ఈయన తయారు చేసిన ఈ-సైకిల్ ఆగకుండా 50 కి.మీ వెళ్తుంది!
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు సంప్రదాయ ఇంధన వాహనాలకు బదులుగా ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాల కోసం చూస్తున్నారు. ఇందులో, భాగంగానే ఇప్పుడు అందరి దృష్టి ఎలక్ట్రిక్ వాహనాల వైపుకి మళ్లింది.

ఎలక్ట్రిక్ వాహనాలు పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైనవే కాకుండా, ఆర్థికంగా కూడా ఎంతో మేలైనవి. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు ఇప్పటికే మార్కెట్లోకి అనేక కొత్త కార్ మరియు టూవీలర్ కంపెనీలు ప్రవేశించాయి. అయితే, కొందరు ఔత్సాహికులు మాత్రం తామే స్వయంగా తమ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేసుకుంటున్నారు.

తాజాగా, అలాంటి సంఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడుకి చెందిన ఈ వ్యక్తి తయారు చేసిన ఎలక్ట్రిక్ సైకిల్ పూర్తి చార్జ్పై గరిష్టంగా 50 కిలోమీటర్ల రేంజ్ను ఆఫర్ చేస్తుందని చెబుతున్నాడు. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎస్ భాస్కరన్ అనే 33 ఏళ్ల వ్యక్తి కేవలం రూ.20,000 ఖర్చుతో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ను తయారు చేసినట్లు చెప్పాడు. ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఇంధన ధరల భారాన్ని తగ్గించడానికి ఈ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నట్లు ఆయన తెలిపాడు.

భాస్కరన్ ఈ ప్రయోగం కోసం ఓ సాధారణ సైకిల్ను తీసుకొని, మార్కెట్లో దొరికే ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి ఈ సైకిల్ను ఈ-సైకిల్గా మార్చేశాడు. మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా పొందిన భాస్కరన్ తన తెలివినంతా ఉపయోగించి ఈ ఎలక్ట్రిక్ సైకిల్ను రూపొందించాడు.

గతేడాది భారతదేశంలోకి ప్రవేశించిన కోవిడ్-19 మహమ్మారి కారణంగా భాస్కరన్ తన ప్రైవేటు ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఉద్యోగం పోయినా తాను మాత్రం కుంగిపోకుండా వ్యవసాయంపై దృష్టి సారించాడు. తన ఖాళీ సమయంలో ఊరికే కూర్చోకుండా ఈ ఎలక్ట్రిక్ సైకిల్పై పనిచేయటం ప్రారంభించాడు.

భాస్కరన్ ఇప్పుడు తన పొలం పనులకు ఈ ఈ-సైకిల్ మీదనే వెళ్తున్నాడు. ప్రస్తుతం ఇలాంటి ఎలక్ట్రిక్ సైకిళ్లను బయటి మార్కెట్లో కొనుగోలు చేయాలంటే సుమారు రూ.30,000 నుండి రూ.1 లక్ష వరకూ ఖర్చవుతుంది. అలాంటిది కేవలం రూ.20,000 బడ్జెట్నే భాస్కరన్ ఈ ఎలక్ట్రిక్ సైకిల్ను రూపొందించాడు.

రూ.2,000 ఒక పాత సైకిల్ను కొనుగోలు చేసి, మిగిలిన 18,000 లతో బ్యాటరీ, చార్జర్ మరియు ఎలక్ట్రిక్ సైకిల్ తయారీకి కావల్సిన విడిభాగాలను కొనుగోలు చేశాడు. భాస్కరన్ తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఇప్పుడు అతని ఊరిలో టాక్ ఆఫ్ ది విలేజ్గా మారింది.
ఈ ఈ-సైకిల్ తయారీలో భాస్కరన్ భారీ పరికరాలు లేదా యంత్రాలను ఉపయోగించలేదు. ఇంటిలో దొరికే వస్తువులు, పరికరాల సాయంతోనే దీనిని తయారు చేశారు. ఇందులో ఎలక్ట్రిక్ మోటారు, బ్యాటరీ కంట్రోలర్, బ్రేక్ కట్-ఆఫ్ స్విచ్ అమర్చినట్లు భాస్కరన్ తెలిపారు.
Note: Images Are For Representative Purpose


Click it and Unblock the Notifications








