2021 అక్టోబర్ అమ్మకాల్లో పెరిగిన Hero Electric జోరు.. ఇక తగ్గేదెలే
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ తరుణంలో భాగంగానే భారతీయ మార్కెట్లో అతి పెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో ఎలక్ట్రిక్' (Hero Electric) అద్భుతమైన అమ్మకాలను నమోదుచేయగలిగింది. కంపెనీ యొక్క 2021 అక్టోబర్ నెల అమ్మకాలు ఇటీవల విడుదలయ్యాయి. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

హీరో ఎలక్ట్రిక్ (Hero Electric) విడుదల చేసిన అమ్మకాల నివేదికల ప్రకారం, కంపెనీ గత నెలలో (2021 అక్టోబర్) 6,366 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. 2020 అక్టోబర్ నెలలో కంపెనీ కేవలం 314 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను మాత్రమే విక్రయించగలిగింది. అంటే కంపెనీ యొక్క 2020 అమ్మకాలకంటే కూడా 2021 అమ్మకాలు భారీగా వృద్ధి చెందాయి. నివేదికల ప్రకారం ఏకంగా 1900 శాతం వృద్ధి చెందినట్లు తెలుస్తుంది.

గత నెలలో భారీ అమ్మకాలతో కంపెనీ ఒక కొత్త రికార్డ్ సృష్టించింది. హీరో ఎలక్ట్రిక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం 50,331 యూనిట్ల విక్రయాలను నమోదు చేయగలిగింది. హీరో ఎలక్ట్రిక్ సిఇఒ 'సోహిందర్ గిల్' మాట్లాడుతూ, మేము ఇప్పటికే మా కస్టమర్లకు 50,000 బైక్లను డెలివరీ చేసాము మరియు మా 16,500 మంది కస్టమర్లు ప్రస్తుతం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం వెయిటింగ్ లో ఉన్న వారు కూడా త్వరలో ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ పొందుతారని ఆయన అన్నారు.

రోజురోజుకి పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని, రాబోయే రోజుల్లో పెరుగుతున్న డిమాండ్లను కూడా తీర్చడానికి మరియు పంపిణీ మరింత వేగవంతం చేయడానికి కంపెనీ తన సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. కావున రాబోయే రోజుల్లో కంపెనీ మరింత వేగవంతమైన డెలివరీలను చేస్తుంది.

కంపెనీ ఇప్పటికే అందించిన సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది మార్చి నాటికి తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీని ఐదు లక్షల యూనిట్లకు పెంచుతామని తెలిసింది. హీరో ఎలక్ట్రిక్ యొక్క హై-స్పీడ్ సిటీ స్కూటర్ సెగ్మెంట్లో, ఆప్టిమా మరియు ఎన్వైఎక్స్ సేల్స్ వృద్ధికి కీలకమైనవిగా ఉన్నాయి.

ఈ ఏడాది జనవరి మరియు జూలై మధ్య, కంపెనీ భారతదేశం అంతటా ఈ రెండు ఎలక్ట్రిక్ హై-స్పీడ్ స్కూటర్లలో 15,000 యూనిట్లకు పైగా విక్రయించింది. హీరో ఎలక్ట్రిక్ భారతదేశం అంతటా ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కూడా సృష్టిస్తోంది. మాసివ్ మొబిలిటీ భాగస్వామ్యంతో కంపెనీ దేశవ్యాప్తంగా 10,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

హీరో ఎలక్ట్రిక్ భారతదేశం అంతటా ఇప్పటికే దాదాపు 1,650 ఛార్జింగ్ స్టేషన్లను నిర్వహిస్తోంది, అయితే ఈ సంఖ్య వచ్చే ఏడాది చివరి నాటికి దీన్ని 20,000కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ పెరిగితే ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కావున మరింత మంది కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాలను గోనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. తద్వారా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు మరింత పెరుగుతాయి.

హీరో ఎలక్ట్రిక్ కంపెనీ గత ఏడాది నవంబర్లో సిటీ స్పీడ్ రేంజ్లో Optima HX, Photon HX మరియు NYX-HX అనే మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఇవి 30 కి.మీ/గం కంటే ఎక్కువ వేగంతో ఉన్న హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు. ఈ స్కూటర్లు అన్ని రకాల అర్బన్ రోడ్లపై రైడ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. అంతే కాకుండా ఫ్లై ఓవర్లు మరియు క్లైంబింగ్ మార్గాల్లో కూడా వీటిని సులభంగా నడపవచ్చు.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహించడానికి, కేంద్ర ప్రభుత్వం మరియు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ మరియు రెన్యూవల్ ఫీజు నుండి మినహాయింపు కల్పించింది. ఈ నిర్ణయం తర్వాత, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వినియోగదారులు రిజిస్ట్రేషన్ ఫీజును ఆదా చేసుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీల ప్రకారం రోడ్ టాక్స్ మరియు బ్యాటరీతో నడిచే వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులో మినహాయింపు ఇస్తున్నాయి. ఈ రాయితీలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కక్క విధంగా ఉంటాయి. కావున ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారు వీటిని తప్పకుండ తెలుసుకోవాలి.

ప్రస్తుతం దేశంలో వరుసగా రోజురోజుకి ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ కారణంగా ఎక్కువమంది పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలను వినియోగించాడని వెనుకాడుతున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపాలని ప్రజలను ప్రోత్సహిస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరల సామాన్య ప్రజలపైన ఎక్కువ భారాన్ని మోపడమే కాకుండా, వాతావరణ కాలుష్యానికి కూడా కారణం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications








