Ola Electric: ‘ఓలా ఎలక్ట్రిక్’ స్కూటర్లకు క్రేజీ డిమాండ్..ఏడాదిలోనే 2.50 లక్షల ఇ స్కూటర్ల సేల్స్తో రికార్డ్
భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో ఓలా ఎలక్ట్రిక్(Ola Electric) ఆధిపత్యం చెలాయిస్తోంది. ఏ సంస్థ సాధించని స్థాయిలో అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటోంది. ప్రతి నెలా ఇ స్కూటర్ల విక్రయాల్లో టాప్లో నిలుస్తోంది. మొత్తంగా ఈ ఏడాది ఓలా ఎలక్ట్రిక్ ఎన్ని స్కూటర్లు విక్రయించింది పూర్తి వివరాలు ఈ కథనంలో..
భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ మోడల్ హోండా యాక్టివా(Honda Activa). టూ వీలర్ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ ఇదే.. అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రస్తుత సంవత్సరంలో ఇలాంటి సూపర్ స్కూటర్కు సైతం కఠినమైన పోటీనిస్తూ పెద్ద సంఖ్యలో ఇ స్కూటర్ల(Ola Electric Scooter Sales In 2023)ను విక్రయించింది.

ఈ సంవత్సరం 2023లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు నమ్మశక్యం కాని సంఖ్యలో సేల్స్ను నమోదు చేసుకున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే 2.5 లక్షల యూనిట్లకు పైగా ఇ స్కూటర్లను ఓలా సంస్థ విక్రయించింది. ఓలాతో పాటు భారత మార్కెట్లో ఏథర్ ఎనర్జీ, బజాజ్, టీవీఎస్, హీరో మోటోకార్ప్ వంటి ప్రముఖ కంపెనీలు ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో తమ ఉనికిని చాటుతున్నా.. ఓలా ఎలక్ట్రిక్ తన ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది.
మార్కెట్లో అత్యంత పోటీతత్వం ఉన్న టూ వీలర్ సెగ్మెంట్లో ఓలా ఎలక్ట్రిక్ వరుస విజయాలను నమోదు చేసుకుంటోంది. సరసమైన ధర, నాణ్యమైన పనితీరుతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీని విక్రయాల గణాంకాలే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా గత పండుగ సీజన్లో, అంటే నవంబర్లోనే, కంపెనీ 29,898 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది.
ఓలా ఎలక్ట్రిక్ జనవరి 1, 2023 నుండి డిసెంబర్ 21, 2023 వరకు 2 లక్షల 52 వేల 647 యూనిట్ల ఇ స్కూటర్లను విక్రయించింది. దీంతో భారతదేశంలోని మొత్తం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలలో ఓలా ఎలక్ట్రిక్ 31 శాతం వాటాను కలిగి ఉంది.
ప్రస్తుత విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 2023లో 131 శాతం అమ్మకాల వృద్ధిని సాధించి రికార్డు సృష్టించింది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది పూర్తి కావడానికి ఇంకా 9 రోజులు మిగిలి ఉండగా.. రానున్న ఈ రోజుల్లో విక్రయాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఎందుకంటే రానున్న 2024 కొత్త సంవత్సరంలో ప్రముఖ కంపెనీలు వాహనాల ధరలను పెంచబోతున్నాయి. అదేవిధంగా ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను సైతం ప్రకటిస్తున్నాయి. ఆ మార్గంలోనే ఓలా ఎలక్ట్రిక్ కూడా డిస్కౌంట్ రేట్లు మరియు సులభమైన నెలవారీ వాయిదాల ప్రణాళికలను కూడా ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది.
ఇవే కాకుండా, కొన్ని క్యాష్ బ్యాక్ మరియు వాల్యూ యాడెడ్ ఆఫర్లను కూడా ఓలా ఎలక్ట్రిక్ ప్రవేశపెట్టింది. దీంతో దేశంలో ప్రస్తుతం ఓలా విక్రయాలు మరింతగా పెంచుకునే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ తర్వాత, టీవీఎస్ మోటార్స్ అత్యధిక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయిస్తోంది. ఈ ఏడాది టీవీఎస్ 1,62,399 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది.
మరో ఎలక్ట్రిక్ స్కూటర్ల సంస్థ ఏథర్ ఎనర్జీ ఈ ఏడాది 1.01 లక్షల యూనిట్లను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే టీవీఎస్ ఈ ఏడాది 19.60 శాతం విక్రయ వృద్ధిని సాధించింది. ఈథర్ 12.30 శాతం వృద్ధిని నెలకొల్పింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే ఎలక్ట్రిక్ స్కూటర్లకు దేశ ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని తెలుస్తోంది.
కాగా 2023 సంవత్సరం ముగింపు సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ 'డిసెంబర్ టు రిమెంబర్'(December To Remember) అనే కార్యక్రమాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ధరల తగ్గింపును ప్రకటించింది. S1 X-Plus (S1 X+) ఎలక్ట్రిక్ స్కూటర్పై ఏకంగా రూ. 20 వేలు తగ్గించింది. ఈ తగ్గింపుతో ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 89,999 గా ఉంది.


Click it and Unblock the Notifications








