తాగుబోతు డ్రైవర్లను తనిఖీ చేసేది ఇలాగేనా..?
ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే మన దేశంలో కూడా మద్యం సేవించి వాహన నడపటం చట్టరీత్యా నేరం. భారత మోటార్ వాహన చట్టం, 1988లోని సెక్షన్ 185 ప్రకారం, మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కిన వారి రక్తంలో 100 మి.లీ. రక్తంలో 30 మి.గ్రా. లకు (0.03 శాతం బి.ఏ.సి) మించి ఆల్కహాల్ ఉన్నట్లయితే సదరు డ్రైవర్లు శిక్షార్హులు. రక్తంలోని ఆల్కహాల్ స్థాయిని బి.ఏ.సి (బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్/కాన్సన్ట్రేషన్) అంటారు.
మనదేశంలో బి.ఏ.సి శాతం 0.03 శాతం కన్నా ఎక్కువగా ఉంటే నేరం, అదే బ్రిటన్, అమెరికా, కెనడా దేశాల్లో ఇది 0.08 శాతం వరకూ అనుమతించబడుతుంది. పాకిస్థాన్లో అయితే అసలు మద్యం సేవించి వాహనం నడపటాన్ని పూర్తిగా నిషేధించారు. చైనాలో బి.ఏ.సి శాతం కేవలం 0.02 మాత్రమే.
సాధారణంగా, వాహనం నడిపే వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడో లేదో తెలుసుకునేందుకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ను (శ్వాస పరీక్ష) నిర్వహిస్తారు. ఇందుకోసం పోలీసు అధికారుల వద్ద ప్రత్యేక యంత్రాలు ఉంటాయి. యూనిఫారమ్లో ఉన్న ఏ పోలీసు అయినా వాహన చోదకులను ఆపి బ్రీత్ టెస్ట్ చేసే అధికారం ఉంది. అయితే, ఈ పరీక్షను ఖచ్చితంగా బ్రీత్ అనలైజర్ల ద్వారా మాత్రమే చేయాలే తప్ప వేరే విధంగా చేయకూడదు.

ఒకవేళ ట్రాఫిక్ పోలీస్ పోలీసు వద్ద బ్రీత్ అనలైజర్లు లేకపోతే, అనుమానితులను సమీపంలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు కానీ లేదా ఉన్నత ట్రాఫిక్ అధికారులకు కానీ ఫోన్ చేసి వారి ద్వారా ఈ పరీక్షను నిర్వహించాలని చట్టం చెబుతోంది. డ్రైవర్లు బ్రీత్ టెస్ట్కు నిరాకరించినా లేదా ఈ పరీక్షలో పరిమితికి మించి మద్యం సేవించినట్లు గుర్తించబడినా వారి తగిన జరిమానా/జైలుశిక్షను విధించబడుతుంది.
పై ఫొటోను చూడండి.. హోళీ పండుగ రోజున ముంబైలోని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓ ద్విచక్ర వాహన చాలకుడు మద్యం సేవించాడో లేదోనని గుర్తించేందుకు ఎలా నిర్లక్ష్యంగా పరీక్షిస్తున్నాడో. మద్యం సేవించి వాహనం నడిపే కేసులో ఎవరిపై అయినా అనుమానం వస్తే, వారిని బ్రీత్ అనలైజ్ పరీక్ష నిర్వహించి మాత్రమే మద్యం సేవించారో లేదో గుర్తించాలి కానీ, ఈ విధంగా ఎలా పడితే అలా పరీక్షించి ఓ అంచనాకు రావటం చట్టరీత్యా అంగీకరించబడదు. చట్టం గురించి తెలుసుకోండి.. సురక్షితంగా ప్రయాణించండి..!


Click it and Unblock the Notifications








