భారతదేశంలో టాప్ 10 ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్స్ ఇవే..
భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. దేశంలోకి కొత్త కంపెనీలు ప్రవేశించడంతో, కస్టమర్ల బడ్జెట్ మరియు ప్రాధాన్యతలకు అనుగుణంగా అనేక రకాల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. లో స్పీడ్, లో రేంజ్, హై స్పీడ్, హై రేంజ్, చవకైనవి మరియు ఖరీదైనవి ఇలా అన్ని విభాగాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి.

గతేడాది ఈ పరిశ్రమ ఈ సానుకూల ఫలితాలను నమోదు చేసుకుంది. గత 2020 సంవత్సరంలో మొత్తం 27,260 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అమ్ముడైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అమ్మకాల జాబితాలో టాప్-10 హీరో ఎలక్ట్రిక్ మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో ఓకినావా, ఆంపియర్, ఏథర్ ఎనర్జీ మరియు రివాల్ట్ బ్రాండ్లు ఉన్నాయి.

హీరో ఎలక్ట్రిక్ విషయానికి వస్తే, గతేడాది కంపెనీ మొత్తం 8,252 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించి, మొత్తం దేశీయ ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో 30 శాతం వాటాతో ఆధిపత్య స్థానాన్ని కలిగి ఉంది. హీరో ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా విస్తృతమైన సేల్స్ అండ్ సర్వీస్ నెట్వర్క్ని కలిగి ఉంది.

ఇకపోతే, ఈ జాబితాలో ఒకినావా ద్వితీయ స్థానంలో ఉంది. ఈ బ్రాండ్, దేశవ్యాప్తంగా నెమ్మదిగా తన డీలర్షిప్ నెట్వర్క్ను విస్తరిస్తోంది. ఈ కంపెనీ గత ఏడాది మొత్తం 5,601 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించి 20 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది.
| Rank | OEM | 2020 Sales | Market Share |
| 1 | Hero Electric | 8,252 | 30.3% |
| 2 | Okinawa | 5,601 | 20.5% |
| 3 | Ampere Electric | 4,521 | 16.6% |
| 4 | Ather Energy | 3,052 | 11.2% |
| 5 | Revolt Intellicorp | 2,095 | 7.7% |
| 6 | Bajaj | 1,243 | 4.6% |
| 7 | PURE EV | 718 | 2.6% |
| 8 | Benling India | 552 | 2.0% |
| 9 | Jitendra New EV | 434 | 1.6% |
| 10 | TVS | 232 | 0.9% |

ఆంపియర్ వెహికల్ 2020వ సంవత్సరంలో మొత్తం 4,521 యూనిట్లను విక్రయించి తృతీయ స్థానంలో ఉంది. ఈ బ్రాండ్ మార్కెట్లో 16.6 శాతం వాటాను కలిగి ఉంది. పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని, ఆంపియర్ తన నెట్వర్క్ను కూడా విస్తరిస్తోంది.

ఇకపోతే, బెంగుళూరుకి చెందిన ఏథర్ ఎనర్జీ, ప్రస్తుతానికి ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే తన ద్విచక్ర వాహనాలను విక్రయిస్తోంది. గత 2020లో ఈ కంపెనీ మొత్తం 3,052 యూనిట్లను విక్రయించి నాల్గవ స్థానంలో ఉంది. ఈ సమయంలో కంపెనీ మార్కెట్ వాటా 11.2 శాతం ఉంది.

ఎలక్ట్రిక్ మోటార్సైకిళ్ల విషయంలో సరికొత్త విప్లవానికి నాంది పలికిన రివోల్ట్ బ్రాండ్, గతేడాది మొత్తం 2,095 యూనిట్లను విక్రయించి, 7.7 శాతం మార్కెట్ వాటాతా ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచింది. కాగా, ఈ సంవత్సరం కంపెనీ అమ్మకాలు మరింత మెరుగ్గా ఉండొచ్చని కంపెనీ ధీమాగా ఉంది.

బజాజ్ తమ ఐకానిక్ చేతక్ స్కూటర్ బ్రాండ్ ఎలక్ట్రిక్ వెర్షన్ రూపంలో గతేడాది ప్రజలకు పరిచయం చేసిన సంగతి తెలిసినదే. గత 2020లో కంపెనీ 1,243 యూనిట్ల చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ సమయంలో కంపెనీ మార్కెట్ వాటా 4.6 శాతంగా ఉంది.

బజాజ్ తర్వాతి స్థానంలో ప్యూర్ ఈవి ఉంది. గత సంవత్సరం ఈ బ్రాండ్ 718 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించి, ఈ విభాగంలో 2.6 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. గత 2020లో టీవీఎస్ మొత్తం 232 యూనిట్ల ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది.

కాగా, భారత ప్రభుత్వం ఇటీవలే ఫేమ్-2 పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం క్రింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై డిస్కౌంట్లను అందిస్తోంది. ఫలితంగా కొత్త కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆకర్షితులవుతున్నారు.

అలాగే, దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి అనుగుణంగా, ఛార్జింగ్ మౌళిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది. రానున్న రోజుల్లో ఈ అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








