ఈ బ్యాటరీలు మంటల్లో కాలిపోవు, పేలిపోవు.. ఫైర్-ప్రూఫ్ బ్యాటరీలను లాంచ్ చేసిన కోమకి!
పెట్రోల్ ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం జోరందుకుంది. ప్రత్యేకించి ద్విచక్ర వాహన విభాగంలో, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ చాలా వేగంగా ఉంది. అయితే, ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలలో జరిగిన వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో, పలు ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీలు అందిస్తున్న వాహనాల విశ్వసనీయతపై కస్టమర్లలో ఆలోచనలు మొదలయ్యాయి. ఈ సమస్యను సరిచేసుకునేందుకు, కస్టమర్లలో అవగాహన కల్పించేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇంకా కొంత మంది కస్టమర్ల మదిలో ఈ ఆలోచన మెదలుతూనే ఉంది.

ఈ పరిస్థితుల్లో నాణ్యమైన బ్యాటరీలను కలిగిన వాహనాలను కస్టమర్లకు అందించడం ఎంతో అవసరం. ఈ అవసరాన్ని గుర్తించిన గురుగ్రామ్ ఆధారిత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కోమకి ఎలక్ట్రిక్ (Komaki Electric) తన ఎలక్ట్రిక్ స్కూటర్లను మంటల నుండి రక్షించడానికి ఓ కొత్త రకం ఫైర్-ప్రూఫ్ బ్యాటరీని విడుదల చేసింది. వివిధ ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలకు సంబంధించిన అనేక సంఘటనల తర్వాత, ఈ కంపెనీ అభివృద్ధి చేసిన కొత్త లిథియం-అయాన్ ఫెర్రో ఫాస్ఫేట్ (LiFePO4) బ్యాటరీలను ప్రవేశపెట్టింది.

ఈ కొత్త ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీలు సాధారణ లిథియం-అయాన్ బ్యాటరీల కంటే ఎక్కువ అగ్ని నిరోధకతను కలిగి ఉంటాయని కంపెనీ పేర్కొంది. కొత్త LiFePO4 బ్యాటరీలు ఐరన్ కేసింగ్ ని కలిగి ఉంటాయని, ఫలితంగా ఇవి తీవ్రమైన ఉష్ణోగ్రతలలో కూడా సురక్షితంగా ఉంటాయని కోమకి తెలిపింది. ఈ బ్యాటరీలు బ్యాటరీ ప్యాక్ లోపల నేరుగా ఉత్పన్నమయ్యే సంచిత ఉష్ణాన్ని తగ్గించేందుకు తక్కువ సెల్లను (సుమారు మూడో వంతు) కలిగి ఉంటాయని, సాధారణ బ్యాటరీలతో పోలిస్తే, కొత్త ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీలు 2,500-3,000 ఛార్జ్ సైకిళ్ల సుదీర్ఘమైన జీవిత చక్రాన్ని కూడా కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది.

కోమకి పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ బ్యాటరీలు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తాయని కంపెనీ తెలిపింది. ఈ అధునాతన బ్యాటరీ కోసం 'యాక్టివ్ బ్యాలెన్సింగ్ మెకానిజం' కూడా అభివృద్ధి చేయబడిందని, ఇది దాని పేరు సూచించినట్లుగానే, నిర్దిష్ట సమయాల్లో బ్యాటరీ సెల్స్ ను చురుకుగా బ్యాలెన్స్ చేస్తుందని కంపెనీ తెలిపింది. అయితే, ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందనే విషయాన్ని మాత్రం కంపెనీ స్పష్టం చేయలేదు.

కొత్త బ్యాటరీలను ప్రారంభించడమే కాకుండా, వినియోగదారులకు రియల్ టైమ్ డేటాను సులభతరం చేయడానికి కంపెనీ యాప్ ఆధారిత సేవను కూడా ప్రవేశపెట్టింది. ఇది కాకుండా, కంపెనీ హార్డ్వేర్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ (BMS) కోసం ఒక అప్గ్రేడ్ ను కూడా విడుదల చేసింది, ఇది ఇప్పుడు ప్రతి సెకను బ్యాటరీ స్థితిని చదివి అప్డేట్ చేస్తుంది.

కొత్త ఫైర్-ప్రూఫ్ బ్యాటరీలను విడుదల చేసిన సందర్భంగా, కోమకి ఎలక్ట్రిక్ డివిజన్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా మాట్లాడుతూ, "ఈ విజయం కోమకిని మార్కెట్లో విశ్వసనీయ బ్రాండ్గా నిలబెడుతుందని, బ్యాటరీ ఆరోగ్యం గురించి తుది వినియోగదారులు మరియు డీలర్లకు తెలియజేయడానికి మేము సులభంగా ఉపయోగించగల మొబైల్ అప్లికేషన్ను అభివృద్ధి చేసామని చెప్పారు. ఇది ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులను (OEMలు) సెంట్రల్ లొకేషన్ నుండి బ్యాటరీ రిపేర్లను చేయడానికి అనుమతిస్తుందని మరియు ఇది బ్యాటరీలను అనవసరంగా ఛార్జింగ్ చేయడం మరియు డిశ్చార్జ్ చేయడాన్ని నివారిస్తుందని, తద్వారా బ్యాటరీకి నష్టం జరగకుండా చేస్తుందని" చెప్పారు.

ఈ ఏడాది ప్రారంభంలో, భారతదేశంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఓలా ఎలక్ట్రిక్, ఒకినావా, ప్యూర్ ఈవీ, బూమ్ మోటార్స్, జితేంద్ర ఎలక్ట్రిక్తో సహా అనేక ఇతర కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగిన సంఘటనలు మనందరికీ తెలిసినదే. దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదాలలో కొందరు మరణించగా, కొందరు కాలిన గాయాలతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. ఈ నేపథ్యంలో, ఎలక్ట్రిక్ స్కూటర్లలో అగ్నిప్రమాదాల పట్ల వెంటనే విచారణ జరపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

ఈ కేసులను పరిశీలించిన కమిటీ, మంటలు చెలరేగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీ మాడ్యూల్ లోపభూయిష్టంగా ఉందని, ఈ స్కూటర్లలో మెరుగైన బ్యాటరీ నిర్వహణ వ్యవస్థను అందించడం లేదని తన నివేదికలో పేర్కొంది. ప్రభుత్వం నుండి ఆయా కంపెనీలు నోటీలుసు మరియు మందలింపులు అందుకున్న తర్వాత, సదరు కంపెనీలు తాము విక్రయించిన వేలకొద్దీ లోపభూయిష్ట ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేశాయి.

వరుస బ్యాటరీ పేలుళ్ల నేపథ్యంలో, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఇప్పుడు వినియోగదారుల భద్రత కోసం లిథియం-అయాన్ బ్యాటరీలకు కొత్త పనితీరు ప్రమాణాలను జారీ చేసింది. బ్యాటరీలు వాటి విశ్వసనీయత, ఛార్జింగ్ సామర్థ్యం మరియు సామర్థ్యాన్ని తనిఖీ చేయడానికి విడిగా పరీక్షించబడతాయి. వివిధ వాతావరణాలలో మరియు ఉష్ణోగ్రతలలో ఇవి ఎలా పనిచేస్తాయో కూడా పరీక్షించబడతాయి. కొత్త ప్రమాణాలు లిథియం-అయాన్ బ్యాటరీలను పరీక్షించే విధానాన్ని కూడా తెలియజేస్తాయి.

ఇదిలా ఉంటే, కోమకి గడచిన మే 2022 నెలలో భారత మార్కెట్లో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. వీటిలో కోమకి ఎల్వై (Komaki LY) మరియు కోమకి డిటి3000 (Komaki DT3000) ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ. 88,000 మరియు రూ. 1,22,500 (ఎక్స్-షోరూమ్ - ఇండియా) గా ఉన్నాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








