "ఈ రోజు శ్రీ నితిన్ గడ్కరీ గారిని కలిశాను మరియు ఈ సమావేశంలో ప్రపంచంలో ఈవీ హబ్గా భారతదేశం యొక్క సంభావ్యత మరియు ఓలా యొక్క ప్రణాళికల గురించి చర్చించాము. అతనికి మా స్కూటర్లను చూపించాము! ఇదొక విద్యుత్ విప్లవం. ఈ విప్లవాన్ని కలిసికట్టుగా ముందుకు తీసుకురావడంలో వారు మాపై ఉంచిన నమ్మకం మరియు సస్టైనబుల్ మొబిలిటీని రియాలిటీగా మార్చడంలో ఓలా ఎలక్ట్రిక్కు నిజమైన స్ఫూర్తినిస్తుంది" అని పేర్కొన్నారు.

గత నెలలో పూణెలో ఓ రైడ్-హెయిలింగ్ ఆపరేటర్ ఉపయోగిస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదు, కానీ ఓలా స్కూటర్ మాత్రం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఈ నేపథ్యంలో, కేంద్రం విచారణకు ఆదేశించిన కొద్ది రోజుల తర్వాతనే భవీష్ అగర్వాల్ నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈవీ అగ్ని ప్రమాదాలపై ఓ నివేదికను సమర్పించాలని సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (CFEES)ని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కోరింది.

ఈవీ అగ్ని ప్రమాదాలకు దారితీసిన పరిస్థితులను పరిశోధించాలని మరియు అందుకు తగిన నివారణ చర్యలను సూచించాలని కోరింది కూడా ప్రభుత్వం CFEES ని కోరింది. ఇ-స్కూటర్లకు మంటలు అంటుకున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల భద్రతా ప్రమాణాలపై అనేక ప్రశ్నలు లేవనెత్తడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు, నిపుణులు లిథియం-అయాన్ బ్యాటరీలలోని థర్మల్ రన్అవే కారణంగా ఇటువంటి సంఘటనలకు కారణమని చెబుతున్నారు. థర్మల్ రన్వే కారణంగా ఈవీలలో పుట్టే మంటలను ఆర్పడం కూడా కష్టమే.

ఓలా ఈవీ అగ్ని ప్రమాద విషయంపై గతంలో స్పందించిన ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేస్తూ, "ఓలా కంపెనీలో వాహనాల భద్రతకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తామని, తమ ఉత్పత్తులు అత్యధిక నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉంటాయని, కబట్టి, తాము ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని మరియు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు చాలా కాలంగానే ఉన్నాయి. అయితే, ఇటీవలి నెలల్లో ప్యాసింజర్ మరియు కమర్షియల్ ఎలక్ట్రిక్ టూ-వీలర్స్, త్రీ-వీలర్స్ మరియు ఫోర్-వీలర్స్ అమ్మకాలు చాలా వేగంగా పెరిగాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు 4,29,217 యూనిట్లుగా ఉండగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేవలం 1,34,821 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. అంటే, ఈ సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల మొత్తం అమ్మకాల్లో 370 శాతం వృద్ధి నమోదైంది. కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 1,68,300 యూనిట్లుగా ఉన్నాయి.

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) విడుదల చేసిన వివరాల ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ కార్ల రిటైల్ అమ్మకాలు 17,802 యూనిట్లుగా ఉన్నాయి, ఇది 2020-2021 ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన 4,984 యూనిట్లతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ. అలాగే, గత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రిటైల్ విక్రయాలు 2,31,338 యూనిట్లుగా ఉన్నాయి, ఇది 2020-21 ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన 41,046 యూనిట్ల కంటే ఐదు రెట్లు ఎక్కువ.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయానికి వస్తే, బెంగుళూరుకి చెందిన ఈ కంపెనీ చెన్నైలో ఓ మెగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ఓలా ఎస్1 మరియు ఓలా ఎస్1 ప్రో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తోంది. గడచిన ఆగస్ట్ నెలలో కంపెనీ వీటిని పూర్తిస్థాయిలో విక్రయించడం ప్రారంభించింది. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ. 99,999 మరియు రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఓలా ఎస్1 ఈవీ 2.98 kWh నాన్-రిమూవబుల్ బ్యాటరీని కలిగి ఉండి, పూర్తి చార్జ్ పై 121 కిమీ రేంజ్ను అందిస్తుంది. కాగా, ఓలా ఎస్1 ప్రో ఈవీ 3.97 kWh బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉండి, 181 కిమీ రేంజ్ ను అందిస్తుంది.


Click it and Unblock the Notifications








