జూన్ 2021లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల; వివరాలు
టాక్సీ సేవల ద్వారా భారతదేశానికి సుపరిచితమైన ఓలా సంస్థ, ఇప్పుడు తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీవైపు ఆసక్తి చూపుతున్న సంగతి మనందరికీ తెలిసినదే. ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్ను స్థాపిస్తున్న ఓలా ఎలక్ట్రిక్, భారతదేశంలో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ను జూన్ 2021 నాటికి దేశీయ విపణిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.

ఈ విషయాన్ని ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు పవిష్ అగర్వాల్ ధృవీకరించారు. ఈ స్కూటర్ ధర అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని కూడా ఆయన తెలిపారు.

ఎకనామిక్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "మా ప్రాజెక్ట్ కాలుష్య రహిత వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నంలో భాగంగా ఉంటుంది. మా హోసూర్ కర్మాగారం నిర్మాణం మొదటి దశ నిర్మాణాన్ని వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని యోచిస్తున్నాము. ప్లాంట్ పనులు పూర్తి కాగానే మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ను అమ్మకానికి తీసుకురాబోతున్నాం" అని అన్నారు.

ప్రస్తుతం మార్కట్లో లభిస్తున్న ఏథర్ 450ఎక్క్, బజాజ్ చేతక్ ఈవీ మరియు టీవీఎస్ ఐక్యూబ్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు లక్ష రూపాయలకు పైనే ఉన్న నేపథ్యంలో, ఇప్పుడు అందరి దృష్టి కొత్తగా రానున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వైపుకు మళ్లింది. దీనికితోడు కంపెనీ ఈ స్కూటర్ను సరసమైన ధరకే విక్రయిస్తామని ప్రకటించడంతో దీనిపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇటీవలి కాలంలో దేశంలో విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో, కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయటం ప్రారంభిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీ కూడా భారీగానే పెరిగింది. ఈ డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు ఓలా తమ ప్లాంట్ పనులను కూడా ముమ్మరం చేసింది.

ఓలా సంస్థ ట్రైల్ రన్ కోసం ఇప్పటికే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసి, దేశీయ రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. ఫ్యాక్టరీలో ఈ స్కూటర్ ఉత్పత్తి ప్రారంభం కాగానే, దీనిని దేశవ్యాప్తంగా విడుదల చేస్తామని కంపెనీ చెబుతోంది. మరో రెండు నెలల్లోగా ఈ స్కూటర్ కస్టమర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పవిష్ అగర్వాల్ చెప్పారు.

ఈ స్కూటర్ కోసం ఓలా ఎలక్ట్రిక్ తమిళనాడులోని హోసూర్లో 500 ఎకరాల విస్తీర్ణంలో ఓ అతిపెద్ద ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్ను నిర్మిస్తోంది. ఈ ప్లాంట్లో సంవత్సరానికి 10 మిలియన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేయవచ్చు. ఈ ప్లాంట్లో ఏర్పాటు చేయబోయే 10 ప్రొడక్షన్ లైన్స్ నుండి ప్రతి 2 సెకన్లకు 1 స్కూటర్ చొప్పున ఉత్పత్తి చేయవచ్చు.

ఓలా సంస్థ గడచిన సంవత్సరంలో నెథర్లాండ్స్కి చెందిన ఎటెర్గో అనే సంస్థను కొనుగోలు చేసింది. ఎటెర్గోకి చెందిన 'యాప్స్కూటర్' ఆధారంగానే ఓలా ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను తయారు చేస్తోంది. ఓలా తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తిని పూర్తిగా 100 శాతం స్థానికీకరించడం (లోకలైజ్) ద్వారా దీని ధరను అందరికీ అందుబాటులో ఉంచాలని భావిస్తోంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉపయోగించబోయే బ్యాటరీలు మరియు ఎలక్ట్రిక్ మోటార్లను ఓలా సంస్థే స్వయంగా తయారు చేసుకోనుంది. అంతేకాకుండా, ఈ స్కూటర్ తయారీలో అవసరమయ్యే సాంకేతికతలు మరియు సాఫ్ట్వేర్లను కూడా కంపెనీయే స్వయంగా అభివృద్ధి చేయాలనుకుంటోంది. ఇలా చేయటం వలన తక్కువ ధరకే ఈ స్కూటర్ను అందిచగలమని కంపెనీ భావిస్తోంది.

భారతదేశంలో తయారు కాబోతున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయిస్తామని, ఈ స్కూటర్ బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లను కలిగి ఉండి, అన్ని వర్గాల కస్టమర్లను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని కంపెనీ చెబుతోంది. మార్కెట్లో ఇంత హైప్ తెచ్చుకుంటున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్, భారత మార్కెట్లో ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొద్ది నెలలు ఆగాల్సిందే మరి.


Click it and Unblock the Notifications








