లగ్జరీ స్కూటర్లను విడుదల చేసేందుకు ఆడి సన్నాహాలు
ఇకపై ఆడి లగ్జరీ కార్లతో పాటుగా ఆడి లగ్జరీ స్కూటర్లు కూడా లభ్యం కానున్నాయి. జర్మనీకు చెందిన ఈ లగ్జరీ కార్ కంపెనీ గడచిన ఏప్రిల్ నెలలో 1.1 బిలియన్ డాలర్లను చెల్లించి ఇటలీకు చెందిన సూపర్బైక్ల తయారీ కంపెనీ డ్యుకాటిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్యుకాటి సహకారంతో ఆడి బ్రాండ్ లగ్జరీ మొబిలిటీ వాహనాలను ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని ఆడి తన మనసులో మాటను బయటపెట్టింది.
ఇందులో భాగంగా, లగ్జరీ అర్బన్ స్కూటర్లను ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నామని ఆడి పేర్కొంది. అయితే, అంతకు మించి మరిన్న వివరాలను పంచుకునేందుకు మాత్రం కంపెనీ విముఖత చూపింది. తమ లగ్జరీ స్కూటర్ను అభివృద్ధి చేయడానికి కావలసిన సాంకేతిక మద్దతును డ్యుకాటి నుంచి పొందనున్నామని మాత్రమే కంపెనీ తెలిపింది.
ఆడి కంపెనీ తాజా టూవీలర్ ప్లాన్ను గమనిస్తే, ఆడి తీసుకున్న ఈ నిర్ణయం తమ సమీప పోటీదారు బిఎమ్డబ్ల్యూకు చెక్ పెట్టేందుకేనని తెలుస్తోంది. బిఎమ్డబ్ల్యూ ఇప్పటికే తమ ద్విచక్ర వాహన యూనిట్ "బిఎమ్డబ్ల్యూ మోటారాడ్"తో టూవీలర్ మార్కెట్లో ప్రపంచ వ్యాప్తంగా ఓ వెలుగు వెలుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, బిఎమ్డబ్ల్యూ మోటారాడ్కు పోటీగా ఆడి-డ్యుకాటి మరిన్ని సూపర్బైక్లు మార్కెట్లోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అసరం లేదు.
గతేడాదిలో జరిగిన ఫ్రాంక్ఫర్ట్ అంతర్జాతీయ మోటార్ షోలో బిఎమ్డబ్ల్యూ ఓ లగ్జరీ ఎలక్ట్రిక్ స్కూటర్ 'కాన్సెప్ట్ ఈ'ను ఆవిష్కరించింది. ఇదే విధంగా హైబ్రిడ్ ద్విచక్ర వాహనాలను కూడా అభివృద్ధి చేయాలని బిఎమ్డబ్ల్యూ సన్నాహాలు చేస్తుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో బిఎమ్డబ్ల్యూకు పోటీగా ఆడి కూడా లగ్జరీ ద్విచక్ర వాహనాలను తయారు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అందుకే అర్బన్ మార్కెట్ల కోసం ఓ లగ్జరీ స్కూటర్ను ఉత్పత్తి చేయాలని ఆడి యోచిస్తోంది.


Click it and Unblock the Notifications








