దేశవ్యాప్తంగా 3 కోట్ల సేల్స్తో హోండా యాక్టివా సరికొత్త రికార్డ్.. ఈ స్కూటర్ ఎక్కువగా కొనడానికి ఓ లెక్కుంది!!
స్కూటర్లు అనగానే ఎవరికైనా మొదటిగా గుర్తుకు వచ్చేది హోండా యాక్టివా. భారత మార్కెట్లో అంతగా ఈ స్కూటీ ప్రసిద్ధి పొంది ప్రజాదరణను దక్కించుకుంది. మార్కెట్లో ఎన్ని కొత్త స్కూటర్లు వచ్చినా యాక్టివాను అధిగమించలేకపోయాయనడంలో సందేహం లేదు. అంతగా వినియోగదారుల్లో విశ్వసనీయత సంపాదించింది.
హోండా యాక్టివా స్కూటర్ 110cc మరియు 125cc శ్రేణి స్కూటర్లుగా విక్రయించబడుతోంది. హోండా తన 22 ఏళ్ల సుదీర్ఘ కాలంలో భారత స్కూటర్ మార్కెట్లో అగ్రగామిగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో యాక్టివా బ్రాండ్ అమ్మకాలు ఇప్పుడు 3 కోట్ల యూనిట్ మార్కును దాటి చరిత్ర సృష్టించింది.

2001లో భారత్లో మొదటిసారిగా యాక్టివా స్కూటర్ భారీ స్థాయిలో విడుదల అయింది. ఈ స్కూటర్ను ప్రారంభించిన మొదటి దశాబ్దంలో కంటే వాటి విక్రయాలు ఇప్పుడు గణనీయంగా పెరిగాయి. హోండా యాక్టివా 2015లో అంటే ప్రారంభించిన 15 ఏళ్లలో మొదటి కోటి అమ్మకాల మైలురాయిని సాధించింది.
హీరో నుంచి విడిపోయిన తర్వాత భారత్లో ప్రారంభించబడిన జపాన్ సంస్థ హోండా యాక్టివా మొదటి ద్విచక్ర వాహనం యాక్టివా. యాక్టివా 100cc స్కూటర్గా విడుదలై.. హోండా 2001-02లో 55,000 యూనిట్లను విక్రయించింది. 2005-06లో 10 లక్షల విక్రయాల మార్కును అధిగమించింది. మూడేళ్ల తర్వాత నెలవారీ విక్రయాల సంఖ్య 50,000 మార్కును తాకడంతో, రెండవ తరం యాక్టివా 110cc ఇంజిన్ మరియు హోండా యొక్క కాంబి-బ్రేక్ సిస్టమ్తో ప్రవేశపెట్టబడింది.

ఇంకా హోండా మోటార్సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (HMSI) తన మొదటి కోటి యూనిట్ల మార్కును చేరుకోవడానికి పట్టే సమయం కంటే తక్కువ సమయంలో రెండు కోట్ల మైలురాయిని సాధించింది. మొదటి తరం హోండా యాక్టివా 2001లో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ మొదటి తరం మోడల్ భారత మార్కెట్లో సరికొత్త సంచలనం సృష్టించింది.
హోండా యాక్టివా 2008లో పెద్ద 110cc ఇంజిన్తో వచ్చింది. 2014లో యాక్టివా 3G విడుదలైంది. ఆ తర్వాత మరి కొన్ని నెలలకు యాక్టివా 125 ను ప్రవేశపెట్టింది. తర్వాత LED హెడ్లైట్లు మరియు DRLల లాంటి అధునాతన ఫీచర్లతో 2017లో యాక్టివా 5Gతో హోండా ప్రవేశపెట్టింది. యాక్టివా 6G స్కూటర్ మోడల్ 2019లో మార్కెట్లోకి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అనంతరం బీఎస్6 కర్బన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా నవీకరణ పొందింది.
2012-13లో యాక్టివా నెలవారీ విక్రయాలు 100,000 మార్కును అధిగమించింది. అంతే కాకుండా హోండా యాక్టివా భారత్లో 50 లక్షల విక్రయాల మైలురాయిని సాధించింది. ఒక సంవత్సరం తర్వాత, హోండా Activa iని ప్రారంభించింది. దాని హెచ్ఈటీ(Honda Eco Technology)తో ఇంజిన్ను నవీకరించి, మైలేజీని 60km/lకి పెంచింది.
హోండా మోటార్సైకిల్ & స్కూటర్ ఇండియా ప్రెసిడెంట్, CEO మరియు మేనేజింగ్ డైరెక్టర్ అట్సుషి ఒగాటా మాట్లాడుతూ.. 'హోండా యాక్టివా అద్భుతమైన ప్రయాణంపై మాకు చాలా గర్వంగా ఉంది. కేవలం 22 ఏళ్లలో 3 కోట్ల మంది కస్టమర్ల మైలురాయిని సాధించడం సంతోషంగా ఉంది. ఇది మా కస్టమర్లు మాపై ఉన్న తిరుగులేని మద్దతు మరియు నమ్మకానికి నిదర్శనం.' అని పేర్కొన్నారు.
హోండా మోటార్సైకిల్ & స్కూటర్ ఇండియా సేల్స్ & మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ మాట్లాడుతూ, 'బ్రాండ్ యాక్టివా మరియు హెచ్ఎంఎస్ఐపై విశ్వాసం ఉంచినందుకు 3 కోట్ల భారతీయ కుటుంబాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యాక్టివా ప్రారంభమైనప్పటి నుంచి అనేక మార్పులతో కొత్త మోడళ్లతో వచ్చింది. కస్టమర్ల అభిరుచి, అవసరాలకు అనుగుణంగా హోండా యాక్టివా నిరంతరం అప్గ్రేడ్ అవుతోంది.' అని తెలిపారు.


Click it and Unblock the Notifications








