గత వారం మారుతీ సుజుకీ సంస్థ కార్ల ధరలను పెంచి వినియోగదారున్ని కలవరపెడితే, ఆ తర్వాత టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలు ఆ బాధ్యతను నెత్తినేసుకొని భయపెట్టాయి. తాజాగా భారతీయ రెండవ అతి పెద్ద ఆటోమొబాల్ కంపెనీ హుందాయ్ మోటార్స్ ఇండియా(హెచ్ ఎం ఐ ఎల్) కూడా త్వరలో కార్ల ధరలను పెంచనున్నట్టు ప్రకటించింది. ఈ పెంపు 1 శాతం నుండీ 1.5 శాతం వరకూ ఉండనున్నట్టు హెచ్ ఎం ఐ ఎల్ అమ్మకాల, మార్కెటింగా విభాగం డైరెక్టర్ అరవింద్ సక్సెనా తెలిపారు.
కారు తయారీకి ఉపయోగించే ఉక్కు తదితర ముడిపదార్థాల ధరలు పెరగటంతోనే ఈ పెరుగుదల నమోదుచేసుకుందని ఆయన తెలిపారు. ఈ తాజా వడ్డనతో హుందాయ్ కార్ల ధర రూ.9000 వరకూ పెరగచ్చని ఆయన అన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుండీ ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయని కంపెనీ వర్గాలు ప్రకటించాయి.