మళ్ళీ ప్రారంభమైన Ola Electric Scooter బుకింగ్స్: వివరాలు
భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ప్రవేశించిన ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ 'Ola', 2021 ఆగష్టు 15 న దేశీయ విఫణిలో తన ఎలక్ట్రిక్ స్కూటర్ ని అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ని దేశీయ మార్కెట్లో విడుదల చేయక ముందే అత్యంత ప్రజాదరణ పొందగలిగింది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ ప్రారంభించిన కేవలం 24 గంటల్లో ఏకంగా 1 లక్షకు పైగా బుకింగ్స్ స్వీకరించగలిగింది.

Ola కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క విక్రయాలను ఆన్లైన్ లో 2021 సెప్టెంబర్ 15వ తేదీన ఉదయం 8 గంటల నుండి ప్రారంభించి 2021 సెప్టెంబర్ 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు మూసివేసింది. అయితే అమ్మకాలు ప్రారంభించిన మొదటి రోజే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం రూ. 600 కోట్ల విలువైన ఆర్డర్లు పొందింది, అంతే కాకుండా రెండవ రోజు కేవలం 12 గంటల్లోనే రూ. 500 కోట్ల విలువైన స్కూటర్లు అమ్ముడైనట్లు కంపెనీ తెలిపింది.

దీనికి సంబందించిన అధికారిక సమాచారాన్ని కంపెనీ సీఈఓ భవీష్ అగర్వాల్ స్యయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఇప్పటి వరకూ రూ.1,100 కోట్లకు ఆర్డర్లు వచ్చాయని, తిరిగి వీటి కోసం బుకింగ్స్ త్వరలో ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

అయితే ఇప్పుడు ఎట్టకేలకు Ola Electric Scooters యొక్క బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు ముందుగానే 499 రూపాయలు కంపెనీ యొక్క అధికారిక వెబ్ సైట్ సందర్సించి బుక్ చేసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్లకు త్వరలో ఎలక్ట్రిక్ స్కూటర్లు డెలివరీ చేయబడుతాయి.

కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్న వారికీ నెలాఖరులోగా డెలివరీ చేసే అవకాశం ఉంటుంది. Ola Electric ప్రస్తుతం భారత మార్కెట్లో Ola S1 మరియు Ola S1 Pro అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఇందులో Ola S1 ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,999 కాగా Ola S1 Pro ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,29,999 గా ఉంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా వరకు రాయితీలను మరియు సబ్సిడీలను అందిస్తోంది. కావున ఈ రాయితీల వల్ల వీటి ధర చాలా వరకు తగ్గుతుంది. కానీ ఈ రాయితీలు దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర సంబంధిత రాష్ట్రాలు అందించే సబ్సిడీపై ఆధారపడి ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తన ఫేమ్ 2 పథకం కింద సబ్సిడీ అందిస్తుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 3.9 కిలో వాట్ సామర్థ్యం కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 8.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఓలా స్కూటర్ యొక్క బ్యాటరీని 750W సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్తో సుమారు 6 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది కాకుండా, ఫాస్ట్ ఛార్జర్తో కేవలం 18 నిమిషాల్లో 75% వరకు ఛార్జ్ చేయబడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఓలా అనేక కొత్త మరియు ఆధునిక ఫీచర్లను చేర్చింది.

ఓలా S1 ఒక పూర్తి ఛార్జ్పై 121 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది, అయితే హై-ఎండ్ వేరియంట్ S1 Pro మాత్రం 181 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల గరిష్ట వేగం గంటకు 90 కి.మీ. అంతే కాకూండా, ఈ స్కూటర్ కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేర్వేరు డ్రైవింగ్ మోడ్లను కలిగి ఉంటుంది. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, మంచి పనితీరుని కూడా అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 10 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం, డోర్-స్టెప్ సర్వీస్ను అందిస్తుంది. అంటే, స్కూటర్లో ఏదైనా సమస్య ఉంటే, ఆ కంపెనీ టెక్నీషియన్లు స్కూటర్ రిపేర్ చేయడానికి కస్టమర్ ఇంటికి వెళ్తారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మొబైల్ అప్లికేషన్ మరియు వెబ్సైట్లో సర్వీస్ రిక్వెస్ట్ సౌకర్యం అందించబడుతుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను తమిళనాడులోని హోసూర్లోని కంపెనీ తయారీ కర్మాగారంలో అభివృద్ధి చేస్తున్నారు. ఈ తయారీ కర్మాగారం 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద ఉత్పత్తి కర్మాగారం. ఇది పూర్తిగా నిర్మాణం అయిన తరువాత ఇందులో దాదాపు 10,000 మంది మహిళా కార్మికులకు ఉపాధి లభిస్తుంది.

ఓలా ఎలక్ట్రిక్ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్స్ దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొందాయి. అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం విదేశీ కస్టమర్లు కూడా ఎదురు చూస్తున్నారు. కావున ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫ్రికా, యూరప్ మరియు అమెరికాలో విడుదల చేయాలని కంపెనీ సీఈవో భవేష్ అగర్వాల్ స్పష్టం చేసారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు 2022 నుండి విదేశీ మార్కెట్లో కూడా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి.

Ola కంపెనీ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను మాత్రమే విడుదల చేసింది. అయితే కంపెనీ త్వరలో ఎలక్ట్రిక్ కార్లను కూఆ అందించటానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తుంది. కావున భారత మార్కెట్లో త్వరలో ఓలా యొక్క ఎలక్ట్రిక్ కార్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.


Click it and Unblock the Notifications








