ఈ ఆటోరిక్షాకు చార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు, నడుపుతుంటే అదే చార్జ్ అవుతుంది!
ప్రస్తుతం మన దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఈ పరిస్థితుల్లో కొనుగోలుదారులు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాల వైపుకు మారుతున్నారు. దేశంలో ఇప్పటికే, ఎలక్ట్రిక్ టూవీలర్లు విస్తృతంగా వినియోగంలోకి రాగా, ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ కార్ల వినియోగం కూడా పెరుగుతోంది.

ఈ ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ ఇంతటితో ఆగకుండా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మరియు కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ వైపుకు కూడా కదులుతోంది. సాధారణంగా, ఆటోరిక్షాలు అటు పట్టణాల్లో అయినా ఇటు పల్లెటూర్లలో అయినా సరసమైన ప్రజా రవాణా సాధానాలుగా ఉన్నాయి. టుక్ టుక్ గా ప్రాచుర్యం పొందిన ఈ ఆటోరిక్షాలు కేవలం మనదేశంలోనే కాదు, ఇతర ఆసియా దేశాల్లో కూడా బాగా ఆదరించబడ్డాయి.

అయితే, ఇప్పటి వరకూ ఉపయోగిస్తున్న ఆటోరిక్షాలలో ఎక్కువ శాతం పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనాలతో నడిచేవే కాగా, కొన్ని అర్బన్ ప్రాంతాల్లో మాత్రం సిఎన్జి మరియు బ్యాటరీ పవర్తో నడిచే ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, భవిష్యత్తులో ఆటోరిక్షాలన్నీ కూడా పూర్తిగా ఎలక్ట్రిక్ రూపంలోకి మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
తాజాగా, శ్రీలంకకు చెందిన 'Vega Innovations' (వేగ ఇన్నోవేషన్స్) అనే ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ 'ETX' (ఈటిఎక్స్) పేరుతో ఓ అధునాతన ఆటోరిక్షాను రూపొందించింది. ఇది ఆషామాషీ ఆటోరిక్షా కాదు, ఇదొక స్మార్ట్ ఎలక్ట్రిక్ ఆటోరిక్షా. ఫ్యూచరిస్టిక్ డిజైన్లో కనిపించే ఈ Vega ETX ఆటోరిక్షాను కంపెనీ అధునాతన సోలార్ టెక్నాలజీ ఉపయోగించి డిజైన్ చేసింది.

సాధారణంగా, ఆటోరిక్షాలు రోజంతా నిత్యం అటూ ఇటూ తిరుగుతూనే ఉంటాయి. మరి ఇలాంటి వాటిని ఎలక్ట్రిక్ రూపంలోకి మార్చడం వలన, ఆటో డ్రైవర్లు వాటిని చార్జ్ చేయటం కోసం గంటల తరబడి చార్జింగ్ స్టేషన్ల వద్ద వేచి ఉండాల్సి వస్తే, వారి ఆదాయం దెబ్బతింటుంది.

ఈ పరిస్థితిని పరిగణలోకి తీసుకున్న Vega Innovations తమ ETX ఆటోరిక్షాకు చార్జింగ్ సమస్యను తప్పించేందుకు దాని పైభాగం (రూఫ్)లో పెద్ద సోలార్ ప్యానెల్ను అమర్చింది. ఈ పవర్ఫుల్ సోలార్ ప్యానెల్ వలన ఆటోరిక్షా ఎండలో ప్రయాణిస్తున్నప్పుడు, ఆటోమేటిక్గా అందులోని బ్యాటరీలు కూడా చార్జ్ అవడం ప్రారంభిస్తాయి. ఫలితంగా, ఈ ఎలక్ట్రిక్ ఆటోరిక్షా రేంజ్ కూడా పెరుగుతుంది.

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, కేవలం సోలార్ ప్యానెళ్ల సాయంతోనే ఇది గరిష్టంగా 64 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. కంపెనీ అందులో అధునాతన LFP బ్యాటరీ ప్యాక్ లను ఉపయోగించనుంది. ప్రస్తుతం, ETX ఎలక్ట్రిక్ త్రీవీలర్ ప్రోటోటైప్ దశలో ఉన్నందున కంపెనీ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించలేదు.

సోషల్ మీడియా వేదికగా కంపెనీ విడుదల చేసిన టీజర్ వీడియోలో, ETX ప్లాట్ఫామ్ భవిష్యత్తు కోసం ఎలక్ట్రిక్ అర్బన్ మొబిలిటీ పరిష్కారం అవుతుందని తెలిపింది. ఈ కొత్త తరం ETX ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ సురక్షితమైన, పర్యావరణ అనుకూలమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన నగర ప్రయాణం కోసం రూపొందించబడిందని కంపెనీ తెలిపింది.

Vega ETX ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ సిల్హౌట్ చూడటానికి ట్రెడిషనల్ త్రీవీలర్ మాదిరిగానే ఉంటుంది. కాకపోతే, ఇది లేటెస్ట్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. దీని డిజైన్ లో షార్ప్ బాడీ లైన్స్ ను గమనించవచ్చు. ఇంకా ఇందులో ముందు వైపు పొడవాటి ఎల్ఈడి లైట్ బార్ ఉంటుంది, ఇది హెడ్లైట్ మాదిరిగా పనిచేస్తుంది.

ఇక సైడ్ ప్రొఫైల్ ను గమనిస్తే, డ్రైవర్ కుడి వైపు నుండి ప్యాసింజర్లు లోపలికి రావటం లేదా బయటకు వెళ్లడాన్ని నిరోధించేందుకు ప్రత్యేకమైన బాడీ ప్యానెల్ ఉంటుంది. ఎడమ వైపు నుండి ఆటోరిక్షాలోకి ప్రవేశించేందుకు లేదా నిష్క్రమించేందుకు ఓపెన్గా ఉంటుంది.

అలాగే, వెనుక డిజైన్ను గమనిస్తే, ఆటోరిక్షాలో చిన్నపాటి లగేజ్ను ఉంచడం కోసం కార్లలో మాదిరిగా పైకి తెరవగలిగే బూట్ డోర్ ఉంటుంది. రూఫ్ దిగువ భాగంలో గ్లాస్ డోర్ ప్యానెల్ మరియు దానికి ఇరువైపులా నిటారుగా ఉండే రెండు ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ఉంటాయి. మొత్తమ్మీద దీని డిజైన్ చూడటానికి ఆకర్షణీయంగానే కాకుండా, చాలా సురక్షితంగా కూడా అనిపిస్తుంది.
ఈ నెక్ట్స్ జనరేషన్ ఎలక్ట్రిక్ రిక్షాను కేవలం శ్రీలంక మార్కెట్లో మాత్రమే కాకుండా ఇతర దక్షిణ ఆసియా మార్కెట్లలో కూడా విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. వచ్చే ఏడాదిలో ఎప్పుడైనా ఈ అధునాతన Vega ETX ఆటోరిక్షా కాన్సెప్ట్ ఆధారంగా ఇందులో ఓ ప్రొడక్షన్-స్పెక్ మోడల్ని కంపెనీ మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం మనదేశంలో మహీంద్రా వంటి సంస్థలు మాత్రమే ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలను అందిస్తున్నాయి. కంపెనీ అందిస్తున్న మహీంద్రా ట్రియో (Mahindra Treo) ఇప్పుడు కొన్ని పట్టణ మార్కెట్లలో డీజిల్/పెట్రోల్ ఆటోరిక్షాలకు ప్రత్యామ్నాయంగా ఉంటోంది. ఇందులో ట్రియో మరియు ట్రియో యారీ అనే రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ. 2.43 లక్షలు మరియు రూ. 1.62 లక్షలుగా ఉన్నాయి. పూర్తి ఛార్జ్పై Mahindra Treo 170 కిలోమీటర్ల రేంజ్ను అందించగలదు. ఈ ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహనాలు కంపెనీ స్వయంగా అభివృద్ధి చేసిన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ను ఉపయోగిస్తోంది.

ట్రియో యొక్క నిర్వహణ వ్యయం కిలోమీటరుకు 0.38 పైసలు మాత్రమే ఉంటుందని బ్రాండ్ పేర్కొంది. ఇది డీజిల్ మోడల్తో పోలిస్తే సంవత్సరానికి రూ. 60,000 (ఇంధన ధర 2.10 / కిమీ) వరకు ఆదా చేస్తుందని తెలిపింది. ప్రస్తుతం, ఈ మోడళ్లు మూడు సంవత్సరాల లేదా 80,000 కిమీ వారంటీతో లభిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








