40 శాతం వాటాతో ‘ఓలా ఎలక్ట్రిక్' ఆధిపత్యం.. డిసెంబర్లో 30 వేల స్కూటర్ల సేల్స్
2023 సంవత్సరంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్లో ఓలా ఎలక్ట్రిక్(Ola Electric Sales In December) అరుదైన ఘనత సాధించింది. ఒక్క ఏడాదిలోనే 2.65 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించి రికార్డ్ సృష్టించింది. అంతేకాకుండా డిసెంబర్లో 30,000 కు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
దేశంలో ఈవీలకు క్రేజ్కు పెరుగుతోంది. గతేడాది మార్కెట్లో లక్షల సంఖ్యలో అమ్మకాలు నమోదు చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలే ఇందుకు నిదర్శనం. ఈ మేరకు విడుదలైన నివేదికలే చెబుతున్నాయి. అయితే భారత మార్కెట్లో ఈ ఘనత సాధించిన తొలి కంపెనీ ఓలా అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

2024 కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో.. అన్ని వాహనాల తయారీ కంపెనీలు గత డిసెంబర్తో పాటు గతేడాది 2023 మొత్తం అమ్మకాల నివేదికలు వెల్లడించాయి. ఇందులో భాగంగా Ola Electric కూడా సేల్స్ వివరాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, డిసెంబర్ నెలలో ఓలా మొత్తం 30,219 వాహనాలను విక్రయించింది. 40 శాతం వాటాతో ఎలక్ట్రిక్ టూ వీలర్ విభాగంలో అత్యధిక సంఖ్యలో స్కూటర్లను విక్రయించిన సంస్థగా నిలిచింది.
గతేడాది మొత్తంలో ఓలా 2023 డిసెంబర్లో అత్యధిక సంఖ్యలో వాహనాలను(Electric Scooters) విక్రయించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇది డిసెంబర్ 2022 నెల అమ్మకాలతో పోలిస్తే 74 శాతం వృద్ధిని సాధించింది. దీన్ని త్రైమాసిక ప్రాతిపదికన లెక్కించినా కూడా ఓలా అద్భుతమైన విక్రయాలను నమోదు చేయడం చెప్పుకోదగ్గ విషయం.

కాగా ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఓలా ఎలక్ట్రిక్(Ola Electric Scooters) 83,963 స్కూటర్ల అమ్మకాలు సాధించింది. గతేడాది మూడో త్రైమాసిక విక్రయ గణాంకాలతో పోలిస్తే ఇది 68 శాతం అధికంగా ఉంది. అదే సమయంలో, గత రెండవ త్రైమాసికంలో అమ్మకాలతో పోలిస్తే అమ్మకాలు 48 శాతం పెరిగాయని ఓలా ఎలక్ట్రిక్ వెల్లడించింది.
అంతేకాకుండా 2023 డిసెంబర్లో ఓలా కీలక మైలురాయిని కూడా చేరుకుంది. కంపెనీ మొత్తం 4 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేసి భారీ రికార్డు నెలకొల్పింది. కేవలం 24 నెలల్లోనే కంపెనీ ఈ ఘనత సాధించడం విశేషం. ఇక గత క్యాలెండర్ ఇయర్ 2023 ను పరిశీలిస్తే ఓలా ఎలక్ట్రిక్.. మొత్తం 2.65 లక్షల వాహనాలను విక్రయించి ఇతర సంస్థలకు తిరుగులేని పోటీనిచ్చింది.

ఇంత పెద్ద సంఖ్యలో స్కూటర్లను విక్రయించిన తొలి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఓలా ఎలక్ట్రక్ మాత్రమే. ఓలా తన స్కూటర్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి, వీటిపై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓలా స్కూటర్లు లాంచ్ అయినప్పుడు వీటిని కొనుగోలు చేయాలని చాలా మంది క్యూ కట్టారు. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా తన షోరూమ్లను ఏర్పాటు చేయడం ద్వారా విక్రయాలు ఇంకా సులభతరం అయ్యాయి.
భారత మార్కెట్లో మెరుగైన స్థాయిలో విక్రయాలను సాధించేందుకు ఓలా ఎప్పటికప్పుడు పలు ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. కంపెనీ ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన Ola S1 ప్రో(Ola S1 Pro) కూడా దాని లైనప్లో చేరింది. ఈ స్కూటర్ ధర ప్రస్తుతం రూ.1.47 లక్షలుగా ఉంది. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా S1 ఎయిర్(Ola S1 Air) ధర రూ.1.19 లక్షలుగా ఉంది.

ఇప్పుడు ఓలా నుంచి తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో ఇ స్కూటర్ Ola S1 X. ఈ స్కూటర్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. S1X ప్లస్ 3KWH బ్యాటరీ ప్యాక్తో అందుబాటులో ఉండగా, S1X ఇ స్కూటర్ను.. 2 Kwh బ్యాటరీ ప్యాక్తో కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్లను రూ.89 వేల నుంచి రూ.1.09 లక్షల ధరలో సంస్థ ప్రవేశపెట్టింది.
భారత మార్కెట్లో అత్యధిక సంఖ్యలో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తూ.. ఎలక్ట్రిక్ స్కూటర్లపై గొప్ప నమ్మకాన్ని తీసుకువచ్చిన కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ అని చెప్పడంలో సందేహం లేదు. ఇది ప్రస్తుతం 40 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. దీని ద్వారా కంపెనీ భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధిస్తుందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








