బ్యాటరీ లేకుండా వస్తున్న Bounce ఎలక్ట్రిక్ స్కూటర్.. మరి అదెలా పనిచేస్తుంది అనుకుంటున్నారా..?
బెంగళూరుకు చెందిన షేర్డ్ స్కూటర్ మొబిలిటీ కంపెనీ బౌన్స్ (Bounce) దేశంలో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ను అతి త్వరలో మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. భారతదేశంలో తమ ఈవీ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని బౌన్స్ ఓ ప్రటనలో పేర్కొంది. ఈ సంస్థ నుండి బౌన్స్ ఇన్ఫినిటీ (Bounce Infinity) అనే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కట్లోకి రానుంది. దీనిని పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయనున్నారు.

బౌన్స్ ఇన్ఫినిటీ ఇ-స్కూటర్లో అధునాతన పరికరాలు మరియు ఇంటెలిజెంట్ ఫీచర్లు ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బౌన్స్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను బ్యాటరీలను లేకుండా విక్రయించాలని ప్లాన్ చేస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లలో అత్యంత ఖరీదైన భాగం, అందులోని బ్యాటరీ. కాబట్టి, ఎలక్ట్రిక్ స్కూటర్ ను బ్యాటరీ లేకుండా విక్రయించడం ద్వారా తక్కువ ధరకే వీటిని అందించవచ్చని కంపెనీ చెబుతోంది.

మరి బ్యాటరీ లేకుండా స్కూటర్ ఎలా పనిచేస్తుంది?
బ్యాటరీ లేకుండా బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే కస్టమర్లకు కంపెనీ బ్యాటరీ స్వాపింగ్ సబ్స్క్రిప్షన్ (బ్యాటరీ మార్పిడి చందా) ఆప్షన్ ను అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ను కంపెనీ 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' అనే పేరుతో పిలుస్తుంది. ఇందులో భాగంగా, కస్టమర్లు బౌన్స్ సంస్థ నుండి బ్యాటరీని అద్దె ప్రాతిపదికన తీసుకోవచ్చు. ఈ విధానంలో బ్యాటరీపై పూర్తి హక్కులు కంపెనీకి ఉంటాయి. కస్టమర్లు వీటిని తమ ఇంటి వద్ద చార్జ్ చేసుకోవచ్చు లేదంటే బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లలో ఖాలీ బ్యాటరీని ఇచ్చేసి పూర్తిగా చార్జ్ అయిన బ్యాటరీని తీసుకోవచ్చు.

ఈ ప్రోగ్రామ్ లో భాగంగా నగరం అంతటా మార్చుకోగలిగిన బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్లను సెటప్ చేయడం బౌన్స్ ఈ సేవలను అందించనుంది. వినియోగదారు ఈ స్టేషన్లకు వెళ్లి ఖాలీ అయిన వారి స్కూటర్ బ్యాటరీలను అక్కడే మార్చుకొని, పూర్తిగా చార్జ్ అయిన బ్యాటరీని అమర్చుకొని ముందుకు సాగిపోవచ్చు. ఇలా చేయడం వలన బ్యాటరీపై కొనుగోలుదారులు చేసే ఖర్చును తగ్గించాలని కంపెనీ యోచిస్తోంది. దీని వలన ఎలక్ట్రిక్ స్కూటర్ ధర సుమారు 40-50 శాతం వరకూ తగ్గే అవకాశం ఉంది.

బౌన్స్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీకి మరియు బ్యాటరీ మార్పిడి మౌలిక సదుపాయాలను విస్తరించడం కోసం సుమారు 100 మిలియన్ డాలర్లు (సుమారు 740 కోట్ల) కు పైగా పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ప్రీ-బుకింగ్లు త్వరలోనే అధికారికంగా ప్రారంభమవుతాయి మరియు జనవరి 2022 నాటికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు కూడా ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.
కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ "మెరుగైన అత్యాధునిక పరికరాలు మరియు ఇంటెలిజెంట్ ఫీచర్ల"ను కలిగి ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో బౌన్స్ దాని ప్రత్యర్థుల నుండి వేరుగా ఉంచే ప్రధానమైన లక్షణం ఏంటంటే, దాని 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్'. బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క స్మార్ట్, రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీని కస్టమర్లు తమ సౌలభ్యం మరియు అవసరాలకు అనుగుణంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

బౌన్స్ ఈ సేవల కోసం తమ బ్యాటరీ-స్వాపింగ్ నెట్వర్క్ ను వేగంగా అభివృద్ధి చేస్తోంది. కంపెనీ ఈ సేవలను రిటైల్ కస్టమర్ లకి మాత్రమే కాకుండా దాని విజయవంతమైన రైడ్-షేరింగ్ వ్యాపారానికి కూడా విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. బౌన్స్ వినియోగదారులు కంపెనీ యొక్క స్వాపింగ్ నెట్వర్క్ సాయంతో పూర్తిగా ఛార్జ్ చేయబడిన బ్యాటరీని, ఖాళీ బ్యాటరీతో మార్చుకోవచ్చు. అయితే, ఇలా బ్యాటరీని మార్చుకున్నప్పుడల్లా బ్యాటరీ మార్పిడి కోసం కస్టమర్లు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

సంప్రదాయ పెట్రోల్ స్కూటర్లతో పోలిస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రన్నింగ్ ఖర్చులు కూడా సుమారు 40 శాతం వరకు తగ్గుతుందని కంపెనీ తెలిపింది. బౌన్స్ దేశంలో తమ స్వీయ-నిర్మిత (సెల్ఫ్-మేడ్) ఎలక్ట్రిక్ స్కూటర్ ను ప్రవేశపెట్టడానికి అవసరమైన అన్ని అనుమతులను కూడా ప్రభుత్వం నుండి పొందింది. నవంబర్ చివరి నాటికి బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ప్రీ-బుకింగ్లను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది నాటికి ఇది మార్కెట్లో విడుదల కానుంది.

బౌన్స్ ఇటీవలే 22 మోటార్స్ అనే కంపెనీలో 100 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ సుమారు 7 మిలియన్ డాలర్లు. 22 మోటార్స్తో ఒప్పందంలో భాగంగా, బౌన్స్ రాజస్థాన్లోని భివాడిలో ఉన్న దాని తయారీ కర్మాగారాన్ని కొనుగోలు చేసింది. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1,80,000 యూనిట్లు. ఇదిలా ఉంటే, బౌన్స్ దక్షిణ భారతదేశంలో మరో ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. అంతేకాకుండా, రాబోయే ఒక సంవత్సరంలో తమ ఈవీ వ్యాపారం కోసం 100 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు బౌన్స్ ప్రకటించింది.

బౌన్స్ 2022 నాటికి తన ఫ్లీట్ లోని అన్ని స్కూటర్ లను ఎలక్ట్రిక్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం, బౌన్స్ బెంగళూరు మరియు హైదరాబాద్ నగరాల్లో తమ సేవలను అందిస్తోంది. కంపెనీ బెంగళూరులో 22,000 మరియు హైదరాబాద్లో 5,000 స్కూటర్లతో రైడ్ బుకింగ్ సేవలను అందిస్తోంది. భవిష్యత్తులో, కంపెనీ ఇతర ప్రధాన నగరాల్లో సేవలను ప్రారంభించాలని యోచిస్తోంది.
బౌన్స్ స్కూటర్ రెంటల్ ప్లాట్ఫారమ్లో మూడు రకాల రైడ్లను అందిస్తుంది - షార్ట్ టర్మ్ రెంటల్, లాంగ్ టర్మ్ రెంటల్ మరియు రైడ్ షేర్. స్వల్పకాలిక అద్దెలో, స్కూటర్లను 2-12 గంటల వ్యవధి కోసం బుక్ చేసుకోవచ్చు. మరోవైపు, దీర్ఘకాల అద్దెలలో భాగంగా 15-45 రోజుల కోసం బుకింగ్ చేయవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీలోకి ప్రవేశించిన తర్వాత, బౌన్స్ ఈ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ మరియు సింపుల్ ఎనర్జీ వంటి సంస్థలు అందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications








