ఫెస్టివ్ సీజన్లో దుమ్ము లేపిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్.. వీటికి ఎందుకు ఇంత క్రేజ్.??
పండుగ సీజన్ సందర్భంగా ఆటో మేకర్లు ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లతో విపరీతమైన సేల్స్ను అందుకున్నాయి. ఈ వరుసలో ఓలా ఎలక్ట్రిక్ ముందు ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల సెగ్మెంట్లో ప్రత్యేక గుర్తింపును సాధించుకున్న ఓలా.. ఈ సారి పండుగ సీజన్లో వేల సంఖ్యలో స్కూటర్లను విక్రయించింది.
బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ.. S1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలతో ప్రతిసారీ సరికొత్త రికార్డులను సృష్టిస్తూ కస్టమర్ల ఫేవరెట్గా మారింది. ఫెస్టివ్ సీజన్ సందర్భంగా అక్టోబర్ నెలలో ఊహకందని సేల్స్ను నమోదు చేసింది. అందుకు సంబంధించిన వివరాలను ఓలా ఎలక్ట్రిక్ మంగళవారం ప్రకటించింది.

2023 అక్టోబర్ నెలలో 24,000 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లను ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గతంలో కంటే అమ్మకాలు 2.5 రెట్లు పెరగడం విశేషం. అదనంగా, ఇది ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్లో 35 శాతం వాటాను కొనుగోలు చేసింది.
ప్రతి పండుగ సీజన్లో దాదాపు అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలు సంతృప్తి స్థాయిలో విక్రయాలను నమోదు చేస్తాయి. ఈ సీజన్ ఓలా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. మరికొద్ది రోజుల్లో దీపావళి రానుండటంతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల జోరు మళ్లీ కొనసాగే అవకాశం ఉంది.

మొత్తంగా ఓలా ఎలక్ట్రిక్ ఈ ఏడాది ప్రారంభం నుంచి.. అంటే 10 నెలల్లో 2,00,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి రికార్డు సృష్టించింది. భారత టూ వీలర్ మార్కెట్లో ఈ ఘనత సాధించిన ఏకైక ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీగా ఓలా ఎలక్ట్రిక్ గుర్తింపు పొందడం విశేషం.
ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు వార్షికంగా 100 శాతం కంటే ఎక్కువ వృద్ధిని సాధించినట్లు ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది. కాగా గతేడాది ఇదే సమయంలో ఓలా కేవలం లక్ష యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను మాత్రమే విక్రయించగలిగింది. ఈ ఏడాది రెట్టింపు ఫలితాలను సాధించింది.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్పై కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడారు. పండుగ సీజన్లో ఓలా ఎలక్ట్రిక్ వాహనాలకు అద్భుతమైన డిమాండ్ ఉందని చెప్పారు. దసరా పండుగ నేపథ్యంలో మంచి సేల్స్ను సాధించగా.. దీపావళి సందర్భంగా ఈ దూకుడు కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం భారతీయ EV మార్కెట్లో ఓలా కొత్త మైలురాయిని సాధించిందన్నారు.
ఇక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయానికొస్తే టాప్-ఎండ్ మోడల్ S1 ప్రో ధర రూ. 1,47,499 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. పూర్తి ఛార్జ్పై 195 కిలోమీటర్ల రేంజ్ను ఇస్తుంది. గరిష్ఠంగా 120 kmph వేగంతో ప్రయాణిస్తుంది. Ola S1 ఎయిర్ ఈవీ ధర రూ. 1,19,999 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. పూర్తి ఛార్జ్పై 151 కి.మీ రేంజ్ ఇస్తుంది.
ఓలా ఇటీవల విడుదల చేసిన Ola S1X ఈవీ ధర రూ. 1,09,999 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇప్పటికే డెలివరీల కోసం డీలర్షిప్లను చేరుకుంది. ఇందులో 3 kWh కెపాసిటీ బ్యాటరీ ప్యాక్ని ఉపయోగించారు. పూర్తి ఛార్జింగ్పై 151 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఇందులో 5-అంగుళాల LCD డిస్ప్లే, OTA అప్డేట్తో సహా డజన్ల కొద్దీ ఫీచర్లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








