బైక్ రైడ్ చేస్తున్నప్పుడు బ్లూటూత్ ఉపయోగిస్తున్నారా..? అయితే, మీ లైసెన్స్ గోవిందా గోవిందా..!
సెల్ఫోన్స్ వచ్చిన కొత్తల్లో చాలా మంది ఒక చేతితో వాహనం నడుపుతూనే మరొక చేతితో ఫోన్ ఉపయోగిస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకునే వారు. ఈ పద్ధతికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎంత కృషి చేసిన ఇప్పటికీ చాలా మంది ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు.
Recommended Video
సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడపటం చట్టరీత్యా నేరం, ఇలా చేయడం వలన డ్రైవర్ పరధ్యానానికి లోనై ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అందుకే సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపే వారిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుంటారు, భారీ జరిమానాలు విధిస్తుంటారు. అయితే, ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి, వాహనం నడపుతూ సెల్ఫోన్లను ఉపయోగించేందుకు ఇప్పుడు అనేక రకాల బ్లూటూత్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి పరిమాణంలో చాలా చిన్నవిగా ఉండి, అసలు చెవిలో ఉన్నాయో లేదో గుర్తించలేనంతగా ఉంటున్నాయి.

ఎలక్ట్రానిక్ మార్కెట్లో పెరిగిన పోటీ కారణంగా, ఇప్పుడు అనేక కంపెనీలు అతి తక్కువ ధరలకే బ్లూటూత్ పరికరాలను అందుబాటులోకి రావడంతో ప్రతిఒక్కరూ చెవిలో వైర్లెస్ ఇయర్ఫోన్స్ ఉపయోగిస్తూ ఎంచక్కా వాహనాలను నడిపేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఇది చాలా ప్రమాదకరంగా మారింది. ప్రత్యేకించి ద్విచక్ర వాహనదారులు టూవీలర్ను రైడ్ చేస్తూ, చెవిలో బ్లూటూత్ పరికరాల సాయంతో ఫోన్లలో మాట్లాడుతూ రైడ్ చేస్తున్నారు మరియు అనవరసమైన ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో, ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. కేవలం ఫోన్లో మాట్లాడుతూ టూవీలర్ రైడ్ చేయడమే కాకుండా, చెవిలో వైర్లెస్ బ్లూటూత్ పరికరాలను లేదా వైర్డ్ ఇయర్ఫోన్స్ను ఉపయోగించి ఫోన్లలో మాట్లాడుతూ లేదా సంగీతం వింటూ రైడ్ చేయడాన్ని పోలీసులు చట్టరీత్యా నేరంగా పరిగణిస్తున్నారు. ఈ నేరానికి పాల్పడిన వారికి రూ.1000 జరిమానా విధిస్తున్నారు. అంతేకాకుండా, ఇదే నేరాన్ని పలుమార్లు చేసిన వారి డ్రైవింగ్ లైసెన్సును కొంత కాలం పాటు రద్దు చేసేందుకు కూడా పోలీసులు వెనుకాడటం లేదు.

మనం గమనించినట్లయితే, ఇటీవలి కాలంలో భారతదేశంలో రోడ్డు భద్రత మరియు వాహనాల భద్రతను పెంచడానికి భారత ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది. కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిగా నితిన్ గడ్కరీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి, ఆయన ఈ విషయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే, బైక్ నడుపుతున్నప్పుడు బ్లూటూత్ పరికరాలను ఉపయోగించడం నిషేధించబడింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు బ్లూటూత్/మొబైల్ పరికరాలను ఉపయోగించే బైక్ రైడర్లకు జరిమానాలను విధిస్తున్నారు.

నేటి యువతరాని బైక్పై వెళ్తూ కాల్స్ రిసీవ్ చేసుకోవడం లేదా పాటలు వినడం ఓ అలవాటుగా మారిపోయింది. తమ టూవీలర్ రైడ్ను మరింత ఉల్లాసభరితంగా సాగించేందుకు వారు బ్లూటూత్ / మొబైల్ పరికరాలను ఉపయోగిస్తున్నారు. అయితే, ఇలా చేయడం ప్రాణాంతకం అని నిరూపించవచ్చు. చెవులలో బ్లూటూత్ పరికరాలను ఉపయోగించడం వలన వెనుకగా వచ్చే ట్రాఫిక్ గురించి వారికి అవగాహన ఉండకపోవచ్చు. హాంక్ చేసినా వారికి వినిపించకపోవచ్చు మరియు రోడ్డుపై పరధ్యానానికి గురికావచ్చు.

ట్రాఫిక్ నిబంధనల ప్రకారం, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏ రకమైన మొబైల్ పరికరాన్ని ఉపయోగించడం చట్టవిరుద్ధం. ఇప్పుడు, ఈ జాబితాలో బ్లూటూత్ వంటి హ్యాండ్స్ ఫ్రీ డివైజ్లను కూడా చేర్చారు. డ్రైవింగ్లో మొబైల్ పరికరాలను ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం వాటిని ఇప్పటికే నిషేధించింది. ఎవరైనా ఈ నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తున్నట్లు తేలితే, ట్రాఫిక్ పోలీసులు వారి డ్రైవింగ్ లైసెన్స్ను 3 నెలల పాటు రద్దు చేసే అవకాశం కూడా ఉంది.

హెల్మెట్ సరిగా ధరించకపోయినా చలాన్ తప్పదు
టూవీలర్పై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి మరియు ఆ ఇద్దరూ తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాలి. చాలా మంది రైడర్లు తమ హెల్మెట్ను బైక్కు తగిలించి లేదా ఫ్యూయెల్ ట్యాంక్పై ఉంచి రైడ్ చేస్తుంటారు. ఇలాంటి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, హెల్మెట్ కావల్సింది మీ బైక్కు కాదు, మీ తలకి. మరికొందరైతే కేవలం పోలీసుల నుండి తప్పించుకోవడానికి హెల్మెట్లను ధరిస్తుంటారు. ఇంకొందరు హెల్మెట్ ధరిస్తారు కానీ, వాటిని సరిగ్గా స్ట్రాప్ చేసుకోరు.

హెల్మెట్ అనేది టూవీలర్ రైడర్ల ప్రాణాలను రక్షిస్తుందని అనేక సందర్భాల్లో నిరూపించబడింది. కాబట్టి, మీరు మీ టూవీలర్ను బయటకు తీసుకువచ్చే ప్రతి సందర్భంలో కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించేలా చూసుకోండి. అలాగే, మీరు ధరించిన హెల్మెట్ను తప్పనిసరిగా స్ట్రాప్ చేసుకోండి. ప్రమాదాలు ఎటువైపు నుంచి వస్తాయో ఎవ్వరూ ఊహించలేము కాబట్టి జాగ్రత్తగా ఉండటం ఒక్కటే దీనికి చక్కటి పరిష్కారం.

రోడ్డు ప్రమాదాలలో రోజుకు సగటున 426 మంది చనిపోతున్నారు!
భారతదేశంలో ప్రతి ఏటా లక్షలాధి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక ప్రకారం, గతేడాది (2021లో) భారతదేశంలో జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాలలో 1,55,622 మందికి పైగా మరణించారు. గత 2014 సంవత్సరం తర్వాత ఇదే అత్యధికం. ఈ మొత్తం మృతుల్లో సుమారు 69,240 మంది ద్విచక్ర వాహనదారులే ఉన్నారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే, గడచిన సంవత్సరంలో ప్రతిరోజూ సగటున 426 మంది రోడ్లపై ప్రాణాలు కోల్పోయారు.


Click it and Unblock the Notifications








