Ola Electric: మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సన్నాలు & కొత్త ప్లాన్స్
దేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగం బాగా అభ్భివృద్ది చెందుతున్న తరుణంలో ప్రముఖ క్యాబ్ కంపెనీ అయిన Ola కూడా Ola Electric Scooter విడుదల చేసి ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగుపెట్టింది. ఓలా కంపెనీ యొక్క ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అతి తక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొందగలిగింది. ఇదిలా ఉండగా Ola Electric కొన్ని కంపెనీలతో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ Ola Electric ఇప్పుడు ఫాల్కన్ ఎడ్జ్, సాఫ్ట్ బ్యాంక్ మరియు ఇతర సంస్థల నుంచి దాదాపు 200 మిలియన్ డాలర్లకు సేకరించినట్లు ప్రకటించింది. అంటే భారత కరెన్సీ ప్రకారం ఇది అక్షరాలా సుమారు రూ. 1,483 కోట్లు. Ola Electric ఈ భాగస్వామ్యంతో అతి త్వరలో IPO ని ప్రారంభించాలని యోచిస్తోంది.

Ola కంపెనీ ప్రస్తుతం భారతీయ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. అయితే ప్రస్తుతం కంపెనీ దేశీయ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కార్లను కూడా విడుదల చేయడానికి యోచిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని Ola కంపెనీ సీఈఓ భవీష్ అగర్వాల్ స్పష్టం చేశారు. కావున త్వరలోనే కంపెనీ Ola ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తుంది.

భారత దేశం ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహన రంగం వైపు అడుగులు వేస్తోంది. కావున వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలతో ఎలక్ట్రిక్ వాహనాలను అందించడానికి ఓలా కృషి చేస్తోంది. ఇప్పటికే విడుదలైన కొన్ని నివేదికల ప్రకారం 2025 నాటికి పెట్రోల్ మరియు డీజిల్ తో నడిచే వాహనాలు దాదాపు వినియోగంలో ఉండకపోవచ్చు.

ఓలా CEO అందించిన సమాచారం ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ప్రజలలో సానుకూలత పెరుగుతోంది. అందువల్ల, భవిష్యత్తులో వ్యక్తిగత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మరియు నాలుగు చక్రాల వాహనాల డిమాండ్ ఖచ్చితంగా పెరుగుతుంది. దీని కోసం, ఓలా ఎలక్ట్రిక్ ప్రతి వ్యక్తిగత వాహన విభాగంలో వినియోగదారుల డిమాండ్ను తీర్చడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు.

Ola ఇప్పటికే భారతీయ మార్కెట్లో S1 మరియు S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లను వరుసగా రూ. 99,999 మరియు రూ. 1,29,999 కి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. ఈ రెండు స్కూటర్ల అమ్మకాలు కేవలం రెండు రోజుల్లో దాదాపు రూ. 1,100 కోట్లు దాటింది. ఇది నిజంగా అద్భుతమైన విషయం. అయితే ప్రస్తుతం కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క అమ్మకాలను నిలిపివేసింది.

Ola కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలను తిరిగి నవంబర్ 01 నుంచి ప్రారంభించవచ్చు. అయితే కంపెనీ ఇంతకు ముందు ప్రారంభించిన అమ్మకాలలో కేవలం రెండు రోజుల్లోనూ (సెప్టెంబర్ 15 మరియు 16) ప్రతి సెకనుకు 04 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించగలిగింది.

ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లకు, కేంద్ర ప్రభుత్వ FAME-2 కింది లభించే సబ్సిడీ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీని సద్వినియోగం చేసుకోవచ్చు. కావున వాహనాల అసలు ధర ఈ రాయితీల వల్ల బాగా తగ్గుతుంది.

Ola Electric Scooters ఎలక్ట్రిక్ స్కూటర్లు 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ను కలిగి ఉండి, 3.92 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్తో జతచేయబడి ఉంటుంది. ఇందులోని బ్యాటరీని బయటకు తీసే అవకాశం ఉండదు. Ola S 1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఫాస్ట్ ఛార్జర్తో 60 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. హోమ్ ఛార్జర్తో ఛార్జ్ చేయడానికి 6 గంటలు పడుతుంది.

Ola S1 స్కూటర్ ఒక ఫుల్ ఛార్జితో 121 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది, అయితే హై-ఎండ్ వేరియంట్ S1 Pro Scooter 181 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ రెండు స్కూటర్ల యొక్క గరిష్ట వేగం విషయానికి వస్తే, Ola S1 స్కూటర్ గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. ఈ స్కూటర్ కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

ఈ స్కూటర్ మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్లను కలిగి ఉంది. ఇందులో నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్ ఉన్నాయి. వీటితో పాటు ఈ స్కూటర్ 10 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

తమిళనాడులోని చెన్నై సమీపంలోని ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఓలా ఎలక్ట్రిక్ తన ద్విచక్ర వాహనాలను తయారు చేస్తోంది. ఈ ఫ్యాక్టరీ ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అధునాతన ద్విచక్ర వాహనాల తయారీ కేంద్రంగా చెప్పబడింది. గత ఆరు నెలల్లో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్నారు. ఉత్పత్తి పూర్తయిన తర్వాత ఫ్యాక్టరీలో 10,000 మందికి పైగా మహిళా కార్మికులు పని చేస్తారు. ఇది ఎంతోమంది మహిళా కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది.


Click it and Unblock the Notifications








