కేవలం 5 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. ఓలా నుండి ఓ అధునాతన ఫాస్ట్ చార్జర్.. ఇక దిగులేముంది..!!
ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో అతిపెద్ద సమస్య వాటి బ్యాటరీలను చార్జ్ చేసేందుకు పట్టే సుదీర్ఘ సమయం. అందుకే, ఇవి ఇప్పటికీ చిన్నపాటి సిటీ ప్రయాణాలకు మరియు తక్కువ దూరాలను చేరుకునేందుకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. దేశంలో సరైన చార్జింగ్ నెట్వర్క్ లేకపోవడం కూడా ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి పెను సవాలుగా మారింది. అయితే, వీటన్నింటినీ అధిగమించి కేవలం ఐదే ఐదు నిమిషాల్లో ఎలక్ట్రిక్ వాహనాన్ని పూర్తిగా చార్జ్ చేస్తే.. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ..!

కానీ, ఇది సాధ్యమేనంటోంది భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన ఓలా ఎలక్ట్రిక్ (Oal Electric). ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో తన సత్తా ఏంటో చూపేందుకు ఓలా ఎలక్ట్రిక్ మరోసారి సిద్ధమైంది. ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ విషయంలో తమ వినియోగదారులకు అతుకులులేని అనుభవాన్ని అందించేందుకు మరో అడుగు ముందుక వేసింది. ఇందులో భాగంగా కంపెనీ ఇప్పుడు తమ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మెరుగుపరచాలని చూస్తోంది.

తాజాగా, ఓలా ఎలక్ట్రిక్ ఫాస్ట్ ఛార్జింగ్ సెల్ టెక్నాలజీతో పనిచేసే స్టోర్డాట్ (StoreDot) అనే కంపెనీతో ఓ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ ఇరు సంస్థలు కలిసి కేవలం 5 నిమిషాల్లోనే పూర్తిగా బ్యాటరీలను ఛార్ చేసే ఓ ఫాస్ట్ ఛార్జర్ను సిద్ధం చేయబోతున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ద్వారా ఈ సమాచారాన్ని వెల్లడించారు. భవిష్యత్ సెల్ టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నట్లు ఆయన చెప్పారు.

భారతదేశంతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా తాము పూర్తి ఈవీ పర్యావరణ వ్యవస్థను రూపొందిస్తున్నామని, ఇది టూ వీలర్, ఫోర్ వీలర్ మరియు సెల్ విభాగాల కోసం అందుబాటులో ఉంటుందని, ఇందులో తాము అతిపెద్ద గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ చేయనున్నామని చెప్పారు. ఓలా ఎలక్ట్రిక్ అధునాతన సెల్ టెక్నాలజీ, ఇతర బ్యాటరీల ఉత్పత్తి మరియు ప్రత్యామ్నాయ వనరుల అభివృద్ధి కోసం తమ ఆర్ అండ్ డి సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచుకోవాలని భావిస్తోంది.

ఓలా ఎలక్ట్రిక్ చేస్తున్న ఈ భారీ ఈ పెట్టుబడిలో భాగంగా, కంపెనీ ఇప్పుడు ఎక్స్ఎఫ్సి బ్యాటరీ సాంకేతికతను ఉపయోగించవచ్చు మరియు స్టోర్డాట్ ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీతో అనుసంధానించే బ్యాటరీలను కూడా తయారు చేయవచ్చు. ఓలా ఫ్యూచర్ఫ్యాక్టరీ నుంచి పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా సెల్ ఉత్పత్తి కోసం ఓ గిగాఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఆధునిక కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజీకి సంబంధించిన ప్రభుత్వ పిఎల్ఐ స్కీమ్ కోసం కంపెనీ ఇప్పటికే ఓ బిడ్ ను కూడా సమర్పించింది.

స్టోర్డాట్ 2-నిమిషాల ఛార్జ్ టెక్నాలజీపై కూడా పని చేయడంతో ఓలాకు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డీల్ కానుంది. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి భారతదేశం అంతటా తన ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం 4,000 పైగా ఛార్జింగ్ పాయింట్లను ఇన్స్టాల్ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా, బ్రిటీష్ పెట్రోలియం పంపుల వంటి బహిరంగ ప్రదేశాలతో పాటుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం ఓలా హైపర్చార్జర్లను ఏర్పాటు చేస్తున్నారు.

నివాస ప్రాంగణంలో కూడా వినియోగదారుల కోసం ఓలా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ యొక్క హైపర్ఛార్జ్ ఛార్జింగ్ స్టేషన్లు జూన్ 2022 వరకు ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. అంటే, ఈ ఏడాది జూన్ వరకు ఈ ఛార్జింగ్ స్టేషన్లలో స్కూటర్లను ఛార్జింగ్ చేయడానికి కస్టమర్లు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 2021లో, ఓలా ఎలక్ట్రిక్ తన మొదటి హైపర్చార్జర్ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

భారతదేశంలోని దాదాపు 400 ప్రధాన నగరాల్లోని 1,00,000 స్థానాలు మరియు టచ్పాయింట్లలో ఓలా హైపర్చార్జర్లను ఇన్స్టాల్ చేయాలని నిర్ణయించింది. ఓలా ఎలక్ట్రిక్ స్థాపిస్తున్న ఈ హైపర్ఛార్జర్ ల సాయంతో కేవలం 18 నిమిషాల్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీని 0 నుండి 50 శాతం వరకూ చార్జ్ చేసుకోవచ్చు. ఈ చార్జ్ సాయంతో ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్పై గరిష్టంగా 75 కిమీల దూరం ప్రయాణించవ్చచు. దీనిని పూర్తిగా చార్జ్ చేయడానికి కేవలం 40 నిమిషాల సమయం సరిపోతుంది.

ఓలా ఎలక్ట్రిక్ కారు కూడా వస్తోంది..
ఓలా తమ ఎలక్ట్రిక్ వాహనాల ప్రయాణాన్ని కేవలం స్కూటర్లతో నిలిపివేయకుండా, ఎలక్ట్రిక్ కార్లను కూడా ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఈ కంపెనీ భవిష్యత్తులో ఓ ఎలక్ట్రిక్ కారును కూడా తీసుకురాబోతోంది, దీనికి అనుగుణంగా ఇప్పుడు ఛార్జింగ్ టెక్నాలజీపై ఓలా ఎలక్ట్రిక్ భారీగా పెట్టుబడులను పెడుతోంది. 2023లో ఓలా ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి రావచ్చని భావిస్తున్నట్లు భవీష్ అగర్వాల్ గతంలో వెల్లడించారు.

భారతదేశం అంతటా హైపర్ఛార్జ్ నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ కొన్ని నెలల క్రితం వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్లో, కంపెనీ భారతదేశంలోని 400 నగరాల్లో లక్షకు పైగా ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తుంది, దీని విలువ సుమారు 2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉండొచ్చని అంచనా. ఇక ఓలా కొత్తగా తీసుకురాబోయే సూపర్ఫాస్ట్ చార్జర్ల సాయంతో కస్టమర్లు 5 నిమిషాల్లో ఛార్జింగ్ చేసుకునే సదుపాయాన్ని పొందినట్లయితే, అది ఓలా ఎలక్ట్రిక్కే కాకుండా మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్కు కూడా లాభదాయకంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








