జులై 20వ తేదీ నుండి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్లు ప్రారంభం!
బెంగళూరుకి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ (Simple Energy), గతేడాది భారత మార్కెట్లో ఆవిష్కరించిన తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ "సింపుల్ వన్" (Simple One) కోసం జూలై 20, 2022 వ తేదీ నుండి టెస్ట్ రైడ్ లను ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ కోసం దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో దశలవారీగా టెస్ట్ రైడ్లు నిర్వహించబడతాయని కంపెనీ పేర్కొంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టాండర్డ్ (సింగిల్ బ్యాటరీ) మరియు లాంగ్-రేంజ్ (డబుల్ బ్యాటరీ) వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

సింపుల్ ఎనర్జీ 2021లో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ను ప్రారంభించడం ద్వారా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల ప్రీమియం లీగ్లో ఈ బ్రాండ్ కూడా ఒకటిగా మారింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని సింపుల్ వన్ అనే పేరుతో విడుదల చేశారు. ఇది పూర్తి చార్జ్ పై 236 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది, ఇది ఈ విభాగంలోనే అత్యధికం అని కంపెనీ పేర్కొంది. ఇది స్టాండర్డ్ టెస్టింగ్ కండిషన్స్ ప్రకారం నిర్ధేశించిన రేంజ్ అయినప్పటికీ, వాస్తవ-ప్రపంచ పరిస్థితులలో ఇది పూర్తి చార్జ్ పై దాదాపు 203 కిలోమీటర్ల రేంజ్ ను కలిగి ఉందని సింపుల్ ఎనర్జీ పేర్కొంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 7 ఇంచ్ టచ్స్క్రీన్ ఇన్స్ట్రుమెంట్ సిస్టమ్, 4G కనెక్టివిటీ, బ్లూటూత్ కనెక్టివిటీ, మ్యూజిక్ కంట్రోల్, జియోఫెన్సింగ్, రిమోట్ టెలిమెట్రీ, డాక్యుమెంట్ స్టోరేజ్, ఫైండ్ మై బైక్ మరియు ప్రివెంటివ్ మెయింటెనెన్స్ వంటి కొన్ని అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఆన్బోర్డ్ నావిగేషన్ ఉంటుంది మరియు బ్లూటూత్ సాయంతో సంగీతం మరియు ఫోన్ కాల్స్ ను యాక్సెస్ చేసుకునేందుకు వీలుగా వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్ ద్వారా స్కూటర్ కు రిమోట్ గా కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

ఈ స్కూటర్ ముందు మరియు వెనుక భాగంలో పూర్తి ఎల్ఈడి లైటింగ్, సీటు క్రింది భాగంలో 30 లీటర్ల బూట్ స్పేస్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ను వంటి ప్రధానమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు బ్యాటరీ ప్యాక్ల ద్వారా శక్తిని పొందుతుంది, వాటిలో ఒకటి స్థిరంగా ఉంటుంది మరియు మరొకటి తొలగించదగినది. మొత్తంగా, ఇది 4.8kWh సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 8.5 kW శక్తిని మరియు 72 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 2.9 సెకన్లలోనే గంటకు 0 నుండి 40 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఇది స్టాండర్డ్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలను కూడా కలిగి ఉంటుంది. సింపుల్ ఎనర్జీకి చెందిన సింపుల్ లూప్ అనే యాజమాన్య ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్, ఈ బ్రాండ్ స్కూటర్ బ్యాటరీని త్వరగా రీఛార్జ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇవి ప్రత్యేకంగా సింపుల్ ఎనర్జీ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. వీటి సాయంతో కేవలం 60 సెకన్లలో 2.5 కిలోమీటర్ల రేంజ్ కి సరిపడా చార్జ్ చేసుకోవచ్చు.

ఈ ఛార్జర్లను దేశవ్యాప్తంగా అమర్చాలని కంపెనీ యోచిస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే, సింపుల్ వన్ దేశంలో అత్యుత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్గా అవతరించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయినప్పటికీ, స్కూటర్ యొక్క డెలివరీలు అనేక సార్లు వాయిదా వేయబడ్డాయి మరియు బ్రాండ్ ఇంకా డెలివరీలను ప్రారంభించలేదు. దీనికి సంబంధించి, కంపెనీ ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో, EVల భద్రత అంశాన్ని దృష్టిలో ఉంచుకుని తమ స్కూటర్ల డెలివరీని వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.

ఇటీవలి కాలంలో, దేశంలో పలు బ్రాండ్లకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటల్లో కాలిపోయిన నేపథ్యంలో, సింపుల్ ఎనర్జీ ఇంజనీర్లు తమ స్కూటర్ విషయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా చూసుకునేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా, కంపెనీ వీటిని తిరిగి మరోసారి టెస్ట్ ట్రాక్కి పంపినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ టెస్టింగ్ దాదాపుగా ముగింపు దశకు వచ్చినట్లు కనిపిస్తోంది మరియు ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మోడల్ ను త్వరలోనే సింపుల్ ఎనర్జీ వెల్లడి చేయనుంది.

ప్రొడక్షన్ కు సిద్ధంగా ఉన్న మోడల్ ను బహిర్గతం చేయడానికి ముందు, సింపుల్ ఎనర్జీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెస్ట్ రైడ్ల కోసం తేదీలను ప్రకటించింది. ఇది బెంగుళూరు ఆధారిత బ్రాండ్ అయినందున, 2022 జూలై 20 మరియు 22 తేదీల మధ్య ముందుగా ఆ నగరంలో టెస్ట్ రైడ్లు జరుగుతాయి. ఆ తర్వాత చెన్నై, హైదరాబాద్, పూణే, ముంబై, పనాజీ, అహ్మదాబాద్, ఇండోర్, జైపూర్, ఎన్సిఆర్, లక్నో, పాట్నా మరియు భువనేశ్వర్ నగరాలలో టెస్ట్ రైడ్ లు ప్రారంభం కానున్నాయి.

ఈ టెస్ట్ రైడ్ లు సెప్టెంబర్ 15, 2022 వరకు కొనసాగుతాయని భావిస్తున్నారు. ఈ విషయంపై సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ సుహాస్ రాజ్కుమార్ మాట్లాడుతూ, "ఈ టెస్ట్ రైడ్లను ప్రారంభించడం ద్వారా తాము ఎంత బలమైన ఉత్పత్తిని నిర్మిస్తున్నామో వినియోగదారులకు తెలియజేయాలని అనుకుంటున్నామని, ఇప్పటికే ఈ స్కూటర్ కోసం వేచి ఉన్న వారికి గరిష్ట సంఖ్యలో టెస్ట్ రైడ్లను అందించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని, అదనంగా, రాబోయే నెలల్లో మరిన్ని నగరాలలో ఈ టెస్ట్ రైడ్ లను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నామని" చెప్పారు.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరల విషయానికి వస్తే, ఇందులో స్టాండర్డ్ వేరియంట్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 1.09 లక్షలు కాగా, పూర్తి చార్జ్ పై 300 కిలోమీటర్లకు పైగా క్లెయిమ్ చేయబడిన రేంజ్ కలిగి ఉన్న లాంగ్-రేంజ్ వేరియంట్ ధర రూ. 1.44 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. టెస్ట్ రైడ్ ప్రచారం ముగిసిన వెంటనే ఈ స్కూటర్ల డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. టెస్ట్ రైడ్ స్లాట్ను సింపుల్ ఎనర్జీ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. ఆటోమొబైల్స్ కి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుగులో తెలుసుకునేందుకు తెలుగు డ్రైవ్స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








