ఫేమ్ 2 సబ్సిడీ సవరణ : రూ.42,000 తగ్గిన ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది, ఈ ప్రయత్నాల్లో ఒకటి ఫేమ్-2 పథకం. ఇటీవల, ఈ ఫేమ్ 2 పథకం క్రింద, ఎలక్ట్రిక్ వాహనాలపై అందిచే సబ్సిడీలను ప్రభుత్వం సవరించింది. దీంతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా దిగొస్తున్నాయి.

ఈ ఫేమ్ II స్కీమ్ క్రింద ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ఇచ్చే ప్రోత్సాహకాలను ఇటీవల భారత ప్రభుత్వం సవరించింది. ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉపయోగించే బ్యాటరీ ప్యాక్లో ప్రోత్సాహకాలను కిలోవాట్కు రూ.10,000 నుండి రూ.15,000 పెంచింది. ఈ ప్రోత్సాహకాలు 50 శాతం పెరగడంతో, తయారీదారులు కూడా తమ ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గిస్తున్నాయి.

మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను అదనంగా, గుజరాత్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచడానికి మరిన్ని అదనపు రాయితీలను ప్రవేశపెట్టింది. దీంతో గుజరాత్లో ఎలక్ట్రిక్ వాహనాలు మరింత చౌకైనవిగా మారాయి. ఈ నేపథ్యంలో, ఆంపియర్ అందిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు సుమారు రూ.50,000 మేర తగ్గాయి.

ఎలక్ట్రిక్ వాహనాలపై గుజరాత్ రాష్ట్రంలో అందిస్తున్న అదనపు సబ్సిడీల కారణంగా, ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా తగ్గాయి. ధరల తగ్గుదలతో ఇవి ఇప్పుడు రోజువారీ ప్రయాణ ఎంపికగా అవతరించాయి.

ఆంపియర్ వెహికల్స్, గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ యొక్క ఇ-మొబిలిటీ విభాగం. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ సవరణ కారణంగా ఆంపియర్ ఎలక్ట్రిక్ యొక్క పెద్ద ఇ-స్కూటర్ల ధరలు రూ.50 వేల మార్కుకు తగ్గాయి. గుజరాత్ రాష్ట్రం అనుసరిస్తున్న ఈ.వీ విధానం ఆంపియర్ వాహనాల ఖర్చును మరింత తగ్గించటానికి సహాయపడిందని చెప్పొచ్చు.

గుజరాత్లో ధరల సవరణకు ముందు రూ.74,990 ధరతో విక్రయిస్తున్న ఆంపియర్ మాగ్నస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు కేవలం రూ.47,990 లకే లభిస్తోంది. అంటే, ఈ స్కూటర్ ధరలో మొత్తం రూ.27,000 తగ్గింపు లభిస్తోందన్నమాట.

ఇదే రాష్ట్రంలో లభిస్తున్న మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఆంపియర్ జీల్ విషయానికి వస్తే, ఈ స్కూటర్ ధర ఇంతకుముందు 68,990 రూపాయలుగా ఉండగా, ఇప్పుడు కేవలం 41,990 రూపాయలకే లభిస్తోంది. దీని ధరను కూడా గరిష్టంగా రూ.27,000 మేర తగ్గించారు.

ఆంపియర్ మాగ్నస్ మరియు జీల్ యొక్క టాప్ స్పీడ్ గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్లుగా ఉంటుంది. ఈ రెండింటి బ్యాటరీ రేంజ్ విషయానికి వస్తే, ఇవి పూర్తి ఛార్జీపై 75 కిలోమీటర్ల రైడ్ రేంజ్ను అందిస్తాయి. మొబిలిటీ యొక్క అవసరాలకు అనుగుణంగా, దాని ఛార్జ్ 2 రోజుల వరకూ ఉంటుందని కంపెనీ పేర్కొంది.

భారతదేశంలో ఆంపియర్ ఎలక్ట్రిక్ తమ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకూ సుమారు 80,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఎలక్ట్రిక్ వాహన విక్రయాలను ప్రోత్సహించడానికి, భారత ప్రభుత్వం చేపట్టిన సబ్సిడీ సవరణలు దేశీయ ఈవీ పరిశ్రమ అవసరాలను తీర్చడానికి మంచి ఊతమిచ్చాయని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications








