భారత సైన్యం కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపుకు మారుతోంది..! మరి మీ సంగతి ఏంటి..?
భారతీయ వినియోగదారులే కాదు, భారత సైన్యం కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. పర్యావరణం పట్ల పెరుగుతున్న అవగాహన మరియు అంతరించిపోతున్న శిలాజ ఇంధనాల నేపథ్యంలో, యావత్ ప్రపంచం ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు చూస్తోంది. ఈ ప్రత్యామ్నాయ ఇంధనాలలో ప్రస్తుతం సులువుగా మరియు విరివిగా లభించేది విద్యుత్తు (ఎలక్ట్రిసిటీ). అందుకే, ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై తీవ్రంగా పనిచేస్తున్నాయి.

కొన్ని దేశాలలో ఇప్పటికే సైన్యంలో ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఉపయోగిస్తున్నాయి. తాజాగా, ఇప్పుడు మనదేశం కూడా సైన్యంలోని కొన్ని విభాగాల కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని యోచిస్తోంది. కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఆర్మీ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ప్రపంచంలోని అతిపెద్ద సైనిక శక్తులలో భారతదేశం కూడా ఒకటి. సైన్యంలో అనేక ప్రత్యేక వాహనాలు ఉన్నాయి. సైన్యం యొక్క అవసరాలకు అనుగుణంగా ఆటోమొబైల్ కంపెనీలు వాటిని ప్రత్యేకంగా తయారు చేస్తాయి.

సైన్యంలో బైక్ల నుండి కార్ల వరకూ, యుద్ధ ట్యాంకుల నుండి యుద్ధ విమానాల వరకూ అనేక రకాల వాహనాలు ఉంటాయి. సైన్యం వీటిని వివిధ అవసరాల కోసం ఉపయోగిస్తుంటుంది. అయితే, ప్రస్తుతం ఇవన్నీ కూడా సాంప్రదాయ ఇంధనాలతో (పెట్రోల్/డీజిల్ మొదలైనవి) నడిచే వాహనాలు. కాగా, ఇప్పుడు వీటిలో కొన్నింటిని ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయాలని సైన్యం యోచిస్తోంది.

ప్రస్తుతం, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం నడుస్తోంది. ప్రజలు పెట్రోల్, డీజిల్ వాహనాలను వదిలి ఎలక్ట్రిక్ వాహనాల వైపుకు మారుతున్నారు. ఈ నేపథ్యంలో, భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయం కూడా జోరందుకుంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం కూడా అనేక విధానాలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రైవేటు వాహనాల కొనుగోలుదారులకు, ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ సబ్సిడీని కూడా అందిస్తోంది.

భారతదేశంలో ప్రధాన సమస్యగా పరిణమించిన వాయు కాలుష్యం మరియు కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా, ప్రభుత్వ ఉద్యోగులు తమ రోజూవారీ ప్రయాణాల కోసం ఎలక్ట్రి వాహనాలను వినియోగించాలు కొత్త ప్రోత్సాహకాలు ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ వృద్ధిలో పాల్గొనేందుకు భారత సైన్యం కూడా తనవంతు కృషి చేయడానికి సిద్ధంగా ఉంది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక పత్రాన్ని సిద్ధం చేసింది.

ఈ ప్రణాళిక ప్రకారం, భారత సైన్యంలో వినియోగించే వాహనాల్లో 25 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు, 38 శాతం ఇ-బస్సులు, 48 శాతం ఇ-బైక్లుగా మార్చాలని నిర్ణయించారు. ఇవన్నీ కూడా భారత సైన్యం కోసం ప్రత్యేకంగా తయారు చేయబడే ఆర్మీ వాహనాలు, వీటిని సాధారణ పౌరులు ఉపయోగించకూడదు. ఇండియన్ ఆర్మీ వాహనాలకు ప్రత్యేక అవసరాలు ఉంటాయి. కాబట్టి, ఆటోమొబైల్ కంపెనీలు ఆ డిమాండ్లకు అనుగుణంగా వాహనాన్ని రూపొందించాల్సి ఉంటుంది.

అయితే, భారత సైన్యం పనిచేసే అనేక ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను పూర్తిస్థాయిలో వినియోగించడం అనేది పెద్ద సవాలుతో కూడుకున్న విషయమే. వీటిలో ప్రధానమైనది చార్జింగ్ మౌలిక సదుపాయాలు మరియు రెండవది వాతావరణం. ఈ సమస్యలను పరిష్కరించిన తర్వాతే ఆయా ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం, ఆర్మీలో ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చో ఆర్మీ అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇందుకోసం ఆయా ప్రాంతాలలో చిన్న చిన్న మార్పులు చేసి ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించే ప్రాంతంగా మార్చవచ్చో అధ్యయనం చేస్తారు.

భారత సైన్యం ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడానికి ప్రధాన కారణం కాలుష్య నియంత్రణ. వాహనాల నుంచి వెలువడే పొగలు పర్యావరణానికి చాలా హానికరమైనవి. కాలుష్యాన్ని నియంత్రించే బాధ్యతను తీసుకుంటూ, భారత సైన్యం దశలవారీగా ICE ఇంజిన్లను ఎలక్ట్రిక్ ఇంజిన్లతో భర్తీ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడానికి, ఛార్జింగ్ స్టేషన్ / బ్యాటరీ మార్పిడి స్టేషన్ల వంటి మౌలిక సదుపాయాలు అవసరం.

విద్యుత్ పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి కూడా ప్రణాళికలు రూపొందించబడ్డాయి. ఛార్జింగ్ స్టేషన్లలో ఒక్కో ఫాస్ట్ ఛార్జర్ మరియు రెండు స్లో ఛార్జర్లను అమర్చాలని నిర్ణయించారు. కరెంటు లేని ప్రాంతంలో సోలార్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయవచ్చా అనే అంశంపై కూడా చర్చలు సాగుతున్నాయి. భారత సైన్యం కోసం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు తొలి టెండర్ కూడా సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో 60 ఎలక్ట్రిక్ బస్సులు, 24 ఫాస్ట్ చార్జర్లకు టెండర్లు పిలవనున్నారు.

ఈవీలకు పరివర్తన చెందడం మరియు శిలాజ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యామ్నాయ ఇంధన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత సైన్యం పేర్కొంది. గడచిన ఏప్రిల్ నెలలో, భారత సైన్యం టాటా మోటార్స్, పర్ఫెక్ట్ మెటల్ ఇండస్ట్రీస్ మరియు రివోల్ట్ మోటార్స్ తయారు చేసిన ఈవీలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పరిశీలించిన సంగతి తెలిసినదే.

ప్రస్తుతం, భారత ఆటోమొబైల్ మార్కెట్లోని ఎలక్ట్రిక్ వాహన విభాగంలో టాటా మోటార్స్ అగ్రగామిగా ఉంది. టాటా ఇప్పటికే పలు ప్యాసింజర్ మరియు కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో విక్రయిస్తోంది. అంతేకాకుండా, భారత సైన్యంతో టాటా మోటార్స్కు మంచి సంబధాలు కూడా ఉన్నాయి. టాటా మోటార్స్ ఇప్పటికే సైన్యం కోసం కొన్ని పెట్రోల్/డీజిల్ ఆధారిత ఆర్మీ వాహనాలను సరఫరా చేస్తోంది. కాబట్టి, భవిష్యత్తులో కూడా భారత సైన్యం కోసం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాలను సరఫరా చేసే అవకాశం ఉంది. కాగా, సైన్యంలోని ఏయే విభాగాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించనున్నారనే విషయాన్ని మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications








