భారత మార్కెట్లో ఈవీట్రిక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ విడుదల: ధర, ఫీచర్లు, వివరాలు
దేశీయ మార్కెట్లోకి మరొక కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ప్రవేశించింది. ముంబైకి చెందిన ఈవీట్రిక్ (EVTRIC) మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్లో స్పీడ్ కేటగిరీలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఈవీట్రిక్ యాక్సిస్ మరియు ఈవీట్రిక్ రైడ్ పేర్లతో కంపెనీ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లో వీటి ధరలు ఇలా ఉన్నాయి:
* ఈవీట్రిక్ యాక్సిస్ - రూ.64,994
* ఈవీట్రిక్ రైడ్ - రూ.67,996
(రెండు ధరలు ఎక్స్-షోరూమ్)

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను యువకులు మరియు చిన్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. వీటితో పాటు, ఈవీట్రిక్ సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఈవీ మోటార్సైకిళ్లు మరియు ఎలక్ట్రిక్ త్రిచక్రాల వాహనాలను కూడా తయారు చేస్తుంది.

తాజాగా, విడుదల చేసిన ఈవీట్రిక్ యాక్సిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం నాలుగు రంగులలో అందుబాటులో ఉంటుంది. అవి: మెర్క్యూరీ వైట్, పెర్షియన్ రెడ్, లైమ్ ఎల్లో మరియు బ్రౌన్. అలాగే, ఈవీట్రిక్ రైడ్, సెరూలియన్ బ్లూ, పెర్షియన్ రెడ్, సిల్వర్, నోబుల్ గ్రే మరియు మెర్క్యూరీ వైట్ కలర్లలో లభిస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను కంపెనీ వెబ్సైట్, quickrycart.com, atiyaselectric.com మరియు ewheelers.in లో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చని ఈవీట్రిక్ సంస్థ తెలిపింది. త్వరలోనే వీటిని జీరో బుకింగ్ మొత్తంతో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా డిటాచబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్తో లభిస్తాయి. అపార్ట్మెంట్లలో నివసించే కస్టమర్లు లేదా పార్కింగ్ ప్లేస్లో చార్జింగ్ సౌకర్యం లేని కస్టమర్లు ఈ బ్యాటరీలను స్కూటర్ నుండి తొలగించి, ఇంటిలో ఉండే ఏసి వాల్ యూనిట్ ద్వారా చార్జ్ చేసుకోవచ్చు.

ఈవీట్రిక్ ఎలక్ట్రిక్ స్కూటర్లు 150 కిలోల లోడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీచిలో 250 వాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. రెండు ఇ-స్కూటర్లు పూర్తి బ్యాటరీలను పూర్తిగా చార్జ్ చేయటం కోసం సుమారు 3.5 గంటల ఛార్జింగ్ సమయం పడుతుంది. పూర్తి ఛార్జ్పై ఇవి 75 కిమీ కంటే ఎక్కువ రేంజ్ను ఆఫర్ చేస్తాయి.

ఈవీట్రిక్ యాక్సిస్, ఈవీట్రిక్ రైడ్ స్కూటర్లు రెండూ కూడా లో-స్పీడ్ స్కూటర్లు కావడంతో ఇవి గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తాయి. అంతే కాకుండా, వీటిని నడపటానికి రైడర్కు లైసెన్స్ అవసరం ఉండదు మరియు వీటికి రిజిస్ట్రేషన్ కూడా అవసరం ఉండదు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎల్ఈడి హెడ్ల్యాంప్లు, రోబోటిక్ వెల్డింగ్ ఛాస్సిస్, సైడ్ స్టాండ్ సెన్సార్ మరియు 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్లు, 190 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లతో కంపెనీ రెండేళ్ల బ్యాటరీ వారంటీని కూడా అందిస్తుంది.

మొదటి దశలో భాగంగా, ఈవీట్రిక్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఢిల్లీ, గుర్గావ్, పూణే, ఔరంగాబాద్, బెంగళూరు, తిరుపతి మరియు హైదరాబాద్ అనే ఏడు నగరాల్లో ఈ-స్కూటర్లను అందించనుంది. రాబోయే ఆరు నెలల్లో దేశంలోని 28 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని అన్ని రాజధాని నగరాల్లో బ్రాండ్ తన ఉనికిని వేగవంతం చేయాలని చూస్తోంది.


Click it and Unblock the Notifications








