భారత్లో విడుదలైన 2022 Apache RTR 200 4V బైక్: ధర రూ. 1.33 లక్షలు
ప్రముఖ బైక్ మరియు స్కూటర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ (TVS Motor)భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు కొత్త 2022 అపాచీ ఆర్టిఆర్ 200 4వి (2022 Apache RTR 200 4V) బైక్ విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ప్రారంభ ధర రూ. 1,33,840 (ఎక్స్-షోరూమ్). కొత్త 2022 అపాచీ ఆర్టిఆర్ 200 4వి గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త 2022 Apache RTR 200 4V బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి సింగిల్-ఛానల్ ABS మరియు డ్యూయల్-ఛానల్ ABS వేరియంట్స్. ఇందులో సింగిల్-ఛానల్ ABS వేరియంట్ ధర రూ. 1,33,840 (ఎక్స్-షోరూమ్) కాగా, డ్యూయల్-ఛానల్ ABS వేరియంట్ ధర రూ. 1,38,890 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త బైక్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి, చాలా అద్భుతంగా ఉంటుంది. కంపెనీ ఇప్పుడు ఈ మోటార్సైకిల్లో ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ (DRL)తో కూడిన కొత్త హెడ్ల్యాంప్ డిజైన్ను కూడా పరిచయం చేసింది. కావున మరింత అద్భుతంగా ఉంటుంది.

కొత్త 2022 Apache RTR 200 4V బైక్ మంచి డిజైన్ కలిగి ఉంటుంది. అయితే ఇందులో హెడ్లైట్ సెటప్ మాత్రమే అప్డేటెడ్ చేయబడి ఉంటుంది. మిగిలిన అంశాలు మొత్తం మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి. కావున స్టైలింగ్ కూడా అదే విధంగా ఉంటుంది.

2022 TVS Apache RTR 200 బైక్ మూడు రైడింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి స్పోర్ట్, అర్బన్ మరియు రెయిన్ మోడ్స్. ఇందులో ప్రీలోడ్-అడ్జస్టబుల్ షోవా ఫ్రంట్ సస్పెన్షన్, షోవా రియర్ మోనో-షాక్, TVS స్మార్ట్ కనెక్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ మరియు అడ్జస్టబుల్ బ్రేక్ మరియు క్లచ్ లివర్లు ఉన్నాయి.
2022 TVS Apache RTR 200 4V అధునాతన 197.75 సిసి, సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, 4-వాల్వ్, ఆయిల్-కూల్డ్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 9,000 ఆర్పిఎమ్ వద్ద 20.82 పిఎస్ పవర్ మరియు 7,800 ఆర్పిఎమ్ వద్ద 17.25 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది.

టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ కొత్త 2022 TVS Apache RTR 200 4V ని మొత్తం మూడు కలర్ ఆప్షన్లలో విడుదల చేసింది. అవి గ్లోస్ బ్లాక్, పెర్ల్ వైట్ మరియు మాట్ బ్లూ కలర్స్. ఇవన్నీ కూడా అద్భుతంగా మరియు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ బైక్ మంచి ఇంధన సామర్థ్యాన్ని అందించడమే కాకుండా మంచి పర్ఫామెన్స్ కూడా అందిస్తుంది.

ఇదిలా ఉండగా, కంపెనీ ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో పెట్టుబడి పెట్టడానికి ముందడుగు వేసింది. భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ తన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు తమిళనాడు ప్రభుత్వంతో ఎంఓయూపై సంతకం చేసింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

కంపెనీ తన ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయడానికి మరియు భవిష్యత్ సాంకేతికతలపై పని చేయడానికి TVS మోటార్ రాబోయే నాలుగేళ్లలో ఏకంగా రూ. 1,200 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీనికి సంబంధించి కోయంబత్తూరులో తమిళనాడు పెట్టుబడుల సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సమక్షంలో సంతకాలు చేసిన అవగాహనా పత్రాన్ని సమర్పించారు.
టీవీఎస్ మోటార్ కంపెనీ యొక్క పరిధిలో ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో కేవలం ఒకే ఒక స్కూటర్ మాత్రమే ఉంది. అది టీవీఎస్ ఐక్యూబ్. ఇది దేశంలో కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గతేడాది జనవరిలో విడుదలైంది. దీని ధర ఒక లక్ష రూపాయలకంటే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం దేశం మొత్తం మీద ఇది 33 నగరాలలో అందుబాటులో ఉంది.

టీవీఎస్ కంపెనీ యొక్క ఐక్యూబ్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది ప్రస్తుతం దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే భవిష్యత్ లో ఎలక్ట్రిక్ వాహనాలను మరింత పెంచడానికి కంపెనీ తగిన సన్నాహాలు సిద్ధం చేస్తుంది. కావున టీవీఎస్ ఎలక్ట్రిక్ వాహనాలు రాబోయే రోజుల్లో విరివిగా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








