చిన్న ఉద్యోగులకు తక్కువ ధరలో ఏథర్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆగస్టు 29న గ్రాండ్ లాంచ్!
భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ రోజురోజుకూ వేగంగా పెరుగుతుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, తక్కువ మెయింటనెన్స్ ఖర్చు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి కారణాలతో కస్టమర్లు భారీగా ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఎలక్ట్రిక్ టూవీలర్ వాహనాల విభాగంలో పోటీ కూడా గణనీయంగా పెరిగింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రముఖ కంపెనీలు వరుసగా కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తూ తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) కూడా మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
ఇప్పటికే 450 సిరీస్, రిజ్టా వంటి మోడళ్లతో భారత ఈవీ మార్కెట్లో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న ఈ సంస్థ, ఇప్పుడు మరింత మందిని ఆకట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలో అధునాతన ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్ను అందించాలనే వ్యూహంతో కంపెనీ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి తీసుకువస్తుంది.

తాజా సమాచారం ప్రకారం, ఏథర్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను ఆగస్టు 29న భారత మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించనుందని తెలుస్తుంది. ప్రస్తుతం కంపెనీ ఈ మోడల్కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించకపోయినా, తక్కువ ధర, అధునాతన టెక్నాలజీ, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో ఈ స్కూటర్ను తీసుకురావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లాంచ్ సమయంలో దీని ఫీచర్స్ గురించిన వివరాలు అధికారికంగా తెలుస్తాయి.
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం చూసినట్లయితే, ఏథర్ ఎనర్జీ ప్రతి సంవత్సరం నిర్వహించే కమ్యూనిటీ డే ఈసారి ఆగస్టు 29న జరగనుంది. ఈ ఏడాదికి ఎ న్యూ డాన్ ఆఫ్ మ్యాజిక్ అనే థీమ్ను ప్రకటించింది. ఈ ట్యాగ్లైన్తోనే ఏథర్ కీలకమైన ఉత్పత్తిని ఆవిష్కరించబోతోందనే సంకేతాలు ఇచ్చింది. గత ఏడాది ప్రదర్శించిన EL01 కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధారంగా రూపొందించిన ప్రొడక్షన్ వెర్షన్ను ఈ వేదికపై పరిచయం చేయవచ్చు.

ఈ అంచనాలకు బలం చేకూరుస్తూ, ఇటీవలి ఏథర్ పేటెంట్ డిజైన్ చిత్రాలు కూడా కొత్త స్కూటర్ దాదాపు సిద్ధంగా ఉన్నట్లు సూచిస్తున్నాయి. కాన్సెప్ట్ మోడల్లో కనిపించిన స్టైలింగ్కు దగ్గరగా ఉండే డిజైన్, ఆధునిక లుక్స్, సింపుల్ బాడీ లైన్స్తో ఈ స్కూటర్ మార్కెట్లోకి రానుందని తెలుస్తోంది. ముఖ్యంగా యువతతో పాటు మధ్యతరగతి కుటుంబాలను ఆకట్టుకునేలా స్కూటర్ను రూ.1 లక్ష (ఎక్స్-షోరూమ్) తీసుకురావచ్చని అంచనా.
ప్రస్తుతం ఏథర్ అమ్ముతున్న 450 సిరీస్, రిజ్టా వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లు అన్నీ 450 ప్లాట్ఫామ్ ఆధారంగా రూపొందించబడ్డాయి. ఈ ప్లాట్ఫామ్ పనితీరు, టెక్నాలజీ పరంగా ఎంతో మెరుగ్గా ఉన్నప్పటికీ, ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండటంతో ఈ స్కూటర్ల ధర కూడా కాస్త అధికంగానే ఉంటుంది. అందుకే మరింత మంది వినియోగదారులను చేరుకోవాలనే లక్ష్యంతో ఏథర్ పూర్తిగా కొత్త EL ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేసింది.

గత ఏడాదే ఈ కొత్త ప్లాట్ఫామ్ను కంపెనీ పరిచయం చేయగా, ఇప్పుడు అదే ప్లాట్ఫామ్పై రూపొందించిన తొలి ప్రొడక్షన్ ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఈ కొత్త స్కూటర్ భారత బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో కీలకంగా నిలిచే అవకాశం ఉంది. ఆగస్టు 29న జరిగే కమ్యూనిటీ డే కార్యక్రమంలో ఈ స్కూటర్కు సంబంధించిన పూర్తి వివరాలు, ధర, రేంజ్, బ్యాటరీ, ఫీచర్లు అధికారికంగా వెల్లడయ్యే అవకాశముంది.


Click it and Unblock the Notifications