కరోనా సెకండ్ వేవ్: నాలుగు రోజుల పాటు రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్స్ మూసివేత
భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ ప్రీమియం మోటారుసైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ తమ ప్లాంట్లను నాలుగు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో భారీగా పెరుగిపోతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఐషర్ మోటార్స్ యాజమాన్యంలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ, తమ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని మే 13వ తేదీ నుండి మే 16వ తేదీ వరకూ అన్ని ఉత్పత్తి కేంద్రాలను మూసివేయాలని నిర్ణయించింది. కంపెనీ ఈ షట్డౌన్ సమయాన్ని తమ తయారీ కర్మాగారాలలో నిర్వహణ కార్యకలాపాలను నిర్వహించడానికి ఉపయోగిస్తుంది.

కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో, అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలవుతోంది. ఈ నేపథ్యంలో, రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంట్లలో నాలుగు రోజుల పాటు ఉత్పత్తి నిలిచిపోవటం వలన ఈ మోటార్సైకిళ్ల కోసం ఇప్పటికే ఉన్న వెయిటింగ్ పీరియడ్ మరింత పెరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

రాయల్ ఎన్ఫీల్డ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం "దేశంలో కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా అత్యవర పరిస్థితి తలెత్తిందని, ఈ పరిస్థితుల్లో తమ సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకొని చెన్నైలోని తన కర్మాగారాల్లో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించినట్లు" పేర్కొంది.

భారతదేశంలో చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థకు తిరువాయత్తూర్, ఒరగడమ్, వల్లం వద్గల్ ప్రాంతాల్లో తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఈ ప్లాంట్లలో మే 13, 2021 తేదీ నుండి మే 16వ తేదీ వరకూ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. ఈ సమయంలో అన్ని ప్లాంట్లలో కంపెనీ మెయింటినెన్స్ పనులు నిర్వహించనుంది.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాయల్ ఎన్ఫీల్డ్ దేశంలోని తమ అన్ని డీలర్షిప్లు స్థానిక ప్రభుత్వాలు జారీ చేసిన నిబంధనలను పాటించాలని సూచించింది. చెన్నై, గుర్గావ్లలోని కార్పొరేట్ కార్యాలయాలతో సహా మిగతా ఉద్యోగులందరూ తదుపరి నోటీసు వచ్చేవరకు ఇంటి నుండి పని చేస్తూనే ఉంటారని కంపెనీ తెలిపింది.

మే 31 వరకూ యమహా ప్లాంట్స్ బంద్
ఇదిలా ఉంటే, జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా కూడా తమిళనాడు రాష్ట్రంలోని తమ కాంచీపురం ప్లాంట్లో మరియు ఉత్తరప్రదేశ్లోని సూరజ్పూర్ ప్లాంట్లో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. ఈ రెండు ప్లాంట్లను మే 15 నుండి మే 31, 2021 వరకు మూసివేయాలని కంపెనీ నిర్ణయించింది.

మే 16 వరకూ హీరో మోటోకార్ప్ ప్లాంట్స్ బంద్
భారతదేశపు అగ్రగామి టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ కూడా తమ ప్లాంట్ల షట్డౌన్ వ్యవధిని మే 16, 2021వ తేదీ వరకూ పొడగిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. హీరో మోటోకార్ప్ ఏప్రిల్ 22వ తేదీ నుండి తమ అన్ని ప్లాంట్లను మరియు పరిశోధనా కేంద్రాలను తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసినదే.

మే 15 వరకూ హోండా టూవీలర్ ప్లాంట్స్ బంద్
హోండా టూవీలర్స్ కూడా తమ నాలుగు ప్లాంట్లలో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. హోండాకి చెందిన మనేసర్ (హర్యానా), తపుకర (రాజస్థాన్), నర్సాపురా (కర్ణాటక) మరియు విఠాలాపూర్ (గుజరాత్) టూవీలర్ ప్లాంట్లలో మే 1, 2021వ తేదీ నుండి మే 15, 2021వ తేదీ వరకు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








