చిత్తూరు జిల్లాలో తొలి కార్ ప్లాంట్, శంకుస్థాపన చేసిన కిరణ్
జపాన్కు చెందిన ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ కంపెనీ 'ఇసుజు మోటార్స్' (Isuzu Motors) రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో రూ.3000 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఉత్పత్తి కేంద్రానికి ఆంధ్రప్రదేష్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్రెడ్డి శంకుస్థాపన చేశారు. శ్రీసిటీలో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంటులో 2016 నాటికి పూర్తి స్థాయిలో నిర్వహణలోకి వచ్చే అవకాశం ఉంది.
కాగా.. ఇది రాష్ట్రంలోనే తొలి కార్ ప్లాంట్ కావటం విశేషం. వచ్చే రెండేళ్లలో వాహనాల ఉత్పత్తి ప్రారంభిస్తామని జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం ఇసుజు మోటార్స్ ఇండియా ప్రెసిడెంట్ టకాషి కికుచి తెలిపారు. ఈ ప్లాంటులో ప్రధానంగా పికప్ ట్రక్స్, ఎస్యూవీలను ఉత్పత్తి చేస్తామని ఆయన వివరించారు. మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్లో పరిశీలించండి.

జపాన్కు చెందిన వాహన తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో నెలకొల్పనున్న ప్లాంటుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్లో సోమవారం శంకుస్థాపన చేస్తున్న దృశ్యం.

శంకుస్థాపన అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఇసుజు మోటార్స్ తన జిల్లాలో ప్లాంటును ప్రారంభించడం సంతోషంగా ఉందని, ఈ ప్లాంటు ద్వారా ఆ ప్రాంతానికి చెందిన 2000 నుంచి 3000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. స్థానికంగా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా ఇసుజుకు ఆయన సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున కంపెనీకి అన్నివిధాలా సహాయం అందిస్తామని ఆయన హామీనిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఇసుజు కంపెనీకి 2013లో ఎంఓయు కుదిరందని, 107 ఎకరాల భూమిని ప్రభుత్వం ఆ కంపెనీకి కేటాయించిందని వివరించారు.

ఆంధ్రప్రదేష్లో ఇసుజు కార్ల కంపెనీని ప్రారంభించాలని ప్రభుత్వం గత కొద్ది సంవత్సరాలుగా ఇసుజు కంపెనీపై ఒత్తిడి చేస్తోందని, దాని ఫలితమే ఈ ప్లాంట్ అని కిరణ్ చెప్పారు. ఇసుజు ప్లాంటులో తయారైన తొలి వాహనాన్ని తాను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.

తయారీ రంగానికి ప్రోత్సాహమిచ్చేలా రాష్ట్రంలో తయారీ జోన్ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతుండటాన్ని సీఎం ప్రస్తావించారు. మరోవైపు, వాహన పరిశ్రమకు కావాల్సిన విధంగా కార్మికులకు శిక్షణనిచ్చేందుకు ఉద్దేశించిన ట్రైనింగ్ కిట్ను ఈ సందర్భంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మకు ఇసుజు యాజమాన్యం అందించింది.

శ్రీసిటీ ప్లాంటు కోసం 2020 నాటికి రూ.3,000 కోట్లు పెట్టుబడులను వెచ్చించనున్నామని ఇసుజు ఇండియా ప్రెసిడెంట్ కికుచి చెప్పారు. సాలీనా 1.20 లక్షల వాహనాల ఉత్పత్తి చేసే సామర్థ్యంతో ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నామని, 2016 ఏప్రిల్ నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని, తొలి దశలో 50 వేల యూనిట్లు ఉత్పత్తి చేస్తామని ఆయవ వివరించారు.


Click it and Unblock the Notifications








