ట్రాఫిక్లో చూసినా, షోరూమ్లో ఎక్కడ చూసినా ఇదే.. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్
భారతదేశంలో టూ-వీలర్ నడిపే ప్రతి ఒక్కరికీ హోండా యాక్టివా స్కూటర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దశాబ్దాలుగా మధ్యతరగతి కుటుంబాల నమ్మకమైన వెహికల్గా మారిన ఈ స్కూటర్, సేల్స్ పరంగా మరోసారి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. మే 2026 నెల అమ్మకాల గణాంకాలను చూస్తే యాక్టివా డిమాండ్ ముందు మిగతా మోడల్స్ అన్నీ చాలా వెనుకబడిపోయాయి. ఈ స్కూటర్ పాపులారిటీ ఎంతలా ఉందంటే, మార్కెట్లో దీనికి ప్రధాన పోటీదారులుగా ఉన్న టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్ల మొత్తం కంబైన్డ్ సేల్స్ కూడా యాక్టివా సింగిల్ సేల్స్ కంటే చాలా తక్కువగా నమోదయ్యాయి.
జూపిటర్, యాక్సెస్ ఉమ్మడి అమ్మకాల కంటే ఎక్కువ
ఖచ్చితమైన నెంబర్ల లెక్కల్లోకి వెళ్తే.. గత మే నెలలో హోండా యాక్టివా ఏకంగా 2,28,955 యూనిట్లు అమ్ముడైంది. ఇదే సమయంలో టీవీఎస్ జూపిటర్ 1,24,767 యూనిట్లు, సుజుకి యాక్సెస్ 75,729 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ రెండు స్కూటర్ల అమ్మకాలను కలిపితే మొత్తం 2,00,496 యూనిట్లు అవుతుంది. అంటే ఈ రెండు కంపెనీల పాపులర్ స్కూటర్లు కలిసి సాధించిన అమ్మకాల కంటే మన హోండా యాక్టివా ఒక్కటే ఏకంగా 28,459 యూనిట్లు ఎక్కువగా అమ్ముడై తన నంబర్ వన్ స్థానాన్ని పదిలపరుచుకుంది.

గతేడాదితో పోలిస్తే అదిరిపోయే గ్రోత్ రేట్
గత ఏడాది (మే 2025) గణాంకాలతో పోల్చి చూస్తే హోండా, టీవీఎస్ కంపెనీలు మంచి వార్షిక వృద్ధిని సాధించాయి. మే 2025లో యాక్టివా 1,90,713 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది మే నెలలో అదనంగా 38,242 స్కూటర్లు అమ్ముడై 20.05 శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్కెట్ షేర్ లో కూడా యాక్టివా 18.04 శాతంతో టాప్ లో ఉంది.
అలాగే టీవీఎస్ జూపిటర్ గత ఏడాది మే నెలలో 97,606 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఈసారి 27,161 యూనిట్లు అదనంగా అమ్ముడై 27.83 శాతం వృద్ధితో 9.83 శాతం మార్కెట్ షేర్ సంపాదించింది. అయితే సుజుకి యాక్సెస్ మాత్రం గత ఏడాదితో (75,778 యూనిట్లు) పోలిస్తే ఈసారి 49 యూనిట్లు తక్కువగా అమ్ముడై స్వల్పంగా 0.06 శాతం మైనస్ గ్రోత్ తో 5.97 శాతం మార్కెట్ షేర్ దక్కించుకుంది.

ఎలక్ట్రిక్ విభాగంలోనూ హోండా సరికొత్త రికార్డు
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సంస్థకు పెట్రోల్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ టూ-వీలర్ (EV) సెగ్మెంట్ లో కూడా మే 2026 నెల అత్యంత అద్భుతంగా కలిసి వచ్చింది. ఈ విభాగంలో కంపెనీ తన చరిత్రలోనే అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. హోండా ఈవీ పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాక్టివా ఇ (Activa e:), QC1 ఇ-స్కూటర్లు కలిపి గత నెలలో మొత్తం 520 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2025 ప్రారంభంలో హోండా కంపెనీ ఇలెక్ట్రిక్ సెగ్మెంట్ లోకి అడుగుపెట్టిన తర్వాత, ఒకే నెలలో 500 మార్కును దాటడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి సరికొత్త ఈవీలు
ఎలక్ట్రిక్ విభాగంలో 520 యూనిట్ల అమ్మకాల సంఖ్య చూడటానికి చిన్నదిగా అనిపించినప్పటికీ, హోండా కంపెనీ ఇంకా ఈ మోడళ్లను భారతదేశంలోని అన్ని నగరాల్లో పూర్తిస్థాయిలో విక్రయించడం లేదు. కేవలం కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే విక్రయిస్తూ, క్రమక్రమంగా తమ నెట్వర్క్ను విస్తరిస్తోంది. లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ రెండు ఇలెక్ట్రిక్ స్కూటర్ల మొత్తం కంబైన్డ్ అమ్మకాలు 5,439 యూనిట్లకు చేరుకున్నాయి.

గత ఏడాది మే 2025లో అమ్ముడైన 383 యూనిట్లతో పోలిస్తే ఈసారి ఏకంగా 36 శాతం వృద్ధి నమోదైంది. మరోవైపు ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) కూడా మే నెలలో 42,192 యూనిట్ల అమ్మకాలతో, గతేడాది కంటే 52.64 శాతం అద్భుతమైన గ్రోత్ రేట్ ను సాధించి 3.33 శాతం మార్కెట్ షేర్ తో దూసుకుపోతోంది.


Click it and Unblock the Notifications