2015లో టీవీఎస్-బిఎమ్డబ్ల్యూ నుంచి రెండు సరికొత్త బైక్లు
చెన్నైకి చెందిన ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ మరియు జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ మోటార్సైకిల్ కంపెనీ బిఎమ్డబ్ల్యూ మోటారాడ్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, ఈ జాయింట్ వెంచర్ నుంచి 2015లో ఓ సరికొత్త లో-ఎండ్ ప్రీమియం మోటార్సైకిల్ విడుదల కానున్న సంగతి మనందరికీ తెలిసినదే.
అయితే, టీవీఎస్-బిఎమ్డబ్ల్యూ జాయింట్ వెంచర్ నుంచి వచ్చేది కేవలం ఒక్క బైక్ మాత్రమే కాదు, రెండు బైక్లు. వాస్తవానికి తొలుత ఈ రెండు సంస్థల కలయికతో ఓ 300సీసీ మోటార్సైకిల్ రూపుదిద్దుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా.. ఈ 300సీసీ బైక్ విడుదల తర్వాత ఈ జాయింట్ వెంచర్ మరో 50సీసీ బైక్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
టీవీఎస్ మోటార్ కంపెనీ, బిఎమ్డబ్ల్యూ మోటారాడ్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా, తొలి ద్విచక్ర వాహనాన్ని 2015 ద్వితీయార్థం నాటికి అందుబాటులోకి తీసుకువస్తామని టీవీఎస్ మోటార్ కంపెనీ చైర్మన్ వేణు శ్రీనివాసన్ గతంలో ఒకానొక సందర్భంలో వెల్లడించారు. కాగా.. ఈ మొదటి బైక్ విడుదలైన కొద్ది నెలలకే ఈ జేవీ నుంచి మరో బైక్ కూడా విడుదల కానుంది.

గడచిన సంవత్సరం ఏప్రిల్ నెలలో టీవీఎస్-బిఎమ్డబ్ల్యూ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, టీవీఎస్ రూ.150 కోట్ల పెట్టుబడిని వెచ్చిస్తుండగా, మోటార్సైకిళ్ల అభివృద్ధి, టెస్టింగ్ ఖర్చులను బిఎమ్డబ్ల్యూ భరించనుంది. బిఎమ్డబ్ల్యూ కోసం టీవీఎస్ తయారు చేసిచ్చే బైక్లను అంతర్జాతీయ మార్కెట్లలో బిఎమ్డబ్ల్యూ నెట్వర్క్ ద్వారా, భారత మార్కెట్లో టీవీఎస్ నెట్వర్క్ ద్వారా విక్రయించే అవకాశం ఉంది.
ప్రస్తుతం బిఎమ్డబ్ల్యూ 500సీసీ కన్నా ఎక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన బైక్లను మాత్రమే విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో, అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాల కోసం బడ్జెట్లో ఉండే లగ్జరీ మోటార్సైకిల్ అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో బిఎమ్డబ్ల్యూ మోటారాడ్ టీవీఎస్ సంస్థతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇప్పటికే టీవీఎస్ మోటార్ కంపెనీ, బిఎమ్డబ్ల్యూ కోసం ఓ సరికొత్త ప్లాట్ఫామ్ను తయారు చేస్తోంది. ఈ ప్లాట్ఫామ్పై బిఎమ్డబ్ల్యూ కోసం 250సీసీ నుంచి 500సీసీ రేంజ్లో బైక్లను టీవీఎస్ తయారు చేయగలదు.


Click it and Unblock the Notifications








