తమిళనాడులో ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ
బెంగళూరుకు చెందిన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ, తమిళనాడులోని హోసూర్లో కొత్తగా ప్రారంభించిన ప్లాంట్లో తమ వాహనాల ఉత్పత్తిని ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఈ ప్లాంట్లో బ్రాండ్ యొక్క పాపులర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ను తయారు చేస్తున్నారు.

ఏథర్ ఎనర్జీ మొదట బెంగుళూరులోని వైట్ఫీల్డ్లో ఉన్న తయారీ కేంద్రంలో తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చేసేది. అయితే, ఈ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండటం మరియు కంపెనీ విక్రయిస్తున్న 450ఎక్స్ మోడల్కు విస్తృతమైన డిమాండ్ ఏర్పడటంతో కంపెనీ తమిళనాడులో కొత్తగా ఓ పెద్ద ఫ్యాక్టరీని ప్రారంభించింది.

తమిళనాడులోని పారిశ్రామిక ప్రాంతమైన హోసూర్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా ఏథర ఎనర్జీ తన కార్యకలాపాలను దేశవ్యాప్తంగా కొత్త మార్కెట్లకు వేగంగా విస్తరించడానికి వీలు కల్పిస్తుంది. తమిళనాడు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు ఏథర్ ఎనర్జీ కంపెనీకి లబ్ధి చేకూర్చనున్నాయి.

హోసూర్లో ఏర్పాటు చేసిన ఈ కొత్త ప్లాంట్ 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. తమిళనాడు ప్రభుత్వంతో కుదిరిన అవగాహన ఒప్పందంపై సంతకం చేసే సమయంలో, ఏథర్ ఎనర్జీ తమ కొత్త ప్లాంట్ ద్వారా ఐదేళ్ల కాలంలో 4,000 మందికి పైగా కొత్త ఉద్యోగావకాశాలను సృష్టించనున్నట్లు పేర్కొంది.

గైడెన్స్ తమిళనాడు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఏథర్ ఎనర్జీ సంస్థకు అభినందనలు తెలియజేసింది. "ఏథర్ ఎనర్జీ హోసూర్లో ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీని ప్రారంభించినందుకు అభినందనలు. ఎలక్ట్రిక్ మొబిలిటీ లక్ష్యాలను ముందుకు నడిపించడంలో ఇది తమిళనాడుకు ముఖ్యమైన మైలురాయి"గా ఉంటుందని సదరు ట్వీట్లో పేర్కొన్నారు.

ఏథర్ ఎనర్జీ తమ లేటెస్ట్ సిరీస్ డి నిధుల కోసం కంపెనీకి 35 మిలియన్ డాలర్ల తాజా పెట్టుబడి లభించినట్లు ఈ సంస్థ ఇటీవలే ప్రకటించింది. ఈ కొత్త పెట్టుబడి సాయంతో ఏథర్ ఎనర్జీ దేశవ్యాప్తంగా పలు కొత్త నగరాల్లో తమ వ్యాపారాన్ని విస్తరించనుంది. ఈ కొత్త మార్కెట్ల నుండి వచ్చే డిమాండ్ను హోసూర్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ తీర్చనుంది.

భారత మార్కెట్ కోసం ఏథర్ ఎనర్జీ తమ రెండవ దశ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. ఇందులో భాగంగా, కంపెనీ 2021 మొదటి త్రైమాసికం చివరి నాటికి భారతదేశంలోని 27 నగరాల్లో తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తోంది.

ఏథర్ ఎనర్జీ ఇప్పటికే ముంబై, ఢిల్లీ-ఎన్సిఆర్, పూణే మరియు హైదరాబాద్ వంటి వివిధ ప్రధాన మార్కెట్లలోకి ప్రవేశించింది, బెంగళూరు మరియు చెన్నైలలో పూర్తి స్థాయి కార్యకలాపాలతో పాటుగా దేశవ్యాప్తంగా 16 కొత్త నగరాల్లో 450ఎక్స్ స్కూటర్ను విడుదల చేసే తమ మొదటి దశ విస్తరణ ప్రణాళికను కంపెనీ వేగంగా ముందుకు తీసుకువెళ్తోంది.

ఏథర్ ఎనర్జీ అందిస్తున్న 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 6 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, ఇది 26 ఎన్ఎమ్ టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 2.9 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఐపి67 రేటెడ్ వాటర్ప్రూఫ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. కంపెనీ ఈ బ్యాటరీపై 3 ఏళ్ల సమగ్ర వారంటీని ఆఫర్ చేస్తోంది.

పూర్తి బ్యాటరీ ఛార్జ్పై 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 85 కిలోమీటర్ల రేంజ్ని అందిస్తుంది. ఈ స్కూటర్లోని బ్యాటరీని చార్జ్ చేసే ప్రతి నిమిషం 1.45 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్ లభిస్తుందని కంపెనీ తెలిపింది. దీని టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. ఇది కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 - 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.


Click it and Unblock the Notifications








