పెరిగిన సుజుకి జిక్సర్ మోటార్సైకిళ్ల ధరలు: కొత్త ధరల జాబితా
జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్సైకిల్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న కొన్ని రకాల ద్విచక్ర వాహనాల ధరలను పెంచింది. ఉత్పాదక వ్యయం పెరిగిన కారణంగా కంపెనీ తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

సుజుకి అందిస్తున్న జిక్సర్ లైనప్ మోటార్సైకిళ్ల ధరలను కంపెనీ పెంచింది. ఇందులో 155సిసి మరియు 250సిసి జిక్సర్స్ నేక్డ్ మరియు ఫుల్-ఫేర్డ్ వెర్షన్ల ధలను కంపెనీ సవరించింది. సుజుకి జిక్సర్ 250 మరియు ఎస్ఎఫ్ 250 ధరలు సుమారు రూ.3,500 మేర పెరగగా, ఇందులో 155సిసి వేరియంట్ల ధరలు రూ.2,000 మేర పెరిగాయి.

ధరల సవరణ అనంతరం ప్రస్తుతం మార్కెట్లో సుజుకి జిక్సర్ మోటార్సైకిళ్ల ధరలు ఇలా ఉన్నాయి:
- సుజుకి జిక్సర్ 150 - రూ.1,21,091
- సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 150 - రూ.1,31,593
- సుజుకి జిక్సర్ 250 - రూ.1,73,494
- సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 - రూ.1,84,193
- సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250 మోటో జిపి - రూ.1,84,994
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

సుజుకి మోటార్సైకిల్ ఇండియా ఈ ఏడాది తమ ఉత్పత్తుల ధరలను పెంచడం ఇది రెండవసారి. గడచిన ఫిబ్రవరి 2021లో కూడా సుజుకి తమ అన్ని జిక్సర్ మోటార్సైకిళ్ల ధరలను రూ.2,000 మేర పెంచిన సంగతి తెలిసినదే.

భారత 250సిసి క్వార్టర్ లీటర్ మోటార్సైకిల్ విభాగంలో సుజుకి జిక్సర్ మోడల్ చాలా అద్భుతమైన మోడల్గా నిలుస్తుంది. డిజైన్ మరియు పెర్ఫార్మెన్స్ల పరంగా ఇది చాలా మెరుగ్గా ఉంటుంది. జిక్సర్ ఎస్ఎఫ్ స్పోర్ట్స్ టూరింగ్ విభాగంలో లభిస్తుండగా, జిక్సర్ 250 నేక్డ్ స్ట్రీట్ మోటార్సైకిల్ విభాగంలో అందుబాటులో ఉంటుంది. ఇవి రెండూ కూడా ఒకే ప్లాట్ఫాంపై నిర్మించబడ్డాయి.

ఈ బైక్లోని 249సిసి ఎస్ఓహెచ్సి 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 26.5 బిహెచ్పి శక్తిని మరియు 22.2 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది. ఈ రెండు మోడళ్ల ప్రధాన ఫీచర్లలో పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆకర్షణీయమైన పూర్తి-ఎల్ఈడి హెడ్ల్యాంప్, ఎల్ఇడి టైలాంప్ మరియు క్లిప్-ఆన్ హ్యాండిల్బార్లు మొదలైనవి ఉంటాయి.

ఇక 150సిసి మోడళ్ల విషయానికి వస్తే, వీటిలో 155సిసి ఎస్ఓహెచ్సి, 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 13.6 పిఎస్ పవర్ను మరియు 13.6 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది.

సుజుకి మోటార్సైకిల్ ఇండియాకు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తమ కొత్త 2021 హయాబుసా కోసం ఆన్లైన్ బుకింగ్లను రీఓపెన్ చేసింది. ఈ సూపర్బైక్ రెండవ బ్యాచ్ కోసం జూలై 1, 2021వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి బుకింగ్స్ ప్రారంభమైనట్లు కంపెనీ పేర్కొంది.

ఈ మోడల్ మొదటి బ్యాచ్ విక్రయాలను కేవలం 101 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. కాగా, ఇవన్నీ అప్పుడే పూర్తిగా అమ్ముడైపోయాయి. ఈ నేపథ్యంలో, కంపెనీ తిరిగి రెండ బ్యాచ్ విక్రయాలను ప్రారంభించింది. ఇవి కూడా పరిమిత సంఖ్యలోనే అమ్ముడు కానున్నాయి. మొదటి బ్యాచ్ మాదిరిగానే వీటిని కూడా విదేశాల నుండి ఇక్కడికి దిగుమతి చేసుకొని విక్రయించనున్నారు.


Click it and Unblock the Notifications








