ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నారా.. అయితే ఇది మీ కోసమే
దేశీయ మార్కెట్లో పెట్రోల్ మరోయు డీజిల్ ధరలు రోజు రోజుకి భారీగా పెరుగుతున్న కారణంగా, ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ కూడా భారీగా పెరుగుతోంది. ఈ కారణంగానే వాహన వినియోగదారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కొంత పెరుగుదలవైపు పయనిస్తోంది. అయితే ఇటీవల కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగదారులకు భయాందోళనలు కలిగిస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో తెలంగాణాలో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి 80 సంవత్సరాల వృద్ధుడు మరణించడం కూడా జరిగింది. జరుగుతున్న సంఘటనలను దృషిలో ఉంచుకుని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'ఓలా' ఏకంగా 1,441 యూనిట్లకు రీకాల్ ప్రకటించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

2022 మార్చి 26న పూణెలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగిన ఘటన కారణంగా ఈ రీకాల్ ప్రకటించడం జరిగింది. ఈ సంఘటనలో తమ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మంటలు రావడానికి కారణం ఏంటి అనేదానిపైన కంపెనీ దర్యాప్తు చేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను కూడా కంపెనీ త్వరలో వెల్లడిస్తుంది.

ప్రస్తుతం తమ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా ఉండాలనే నేపథ్యంలో ముందస్తు చర్యగా, ఆ బ్యాచ్లో తయారు చేయబడిన 1,441 స్కూటర్లను కంపెనీ రీకాల్ చేస్తోంది. రీకాల్ ప్రకటించిన స్కూటర్లను కంపెనీ యొక్క సర్వీస్ ఇంజనీర్లు టెస్ట్ చేస్తారు. ఇందులో భాగంగానే ఇంజినీర్లు ఎలక్ట్రిక్ స్కూటర్ లోని బ్యాటరీ సిస్టమ్, థర్మల్ సిస్టమ్ వంటి వాటిని కూడా పూర్తిగా టెస్ట్ చేయడం జరుగుతుందని కంపెనీ తెలిపింది.

ఓలా కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలో వినియోగించిన బ్యాటరీలు భారతీయ AIS 156 ప్రమాణాలతో పాటు యూరోపియన్ ECE 136 ప్రమాణాలకు కూడా అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకుని మరింత సమగ్ర తనికీ కోసం రీకాల్ ప్రకటించడం జరిగిందని తెలిపింది.

ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ మాత్రమే కాకూండా.. ఒకినావా కంపెనీ కూడా 3,000 యూనిట్లకు రీకాల్ ప్రకటించింది. అదేవిధంగా ప్యూర్ ఈవి కూడా జరిగిన సంఘటనల తరువాత 2,000 యూనిట్లకు రీకాల్ ప్రకటించింది. ఇప్పటికి ప్రమాదాలు జరిగిన ఘటనలపైన సమగ్రమైన విచారణ జరిపి తయారీదారులపైనా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం, సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (సీఎఫ్ఈఈఎస్) సంస్థకు వాహనాల్లో మంటలు చెలరేగడానికి గల కారణాలను తెలుసుకోవాలంటూ తెలిపింది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు కూడా నోటీసులు పంపింది. అంతే కాకుండా రోడ్డు మరియు రవాణా మంత్రిత్వ శాఖ కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా ప్రమాదాలకు గురి కావడంతో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీవాహన తయారీ కంపెనీలను హెచ్చరించారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో నాణ్యత ప్రధానమని, ఆ నాణ్యత లోపిస్తే తగిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు పేలిపోవడం వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు.

ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల దృష్ట్యా, ఎలక్ట్రిక్ వాహనాల్లో నాణ్యత లేదు అనే అనుమానం తలెత్తుతోంది. కావున ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే చాలామంది తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వినియోగంలో ఉండాలి, వాటి వల్ల పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలి అనే ఆలోచనలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరుగా అవుతున్నాయి.

మొత్తం మీద ఇప్పటి వరకు జరిగిన సంఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. అయితే ప్రజల్లో ఏర్పడిన భయాలను తొలగించడానికి వాహన తయారీ కంపెనీలు ఈ రీకాల్ ప్రకటించడం జరిగింది. తద్వారా వాటిని మరింత క్షుణ్ణంగా పరిశీలించి మళ్ళీ వినియోగదారులకు అప్పగించడం జరుగుతుంది.


Click it and Unblock the Notifications








