ఫేమ్ స్కీమ్ క్రింద గోవాలో 30 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం!
భారతదేశంలో ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాలను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ (హైబ్రిడ్ అండ్) ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకం యొక్క రెండవ దశలో భాగంగా గోవా ప్రభుత్వం నగరంలో 30 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది.

ఫేమ్ ఇండియా పథకం కింద మొత్తం 150 ఎలక్ట్రిక్ బస్సులను గోవాకు అప్పగించాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే 20 ఎలక్ట్రిక్ బస్సులను గోవాలో ప్రారంభించగా, తాజాగా మరో 30 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టారు. దీంతో గోవాలో ఇప్పటి వరకూ 50 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టినట్లయింది.

ఫేమ్ ఇండియా పథకం క్రింద దేశంలోని 65 నగరాల్లో మొత్తం 6,265 ఎలక్ట్రిక్ బస్సులు ఆమోదించబడ్డాయి. ఇందులో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించబడ్డాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి, ఫేమ్ 2 కింద ప్రభుత్వం అనేక మినహాయింపులు ఇస్తోంది.

ఈ స్కీమ్ క్రింద ప్రస్తుతం మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసే కస్టమర్లకు అనేక రకాల రాయితీలను అందిస్తోంది. ఇందులో ఎలక్ట్రి వాహనాల కొనుగోలుపై ధరలో తగ్గింపు, ఛార్జర్ కొనుగోలుపై తగ్గింపు మరియు ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలపై రాయితీలు మొదలైనవి ఇవ్వడం జరుగుతుంది.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, గోవాలో ఈ ఎలక్ట్రిక్ బస్సులను వర్చ్యువల్గా ప్రారంభించారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ డిజిటల్ ఈవెంట్ ద్వారా ఈ బస్సులను ప్రారంభించి, తన సందేశాన్ని తెలియజేశారు. గోవాలో ఈ 30 ఎలక్ట్రిక్ బస్సులను కదంబ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ప్రారంభించారు.

దేశంలో సున్నా కార్బన్ ఉద్గారాల వైపు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తున్నట్లు ప్రకాష్ జవదేకర్ చెప్పారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు సున్నా ఉద్గారాలను ఉత్పత్తి చేయటంతో పాటుగా ఎలాంటి శబ్ధాన్ని కూడా చేయవు.

ఫేమ్ ఇండియా పథకంలో భాగంగా, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దేశంలో 2000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ మరియు మౌళిక సదుపాయల నేపథ్యంలో రాబోయే నాలుగేళ్ళలో ఎలక్ట్రిక్ వాహనాల ధర మరింత తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం, ఈ ఎలక్ట్రిక్ బస్సులను దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నడుపుతున్నారు. ఇందులో ఇండోర్, లక్నో, జమ్మూ, ముంబై, పాట్నా తదితర నగరాలు ఉన్నాయి. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలపై పొందే ప్రయోజనాల పట్ల సంతోషంగా ఉన్నారని, కాలుష్యం లేని వాహనాలను నడిపేందుకు వారు ఇష్టపడుతున్నారని జవదేకర్ అన్నారు.

ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. అన్ని రకాల ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ప్రత్యేక దృష్టిని పెడుతున్నారు. కేవలం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసమే సరికొత్త కంపెనీలు కూడా పుట్టుకొస్తున్నాయి.

భారతదేశంలో గడచిన రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం జోరందుకుంది. ఇప్పటికే టాటా నెక్సాన్ ఈవీ, ఎమ్జి జెడ్ఎస్ ప్లస్, హ్యుందాయ్ కోనా వంటి ఎలక్ట్రిక్ కార్లు ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ మార్కెట్లో లభిస్తుండగా, లగ్జరీ విభాగంలో కూడా కొత్త ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వచ్చాయి.


Click it and Unblock the Notifications








