పూర్తిగా 100 శాతం ఎలక్ట్రిక్ స్కూటర్ల ద్వారా మాత్రమే డెలివరీ సేవలు: Zypp Electric
భారతదేశంలో నిరంతరం పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో, చాలా మంది ద్విచక్ర వాహనదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు పరుగులు తీస్తున్నారు. కేవలం సాధారణ కస్టమర్లే కాకుండా కార్పోరేట్ కంపెనీలు, లాజిస్టిక్స్ / ఫ్లీట్ ఆపరేటర్లు మరియు కొన్ని రకాల డెలివరీ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారుతున్నాయి. ఈ విషయంలో తాజాగా, లాజిస్టిక్స్ డెలివరీ స్టార్టప్ అయిన జిప్ ఎలక్ట్రిక్ (Zypp Electric) ఓ కొత్త మైలురాయిని చేరుకుంది.

డైరెక్ట్-టు-కస్టమర్ (డి2సి) డెలివరీ వ్యాపారంలో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ఉపయోగిస్తున్న భారతదేశపు మొదటి కంపెనీగా అవతరించినట్లు జిప్ ఎలక్ట్రిక్ ఒక ప్రకటనలో తెలిపింది. లాస్ట్ మైల్ లాజిస్టిక్స్ డెలివరీలో పూర్తిగా 100 శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని జిప్ ఎలక్ట్రిక్ అనుసరిస్తోందని ఈ ప్రకటనలో పేర్కొంది. జిప్ ఎలక్ట్రిక్ పెద్ద ఇ-కామర్స్ కంపెనీలు, ఇ-స్టోర్లు మరియు రెస్టారెంట్లతో సహా అనేక ఇతర కంపెనీల నుండి డెలివరీ సేవలను వినియోగదారులకు అందిస్తుంది.

Zypp Electric సంస్థ అటువంటి స్టోర్ల నుండి వినియోగదారుల ఇళ్లకు నేరుగా డెలివరీ సేవలను అందిస్తుంది. ఈ డెలివరీ ఫ్లీట్లో కంపెనీ కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ఉపయోగించడం ద్వారా, కార్బన్-కాలుష్య రహిత వాతావరణాన్ని స్థాపించేందుకు కంపెనీ కృషి చేస్తోంది. కస్టమర్లకు సకాలంలో డెలివరీలను అందించడానికి మరియు బ్యాటరీలను మార్చుకోవడం ద్వారా ఛార్జింగ్ సమయాన్ని ఆదా చేయడానికి కంపెనీ తమ ఈవీ ఫ్లీట్ కోసం బ్యాటరీ మార్పిడి స్టేషన్లను కూడా రూపొందించింది.

ప్రస్తుతం, జిప్ ఎలక్ట్రిక్ డెలివరీ ఫ్లీట్లో సుమారు 2,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడుకలో ఉన్నాయి. వీటి ద్వారా కంపెనీ నెలకు 50,000 డెలివరీ ఆర్డర్లను ప్రాసెస్ చేస్తుంది. ఇ-కామర్స్ డెలివరీ ప్లాట్ఫామ్ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. వచ్చే 2025 నాటికి భారతదేశంలో డెలివరీ ఎగ్జిక్యూటివ్ల సంఖ్య సుమారు 60 లక్షలు దాటుతుందని అంచనా.

ఈ ఏడాది జూన్లో హైదరాబాద్లో, ఆగస్టులో బెంగళూరు మరియు పూణే నగరాల్లో కంపెనీ ఈ సేవలను ప్రారంభించింది. వీటితో పాటుగా ఢిల్లీ, గుర్గావ్, ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్ మరియు జైపూర్ వంటి ప్రధాన నగరాల్లో కూడా జిప్ ఎలక్ట్రిక్ డోర్-స్టెప్ డెలివరీ సేవలను అందిస్తుంది. కంపెనీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూ వీలర్ల ద్వారా కస్టమర్లకు స్టోర్ల నుండి వస్తువులు, మందులు, ఆహారం మరియు ప్యాకేజీలను అందజేస్తోంది.

జిప్ ఎలక్ట్రిక్ స్టార్టప్ కంపెనీ ఎయినప్పటికీ, తన ఎలక్ట్రిక్ స్కూటర్లను చాలా సరసమైన ధరలకే అద్దెకు ఇస్తోంది. ఆసక్తిగల వినియోగదారులు తమ మొబైల్ యాప్ సాయంతో జిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ని బుక్ చేసుకోవచ్చు. జిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్ ప్రక్రియ Ola మరియు Uber కోసం క్యాబ్లను బుక్ చేయడం మాదిరిగానే ఉంటుంది. దీని ప్రధాన లక్షణం ఏమిటంటే, కస్టమర్లకు సరసమైన ధరకే ఎలక్ట్రిక్ మొబిలిటీ సేవలను అందించడం.

జిప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు సరసమైన ధరతో మాత్రమే కాదు, దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో కూడా సులభంగా అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. జిప్ ఎలక్ట్రిక్ అనేక రకాల పెట్టుబడి మరియు లీజింగ్ అవకాశాలను కూడా అందిస్తుంది. జిప్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ కింద కొనుగోళ్లు మరియు లీజుల శ్రేణిని అందిస్తుంది, దీనిలో ఎవరైనా ఎలక్ట్రిక్ స్కూటర్లు / లోడర్లను కొనుగోలు చేయవచ్చు మరియు లీజుకు తీసుకోవచ్చు.

గ్యారెంటీడ్ నెలవారీ రాబడులు / అద్దె నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోకి స్వీకరించవచ్చు. ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే, ఈ ప్రోగ్రామ్ దాదాపు 21% రాబడిని పొందవచ్చని కంపెనీ చెబుతోంది. జిప్ దాని డెలివరీ రైడర్లకు 2-3 సంవత్సరాల వరకు ఎటువంటి అదనపు వడ్డీ లేకుండా సాధారణ ఈఎమ్ఐల వద్ద స్కూటర్ను కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది, ఇది ప్రతి డెలివరీ రైడర్కు మరింత సంపాదించడానికి మరియు అధిక నెలవారీ లాభాలను పొందేందుకు అనుమతిస్తుంది.

కంపెనీ జీరో ఎమిషన్ మిషన్ ప్రణాళికలో భాగంగా, రాబోయే రెండేళ్ళలో ఈ ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను 1,00,000 కంటే ఎక్కువ పెంచడానికి మరియు మార్కెట్లో ప్రముఖమైన D2C (డైరెక్ట్ టూ కస్టమర్) బ్రాండ్గా అవతరించడానికి ప్రయత్నిస్తూనే ఉంటామని జిప్ ఎలక్ట్రిక్ తెలిపింది. భారతదేశంలో స్థిరమైన భవిష్యత్తు కోసం టెక్ ఈవీ ఫ్లీట్ ఎకోసిస్టమ్ను స్థాపించడానికి తాము కట్టబడి ఉన్నామని కంపెనీ తెలిపింది.

బిగ్బాస్కెట్, స్పెన్సర్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, లైసియం మరియు మింత్రా వంటి కంపెనీలు నిర్వహించే ఇ-కామర్స్, కిరాణా, ఇ-రిటైల్ మరియు ఫుడ్ డెలివరీ కంపెనీల యొక్క డెలివరీ సేవలం కోసం జిప్ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉపయోగిస్తున్నారు. జిప్ ఎలక్ట్రిక్ సేవలు ప్రస్తుతం తొమ్మిది ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని నగరాలకు తమ సేవలను విస్తరించాలని కంపెనీ చూస్తోంది.

జిప్ ఎలక్ట్రిక్ ప్రస్తుతం 300 క్లయింట్లను కలిగి ఉంది మరియు 2022 నాటికి 1,000 కంటే ఎక్కువ భాగస్వాములను చేర్చుకోవాలని యోచిస్తోంది. "భారతదేశంలో మొదటి EV D2C వ్యాపారం చేస్తున్నందుకు తాము ఎంతో గర్విస్తున్నాము" అని జిప్ ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ ఆకాష్ గుప్తా అన్నారు. లాస్ట్ మైల్ లాజిస్టిక్స్లో పూర్తిగా 100 శాతం విద్యుదీకరణ సాధించడం మరియు కాలుష్యాన్ని తొలగించడానికి వివిధ రంగాలకు చెందిన వ్యాపారాలకు సహాయం చేయడమే తమ లక్ష్యం అని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications








