రాయల్ ఎన్ఫీల్డ్కు గట్టి పోటీనిచ్చే యుఎమ్ మోటార్ సైకిల్స్ పై తగ్గిన ధరలు
యుఎమ్ లోహియా టూ వీలర్ తమ మోటార్ సైకిళ్ల మీద ధరలు తగ్గించినట్లు అధికారికంగా వెల్లడించింది.
అమెరికాకు చెందిన దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ యుఎమ్ మోటార్ సైకిల్స్ దేశీయంగా లోహియా ఆటో ఆధ్వర్యంలో కార్యకలాపాలు సాగిస్తోంది. యుఎమ్ లోహియా టూ వీలర్ తమ మోటార్ సైకిళ్ల మీద ధరలు తగ్గించినట్లు అధికారికంగా వెల్లడించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లకు సరైన పోటీనిచ్చే బైకులు యుఎమ్ మోటార్ సైకిల్స్. గత ఏడాది జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో ద్వారా దేశీయ మార్కెట్లోకి ప్రవేశించిన యుఎమ్ మోటార్ సైకిల్స్ లోహియా ఆటో సహకారంతో రెండు మోటార్ సైకిళ్లను విపణిలోకి విడుదల చేసింది.

అన్ని వాహన తయారీ సంస్థలు కూడా జిఎస్టి ప్రతిఫలాలను ఇప్పటి నుండే కస్టమర్లకు అందివ్వాలనే ఉద్దేశ్యంతో తమ ఉత్పత్తులను ధరలను తగ్గిస్తూ రావడం మనకు తెలిసిందే, యుఎమ్ మోటార్ సైకిల్స్ కూడా ఇదే బాటలో తమ రెండు బైకుల మీద ధరలు తగ్గించింది.

యుఎమ్ మోటార్ సైకిల్స్ మరియు లోహియా ఆటో భాగస్వామ్యం, యుఎమ్-లోహియా టూ వీలర్స్ రెనిగేడ్ స్పోర్ట్స్ ఎస్ బైకు మీద రూ. 4,199 లు మరియు రెనిగేడ్ కమాండో మీద రూ. 5,684 లు వరకు తగ్గించింది.

ఒకే దేశం, ఒకే పన్ను కోసం కేంద్రం రూపొందించిన వస్తు మరియు సేవా పన్ను (GST) జూలై 1, 2017 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. వాహనాలపై జిఎస్టి ప్రకారం నిర్ణయించబడిన ట్యాక్స్ వివిధ రాష్ట్రాల వారీగా చూసుకుంటే స్వల్ప వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది.

ధరల తగ్గింపు అనంతరం యుఎమ్ మోటార్ సైకిళ్ల ధరలు(ఎక్స్-షోరూమ్, పూనే).
- యుఎమ్ రెనిగేడ్ స్పోర్ట్స్ ఎస్ ధర రూ. 1,78,518 లు
- రెనిగేడ్ కమాండో ధర రూ. 1,84,397 లు

ఈ సంధర్బంగా యుఎమ్ఎల్ సిఇఒ రాజీవీ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ, "యుఎమ్ మోటార్ సైకిల్స్ కస్టమర్లకు అత్యుత్తమ నాణ్యతతో కూడి రైడింగ్ ఎక్స్పీరియన్స్ తమ బైకుల ద్వారా అందిస్తున్నట్లు మరియు ఎంట్రీ లెవల్ క్రూయిజర్ సెగ్మెంట్లో ఇప్పుడిప్పుడే రాణిస్తున్నట్లు పేర్కొన్నాడు."

గతంలో టూ వీలర్ల మీద ట్యాక్స్ 30 శాతముగా ఉండేది. తాజాగా కేంద్రం రూపొందించి జిఎస్టి ప్రకారం, మోటార్ సైకిళ్ల మీద అన్ని పన్నులు మరియు సెస్సులతో కలుపుకుని ఏకీకృత ట్యాక్స్ 28 శాతముగా నిర్ణయించబడింది. తద్వారా రెండు శాతం ట్యాక్స్ తగ్గడంతో టూ వీలర్ల ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి.

జిఎస్టి అమలు కావడానికి ముందే బజాజ్ ఆటో మరియు రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థలు తమ మోటార్ సైకిళ్ల మీద ఆ రెండు శాతం ధరను తగ్గించాయి. దీంతో విక్రయాలు కూడా కాస్త పెరిగే అవకాశం ఉంది.

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
జిఎస్టి ప్రతిఫలాలను ఇప్పటి వరకు దేశీయ టూ వీలర్ల తయారీ సంస్థలు మాత్రమే అందివ్వడం చూశాము. కానీ ఇప్పుడు ధరకు తగ్గ విలువలతో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో మోటార్ సైకిళ్లను ఉత్పత్తి చేసే విదేశీ కంపెనీ యుఎమ్ కూడా తమ ఉత్పత్తుల మీద ధరలు తగ్గించింది. కాబట్టి యుఎమ్ వారి టూ వీలర్ ఎంచుకునేవారికి ఇదొక మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








