భవిష్యత్ ప్రణాళికలు వెల్లడించిన ఓలా ఎలక్ట్రిక్: వివరాలు
దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన వినియోగం రోజురోజుకి పెరుగుతోంది. అయితే ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు చాలా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదాలకు గురవుతుంటే, మరికొన్ని ఎలక్ట్రిక్ వాహాలలోని బ్యాటరీలు బాంబుల్లా పేలుతున్నాయి. ఇలాంటి సంఘటనలు ఏకంగా ప్రజల మరణాలకు దారి తీస్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అమితమైన ప్రజాదరణపొందిన 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) రాబోయే రోజుల్లో తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించనుంది, అనే విషయాలను ఈ రోజు వెల్లడించింది.

ఓలా ఎలక్ట్రిక్ 2022 ప్రారంభం నుంచినే 'అటానమస్ వెహికల్ టెక్నాలజీ'పైన పనిచేస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఇప్పుడు కంపెనీ దాని పని గురించి ప్రపంచానికి ఒక స్నీక్ పీక్ అందించింది. ఈ ఆధునిక టెక్నాలజీ వల్ల ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాలను పూర్తిగా నివారించడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

ఓలా కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ యొక్క ప్రోటోటైప్ అటానమస్ వెహికల్ లో 3 లైడార్ సెన్సార్లు, ఒక జిపిఎస్ సెన్సార్ మరియు ఆబ్జెక్ట్ డిటెక్షన్ కోసం ఒక కెమెరా రూపంలో సెన్సార్ వంటి వాటిని కలిగి ఉంటుంది. అంతే కాకూండా ఇందులో ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, ఆటో డ్రైవింగ్, క్రాష్ అవైడెన్స్, ఆటోమేటిక్ బ్రేకింగ్ మరియు ఆటో స్పీడ్ కంట్రోల్ వంటి ఆటోమాటిక్ డ్రైవింగ్ టెక్నాలజీలను పొందుతుంది.

మేము ఈ రోజు తమిళనాడులోని ఓలా ఎలక్ట్రిక్ యొక్క ఫ్యూచర్ఫ్యాక్టరీని సందర్శించినప్పుడు, వారు కంపెనీ యొక్క భవిష్యత్ ప్రణాళికలను గురించి తెలిపారు. అది మాత్రమే కాకుండా బ్యాటరీ టెక్నాలజీలు సంబంధించిన కొన్ని వివరాలను కూడా తెలిపారు. ఇందులో భాగంగానే కంపెనీ సొంతంగా బ్యాటరీలను తయారు చేసేందుకు కూడా సిద్దమవుతున్నట్లు తెలిపింది.

త్వరలో కంపెనీ ఓలా బ్యాటరీ సెల్ తయారీకి సన్నాహాలు సిద్ధం చేస్తుంది. ఇందులో 50GWh వరకు సామర్థ్యంతో సొంత సెల్ తయారీ కేంద్రాన్ని నిర్మించే పనిని కూడా త్వరలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు కంపెనీ CEO భవిష్ అగర్వాల్ తెలియజేసారు. అయితే కంపెనీ ప్రస్తుతం సౌత్ కొరియా నుంచి లిథియం-అయాన్ సెల్స్ దిగుమతి చేసుకుని వినియోగిస్తోంది.

ప్రస్తుతం సోత్ కొరియా నుంచి దిగుమతి చేసుకుంటున్న లిథియం-అయాన్ సెల్స్ LG Chem తయారు చేస్తుంది. వీరు తయారుచేసే ప్రతి బ్యాటరీ ప్యాక్లో ప్రస్తుతం మొత్తం 224 సెల్లు ఉన్నాయి. (అంటే ఒకవైపు 112 సెల్స్ ఉంటాయి కావున రెండువైపులా 224 సెల్స్ ఉంటాయి). ఈ బ్యాటరీ ప్యాక్లో ఉపయోగించే ప్రతి సెల్ బరువు 67 గ్రాములు వరకు ఉంటుంది. ఇందులో 'నికెల్ మాంగనీస్ కోబాల్ట్' కూడా ఉపయోగించబడుతుంది.

నికెల్ మాంగనీస్ కోబాల్ట్ సెల్ అధిక నిర్దిష్ట శక్తిని కలిగి ఉంటాయి. కావున ఇవి ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. కానీ ఓలా కంపెనీ క్యాథోడ్ కోసం కోబాల్ట్కు బదులుగా ఫాస్ఫేట్ను ఉపయోగించే 'లిథియం ఫెర్రో ఫాస్ఫేట్' కలిగి ఉన్న కణాలకు మారడానికి సిద్దమవుతున్నట్లు వెల్లడించింది.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే 'లిథియం ఫెర్రో ఫాస్ఫేట్' (LFP) ఎక్కువ రోజులు ఉపయోగించడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ కారణంగా ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించడానికి మంచి ఎంపికగా మారుతున్నాయి.

అది మాత్రమే కాకుండా.. ఓలా ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్యాక్లో సెల్ ప్లేస్మెంట్ కోసం థర్మల్ ఇంటర్ఫేస్ మెటీరియల్ బేస్డ్ ప్లాస్టిక్లను ఉపయోగించాలని యోచిస్తోంది. ఈ థర్మల్ ఇంటర్ఫేస్ మెటీరియల్ సమర్థవంతమైన థర్మల్ మేనేజ్మెంట్ను నిర్ధారించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

థర్మల్ ఇంటర్ఫేస్ మెటీరియల్ బేస్డ్ ప్లాస్టిక్ రెండు లేదా అంతకంటే ఎక్కువ ఘన ఉపరితలాల మధ్య ఉష్ణాన్ని బదిలీ చేస్తుంది మరియు బ్యాటరీలను డిశ్చార్జ్ చేయడం మరియు రీఛార్జ్ చేయడం ద్వారా ఉత్పత్తయ్యే ఇంటెన్సివ్ హీట్ ఎనర్జీని కూడా వెదజల్లుతుంది. మొత్తం మీద కంపెనీ రానున్న రోజుల్లో ప్రజలకు ఒక సురక్షితమైన ఎలక్ట్రిక్ వాహనాన్ని అందించడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది.


Click it and Unblock the Notifications








