కుటుంబ నియంత్రణ ఆపరేషన్కి టాటా నానో ఫ్రీ

కుటుంబనియంత్రణ కోసం పురుషులు చేయించుకోవాల్సిన వేసెక్టమిను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బెంగళూరుకు చెందిన డాక్టర్ తిమ్మప్ప రూపొందించిన పథకం పలువుర్ని ఆకర్షిస్తోంది. కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్సలను మహిళలే అధిక సంఖ్యలో చేయించుకుంటున్నారు. పురుషులు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. వేసెక్టమి చేయించుకుంటే శక్తి హీనులమై పోతామని, దాంపత్య జీవితానికి పనికిరాకుండా పోతామనే అపోహ కూడా ఒక కారణం. ఇవన్నీ కేవలం అనుమానాలే కానీ నిజం కాదని భారీగా ప్రచారం చేసినా సానుకూల ఫలితం రాకపోవటంతో బెంగళూరుకు చెందిన డాక్టర్ తిమ్మప్ప సరికొత్త ఆలోచన చేశారు.
కానుకులతో ప్రజల మనసుల్ని ఎందుకు మార్చకూడదన్న ఆలోచన చేశారు. అందుకు ప్రతిరూపమే నానో కారు, మూడు బైకు బహుమతులు. దీనిపై ఆయన మాట్లాడుతూ ''ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఫలితం రాలేదు. నిర్ణీత సమయంలో శస్త్ర చికిత్సలు చేసుకున్న పురుషులను లక్కీడీప్ ద్వారా బహుమతులు అందజేయాలని నిర్ణయించాం. ఇందుకు ఒక నానో కారు, మూడు బైకులు ఇవ్వాలని నిర్ణయించాం'' అని చెప్పారు.
డాక్టర్ తిమ్మప్ప ఆలోచనకు కర్ణాటకలోని ముగ్గురు ఎమ్మెల్యేలు స్పందించారు. అవసరమైన నిధులను సమకూర్చేందుకు ముందుకొచ్చారు. దాసరహళ్లి ఎమ్మెల్యే మునిరాజు నానో కారు, యలహంక శాసనసభ్యుడు విశ్వనాథ్ మూడు మోటారు సైకిళ్లు, కృష్ణరాజపుర శాసనసభ్యుడు నందీశ్ రెడ్డి రెండు మోటారు బైక్లు కానుకలుగా ఇవ్వనున్నారు. వీటిలో నానో కారు, మూడు బైక్లు ఆపరేషన్ చేయించుకున్న వారికి కానుకలుగా ఇవ్వనుంటే, ఎక్కువ మందికి ఆపరేషన్లు చేయించిన ఆరోగ్య కార్యకర్తలకు రెండు బైకులను బహుమతిగా ఇవ్వనున్నారు. జులై 28న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వీటిని పంపిణీ చేయనున్నారు.


Click it and Unblock the Notifications








