ముందుకెళ్లనని మొరాయించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. గాడిదకు కట్టి ఊరేగించిన ఓనర్..!
పెట్రోల్ ధరలు భగ్గుమంటుడంతో వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఇవైనా వారిని మనశ్సాంతిగా ఉంచుతున్నాయంటే, అదీ లేదు. వీటిని కొన్ని మొదటి రోజు నుండే సమస్యలు మొదలవ్వడం, కంపెనీలు పూర్తి చార్జ్ పై 60 కిమీ నుండి 180 కిమీ రేంజ్ను క్లెయిమ్ చేస్తుంటే, వాటి వాస్తవిక రేంజ్ అందులో సగం కూడా ఉండకపోవడం, సర్వీస్ సమస్య వస్తే ఎవరిని సంప్రదించాలో తెలియకపోవడం, సమస్య గురించి చెప్పినా కంపెనీలు పట్టించుకోకపోవడం, పెరుగుతున్న ఈవీ అగ్నిప్రమాద సంఘటనలు ఇలా ప్రతి అంశం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఓలా ఎలక్ట్రిక్. ఈ బ్రాండ్ అతికొద్ది సమయంలోనే భారతదేశవ్యాప్తంగా మంచి పాపులారిటీని దక్కించుకుంది. అయితే, ఈ బ్రాండ్ అందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలుచేసిన వారిలో కొందరు ఇప్పటికీ సమస్యలను ఎదుర్కుంటూనే ఉన్నారు. ఆ సమస్యలను పరిష్కరించడంలో కంపెనీ విఫలం కావడంతో ఓలా ఎలక్ట్రిక్ పై తమ నిరసను వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి కంపెనీ తన సమస్యలను పట్టించుకోవం లేదని రోడ్డుపైనే నిలిచిపోయిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

తాజాగా, ఇప్పుడు మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి కూడా తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో సమస్యల గురించి కంపెనీకి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోలేదని దానిని గాడిదకు కట్టేసి ఊరంతా ఊరేగించాడు. వివరాల్లోకి వెళితే, మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన సచిన్ గిట్టే అనే వ్యాపారి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనుగోలు చేశాడు. ఈ స్కూటర్ ను కొన్న కొద్ది రోజులకే అది ఆన్ అడవడం ఆగిపోయింది. దీంతో ఓలా సంస్థకు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఓలా నుంచి సంతృప్తికరమైన స్పందన రాకపోవడంతో తనదైన శైలిలో నిరసన తెలిపాడు.
ఆగిపోయిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ను గాడిదను కట్టి, ఈ కంపెనీని నమ్మవద్దని ప్రజలను కోరుతూ పోస్టర్లు, బ్యానర్లతో పట్టణంలో ఊరేగించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సచిన్ గిట్టే తన పసుపు రంగు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను గాడిదకు కట్టి పట్టణంలోని రోడ్లపై ఊరేగించడాన్ని చూడవచ్చు. అంతే కాకుండా, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రింట్ చేసిన పోస్టర్లు కూడా గాడిదకు మరియు స్కూటర్కు కూడా అంటించారు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ను కొన్నికొద్ది రోజులకే ఆ వాహనం పనిచేయడం ఆగిపోయిందని సచిన్ గిట్టే ఈ వీడియోలో తెలిపాడు. అతను మరుసటి రోజే ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినా ఎన్నిసార్లు కస్టమర్ కేర్ కు కాల్ చేసిన స్పందన రాలేదని తెలిపాడు. అతను కంపెనీని సంప్రదించిన తర్వాత, ఓలా మెకానిక్ అతని స్కూటర్ని తనిఖీ చేసి అందులో సాంకేతిక సమస్య ఉందని సూచించినట్లు సమాచారం. అయితే, ఆ సమస్యను సరిచేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో సచిన్ ఈవిధమైన రీతిలో నిరసన తెలిపాడు.

స్థానిక వార్తా ఛానెల్ లెట్సప్ మరాఠీ ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో క్లిప్ ను షేర్ చేసింది. ఇందులో అతను తన ద్విచక్ర వాహనాన్ని గాడిదకు కట్టి, దానిపై "ఈ మోసపూరిత కంపెనీ ఓలాతో జాగ్రత్త వహించండి" మరియు "ఓలా కంపెనీకి చెందిన ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయవద్దు" అనే బ్యానర్లను కట్టి ఊరేగించాడు. ఈ నిరసన బీడ్ జిల్లాలోని పర్లీ ప్రాంతంలో కలకలం రేపింది మరియు అప్పటి నుండి ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఈ వ్యాపారి తన సమస్యపై వినియోగదారుల ఫోరమ్ను కూడా సంప్రదించినట్లు సమాచారం.

ఈ పాడైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ను తక్షణమే రిపేర్ చేయాని లేదా రీప్లేస్ చేయలేదని ఫిర్యాదు చేశారు. ఓలా నుంచి వినియోగదారులకు ఎలాంటి ఆర్థిక రక్షణ లేదని, ప్రభుత్వం ఓలాపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సచిన్ గిట్టే కోరారు. ఈయన సెప్టెంబరు 2021లో స్కూటర్ను బుక్ చేసుకోగా, అది అతనికి మార్చి 24, 2022న డెలివరీ చేయబడింది. కొన్న వారం రోజుల్లోనే అది పూర్తిగా ఆన్ కావడం ఆగిపోయింది. సోషల్ మీడియా వేదికగా ఓలా సంస్థపై నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.

అంతకు ముందు తమిళనాడులోని ఆంబూర్కు చెందిన పృథ్వీరాజ్ ఓ ఫిజియోథెరపిస్ట్, తాను గత మూడు నెలలుగా ఉపయోగిస్తున్న ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro) ఎలక్ట్రిక్ స్కూటర్లో మొదటి రోజు నుండే సమస్యలు ఉన్నాయని, ఈ విషయం గురించి ఓలా కంపెనీతో ఎంత మొర పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని వాపోయాడు. పృథ్వీరాజ్ ఈ వాహనం రిజిస్ట్రేషన్ మొదలుకొని దాని రేంజ్ వరకూ అనేక సమస్యలను ఎదుర్కున్నట్లు సమాచారం. తాను ఈ స్కూటర్ను నడుపుతుండగా, 44 కిమీ నడిరోడ్డుపై ఆగిపోయిందని, దీంతో చిర్రెత్తిన యజమాని ఆంబూర్ హైవే రోడ్ పక్కనే ఆగిపోయిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్పై పెట్రోల్ పోసి నిప్పంటించి తన నిరసను వ్యక్తం చేసినట్లు సన్ న్యూస్ తెలిపింది.

ఇదిలా ఉంటే, ఇటీవల పూణేలో ఒక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఉన్నట్టుండి మంటల్లో కాలిపోవడంతో పాటు మరికొన్ని ఈవీ అగ్ని ప్రమాదాలు నమోదు కావడంతో ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో సీరియస్ అయింది. ఈవీల తయారీలో సరైన నిబంధనలు పాటించకుంటే, కఠిన చర్యలు తీసుకుంటామని మరియు భారీ జరిమానాలు విధిస్తామని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీంతో ఓలా ఎలక్ట్రిక్ ఈ ప్రమాదానికి గల కారణాలను అన్వేషించేందుకు మొత్తం 1,441 యూనిట్ల ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు (రీకాల్) చేస్తున్నట్లు ప్రకటించింది.


Click it and Unblock the Notifications








