ఆ నగరంలో ఏథర్ 450ఎక్స్ స్కూటర్ ధర రూ.15,000 తక్కువ
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ మరికొద్ది రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో అమ్మకాల కార్యకలాపాలను ప్రారంభిస్తామని ప్రకటించింది. ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఈవీ (ఎలక్ట్రిక్ వాహన) విధానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో కంపెనీ ఈ ప్రకటన చేసింది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇతర నగరాలతో పోల్చితే ఢిల్లీ మార్కెట్లో కంపెనీ ఫ్లాగ్షిప్ మోడల్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.15,000 తక్కువగా ఉంటుందని ఏథర్ ఎనర్జీ సీఈఓ తరుణ్ మెహతా ధృవీకరించారు. ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త ప్రయోజనాల వల్ల ఇది సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.

ఢిల్లీ సర్కారు ప్రవేశపెట్టిన కొత్త ఈవీ పాలసీ వలన ఈవీల తయారీదారులు మరియు ఈవీల కొనుగోలుదారులు ఇద్దరికీ లబ్ధి చేకూరుతుంది. ఈ కొత్త ప్రయోజనాలు ఫేమ్-2 పథకం ద్వారా అందుబాటులో ఉన్న వాటికి అదనంగా ఉంటాయి. ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా వేగంగా ఈవీలను విస్తరింపజేయాలనే లక్ష్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ కొత్త విధానాన్ని ప్రకటించారు.

కొత్త ప్రయోజనాలను ప్రకటించడంతో, 2024 నాటికి దేశంలో నమోదయ్యే మొత్తం వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ వాటాను 25 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వాటా కేవలం 0.2 శాతం మాత్రమే ఉంది.

ఏథర్ ఎనర్జీ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ వాహన తయారీదారు దేశవ్యాప్తంగా కొత్త మార్కెట్లలోకి ప్రవేశించనున్నట్లు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసినదే. వీటిలో హైదరాబాద్, పూణే, ఢిల్లీ మరియు ముంబై వంటి నగరాలు ఉన్నాయి.

హీరో మోటోకార్ప్ మద్దతుతో సంస్థ ఇటీవల రూ.84 కోట్ల నిధులను సమీకరించింది. కొత్త నిధులు దేశంలో తమ భవిష్యత్ విస్తరణ ప్రణాళికల కోసం ఉపయోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఏథర్ ఎనర్జీ దేశంలో తమ వ్యాపారాన్ని ఇతర నగరాలకు విస్తరించుకోవటంతో పాటుగా మార్కెట్లో పెరుగుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల డిమాండ్కు అనుగుణంగా కొత్త ఉత్పాదక సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఏథర్ హోసూర్లో కొత్త ఉత్పాదక సదుపాయాన్ని ప్రారంభిస్తోంది, ఈ ప్లాంట్లో ఏటా 1,00,000 యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది.

దశల వారీగా విస్తరణ మరియు ఉత్పత్తి పెరుగుదలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయడం ద్వారా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కంపెనీ యోచిస్తోంది. ఏథర్ ఎనర్జీ రాబోయే ఐదేళ్ళలో దేశవ్యాప్తంగా ఏథర్ గ్రిడ్ ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది, దీనివల్ల పబ్లిక్ ఛార్జింగ్ మరింత సులభతరం కావటమే కాకుండా, అన్ని రకాల బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహన యజమానులకు సైతం ఇది అందుబాటులో ఉండనుంది.

ఏథర్ 450ఎక్స్ ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ను సొంతం చేసుకోవడానికి వీలుగా కంపెనీ కస్టమర్లకు ఆకర్షణీయమైన మార్గాలను ప్రకటించింది. ఇందులో అనేక ఫైనాన్సింగ్ మరియు ఓనర్షిప్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఇవి కస్టమర్లకు ఎలక్ట్రిక్ స్కూటర్ యాజమాన్యాన్ని మరింత సులభతరం చేస్తాయి.

ఏథర్ ఎనర్జీ మార్కెట్ విస్తరణపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
ప్రస్తుతం ఏథర్ ఎనర్జీ అందిస్తున్నది ఒకటే మోడల్ అయినప్పటికీ, ఈ మోడల్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. రానున్న రోజుల్లో ఏథర్ ఎనర్జీ మరిన్ని కొత్త స్కూటర్లను పరిచయం చేయనుంది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఈవీ విధానంతో కస్టమర్లు ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా స్వీకరించడానికి దోహదపడుతుంది.


Click it and Unblock the Notifications








