నేనే నెంబర్ వన్.. హీరో ఎలక్ట్రిక్ను ఓవర్టేక్ చేసిన ఓలా ఎలక్ట్రిక్.. ఇప్పుడిదే నెంబర్ వన్..!
ఓలా స్కూటర్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రధానంగా వినిపించే పేరు ఇది. భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాన్ని ప్రారంభించిన కేవలం 5 నెలల్లోనే, ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) దేశంలోనే అత్యధికంగా ఎలక్ట్రిక్ స్కూటర్ లను విక్రయించిన సంస్థగా అవతరించింది. భారతదేశంలోని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఇప్పటి వరకూ అగ్రగామిగా ఉన్న హీరో ఎలక్ట్రిక్ (Hero Electric) బ్రాండ్ను రెండవ స్థానానికి నెట్టేసి, అగ్రస్థానాన్ని ఆక్రమించింది. గడచి నెలలో ఓలా ఎలక్ట్రిక్ 12,683 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది.

రవాణా మంత్రిత్వ శాఖ యొక్క వాహన పోర్టల్ ప్రకారం, ఏప్రిల్ 2022లో ఓలా 12,683 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. కాగా, ఇప్పటి వరకూ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న హీరో ఎలక్ట్రిక్ ఇప్పుడు మూడవ స్థానానికి పడిపోయింది. ఓలా ఎలక్ట్రిక్ తర్వాత, ఒకినావా (Okinawa) దేశంలో అత్యధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఏప్రిల్ నెలలో, ఒకినావా ఆటోటెక్ 10,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలను నమోదు చేసింది.

కాగా, ఏప్రిల్ 2022 నెలలో హీరో ఎలక్ట్రిక్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 50 శాతం క్షీణించి కేవలం 6,570 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే, హీరో ఎలక్ట్రిక్ మార్చి 2022లో మాత్రం 13,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి సానుకూల వృద్ధిని కనబరిచింది. ఓలా ఎలక్ట్రిక్ మరియు ఒకినావా స్కూటర్ల డిమాండ్ భారీగా పెరగడంతో హీరో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. గత ఐదు నెలలుగా ఓలా వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. వాహన పోర్టల్ నుండి వచ్చిన డేటా కూడా ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు గత ఏడాది డిసెంబర్ నుండి నిరంతరం పెరుగుతూనే ఉన్నాయని తెలియజేస్తోంది.

దేశంలోని టాప్ 5 ఎలక్ట్రిక్ వాహనాల జాబితాలో ఆంపియర్ (Amphere) మరియు ఏథర్ ఎనర్జీ (Ather Energy) బ్రాండ్ ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల పరంగా ఆంపియర్ నాల్గవ స్థానంలో ఉండగా ఏథర్ ఎనర్జీ ఐదవ స్థానంలో ఉంది. ఓలా మరియు ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగిన సంఘటనలు ఉన్నప్పటికీ, అమ్మకాలపై మాత్రం ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపలేదని ఈ గణాంకాలు తెలియజేస్తున్నారు. హీరో ఎలక్ట్రిక్ ఇలాంటి సంఘటనలు దూరంగా ఉన్నప్పటికీ, అమ్మకాలు మాత్రం భారీగా తగ్గాయి.

గడచిన రెండు నెలల్లో ఓలా, ఒకినావా, ప్యూర్ ఈవీ మరియు జితేంద్ర ఈవీ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగాయి. కొన్ని ప్రమాదాల్లో పలువులు మరణించగా, మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో, ఎలక్ట్రిక్ స్కూటర్లలో అగ్నిప్రమాదాల విషయంలో ప్రభుత్వం కూడా కఠినమైన వైఖరిని అవలంబించింది. ఇలాంటి కేసులను నిపుణుల కమిటీతో విచారించి, నిబంధనలు అతిక్రమించిన సదరు వాహన కంపెనీలపై భారీ జరిమానాలను విధించేలా ఆదేశాలు కూడా జారీ చేసింది.

ఈ విషయంలో డిఫాల్టింగ్ కంపెనీలను ప్రభుత్వం గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన క్వాలిటీ సెంట్రిక్ మార్గదర్శకాలు త్వరలో విడుదల కానున్నాయి. ఈ విధివిధానాలను పాటించడంలో ఈవీ కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ జరిమానా విధించడంతో పాటు ప్రభావితమైన మొత్తం వాహనాలను రీకాల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, ఇప్పుడిప్పుడే వేగంగా వృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు ఇలాంటి సంఘటనలు చాలా చేదువార్త అని నిపుణులు భావిస్తున్నారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరిన్ని పునరావృతం అయితే, ఇది భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ వేగాన్ని తగ్గించవచ్చు. కాగా, ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగడానికి గల కారణాలను తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ఫైర్ ఎక్స్ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ (సీఎఫ్ఈఈఏ) ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు నోటీసులు పంపించినట్లు సమాచారం. ఈవీలకు మంటలు అంటుకోవడంతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులు అనేక ఇతర ఇబ్బందులను కూడా ఎదుర్కుంటున్నారు. వీటిలో స్కూటర్ యొక్క పేలవమైన నిర్మాణ నాణ్యత, సాఫ్ట్వేర్ వైఫల్యం, బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్ కావడం మొదలైనవి ఉన్నాయి.

ఓలా విషయానికి వస్తే, ఈ బ్రాండ్ భారత మార్కెట్లో ఓలా ఎస్1 (Ola S1) మరియు ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro) అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఇవి రెండూ ఒకే రకమైన 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటాయి. అయితే, వీటి బ్యాటరీ ప్యాక్ మాత్రం వేర్వేరుగా ఉంటుంది. ఓలా ఎస్1లో 2.98 కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై 121 కిమీ సర్టిఫైడ్ రేంజ్ను అందిస్తుంది. దీని గరిష్టం వేగం గంటకు 90 కిమీగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. కాగా, ఓలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ 3.97 కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ను కలిగి ఉంటుంది. ఈ మోడల్ పూర్తి చార్జ్ పై 181 కిమీ రేంజ్ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








