షోరూమ్కు రావడానికి కూడా టైం లేదు..చెన్నై నుంచే విదేశాలకు దూసుకెళ్లిన నిస్సాన్ కార్లు
చెన్నై సిటీ అనగానే సినిమానో, బీచులకో ఫేమస్ అని గుర్తొస్తుంది.. కానీ ఇప్పుడు కార్ల తయారీలోనూ ప్రపంచాన్ని శాసిస్తోంది. వచ్చిన వారిని ఆదరించే ఊరు అని చెన్నైకి పేరుంది. ఇప్పుడు నిసాన్ (Nissan) కంపెనీని కూడా అలాగే అక్కున చేర్చుకుంది. నిసాన్ కంపెనీ ఫ్యాక్టరీ నుంచి తయారవుతున్న కార్లు మన దేశంలోని షోరూమ్లకు వెళ్లడం కంటే ఎక్కువగా నేరుగా విదేశాలకే ఎగుమతి అవుతున్నాయి. తాజాగా నిసాన్ మోటార్ ఇండియా సృష్టించిన రికార్డులే ఇందుకు నిదర్శనం.
జపాన్ కార్ల దిగ్గజం నిసాన్ మోటార్ ఇండియా (Nissan Motor India) తన పదేళ్ల చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయి ఎగుమతులను నమోదు చేసింది. 2025 డిసెంబర్ నెలలో చెన్నైలోని తన ఫ్యాక్టరీ నుంచి ఏకంగా 13,470 యూనిట్ల కార్లను విదేశాలకు ఎగుమతి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

విచిత్రమేమిటంటే, అదే నెలలో మన దేశీయ మార్కెట్లో నిసాన్ అమ్మిన కార్ల సంఖ్య కేవలం 1,902 మాత్రమే. అంటే దేశీయంగా అమ్మిన కార్ల కంటే దాదాపు ఏడు రెట్లు ఎక్కువ కార్లను నిసాన్ ఎగుమతి చేసిందన్నమాట. దీన్ని బట్టి చూస్తే భారత్, ముఖ్యంగా చెన్నై.. నిసాన్ కంపెనీకి గ్లోబల్ ప్రొడక్షన్ హబ్గా మారిపోయిందని స్పష్టమవుతోంది.
ప్రస్తుతం నిసాన్ కంపెనీ తన మేడ్ ఇన్ ఇండియా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. అంటే భారతదేశంలో కార్లను తయారు చేసి, వాటిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విదేశీ మార్కెట్లలో విక్రయించడమే ఈ కంపెనీ ప్రధాన లక్ష్యం. డిసెంబర్లో సాధించిన 15,372 యూనిట్ల మొత్తం అమ్మకాలు నిసాన్ వృద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

కేవలం ఎగుమతులతోనే ఆగకుండా, 2026లో భారతీయ కస్టమర్ల కోసం సరికొత్త మోడళ్లను రంగంలోకి దించేందుకు కంపెనీ సిద్ధమైంది. ఇందులో భాగంగానే జనవరి 21, 2026న గ్రావైట్(Gravite) పేరుతో ఒక సరికొత్త 7-సీటర్ బి-ఎంబీపీ(B-MPV) కారును లాంచ్ చేయబోతోంది.
గ్రావైట్ లాంచ్ అయిన కొద్దిరోజులకే, అంటే ఫిబ్రవరి 4న టెక్టాన్(Tekton) అనే 5-సీటర్ సి-ఎస్యూవీ(C-SUV) ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయనుంది. వీటితో పాటు 2027 నాటికి మరో 7-సీటర్ ఎస్యూవీని కూడా మార్కెట్లోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ కార్లన్నీ వన్ కార్, వన్ వరల్డ్(One Car, One World) అనే ఫార్ములా పై తయారవుతున్నాయి.

అంటే భారత్లో తయారయ్యే ఈ కార్లు మన రోడ్లపై తిరగడమే కాకుండా, అదే క్వాలిటీతో విదేశీ రోడ్లపై కూడా దూసుకుపోతాయి. ఇలాంటి పటిష్టమైన ప్రణాళికతో నిసాన్ తన మార్కెట్ వాటాను పెంచుకోవాలని చూస్తోంది.
ఇది ఇలా ఉంటే ఎగుమతుల్లో సత్తా చాటుతున్న నిసాన్, ఇప్పుడు దేశీయంగా పెద్ద మొత్తంలో కస్టమర్లకు దగ్గరయ్యేందుకు తన షోరూమ్ల సంఖ్యను కూడా పెంచుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దేశవ్యాప్తంగా షోరూమ్ల సంఖ్యను 250కి భారీగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
దీనివల్ల నిసాన్ కార్లు కొనేవారికి సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్ లభ్యత సులభం అవుతుంది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా, పంజాబ్లోని హోషియార్పూర్ వంటి ప్రాంతాల్లో అత్యాధునిక 3S షోరూమ్లను కంపెనీ ప్రారంభించింది. కేవలం కార్లు అమ్మడమే కాకుండా, అమ్మకాల తర్వాత మంచి సేవలను అందించడమే తమ ఉద్దేశమని నిసాన్ అంటోంది.
మొత్తంగా ఒక్క డిసెంబర్ నెలలోనే 13 వేల కార్లను ఎగుమతి చేయడం అనేది భారత ఆటోమొబైల్ రంగానికి గర్వకారణం. ఇది కేవలం నిసాన్ విజయం మాత్రమే కాదు, భారతదేశం అంతర్జాతీయ తయారీ కేంద్రంగా ఎదుగుతోందనడానికి ఒక నిదర్శనం. 2026 ప్రారంభంలో రాబోతున్న కొత్త కార్లు నిసాన్ తలరాతను మార్చే అవకాశం ఉంది. చెన్నై గడ్డపై తయారైన కారును ప్రపంచమంతా మెచ్చుకుంటుంటే, దానికి మించిన సంతోషం ఏముంటుంది?


Click it and Unblock the Notifications








