బెంగుళూరుకి బై బై చెప్పి, తమిళనాడుకి హాయ్ హాయ్ చెప్పిన ఏథర్ ఎనర్జీ!
ఇప్పటి వరకూ కర్ణాటకలోని బెంగళూరు కేంద్రంగా పనిచేస్తూ వచ్చిన ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ, ఇప్పుడు తన మకాం తమిళనాడుకి మార్చింది. బెంగుళూరులో ప్లాంట్లో కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిని నిలిపివేసింది.

తమిళనాడులోని హోసూర్లో ఏర్పాటు చేస్తున్న కొత్త ఉత్పాదక కేంద్రానికి ఏథర్ ఎనర్జీ తమ ఉత్పత్తి మార్గాన్ని తరలించడానికి సిద్ధంగా ఉంది. ఏథర్ ఎనర్జీ సీఈఓ అండ్ కో-ఫౌండర్ తరుణ్ మెహతా ఇటీవల చేసిన ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు.

ఆయన చేసిన ట్వీట్ ప్రకారం.. "బెంగుళూరులోని వైట్ఫీల్డ్లో ఉన్న మా మొదటి ప్లాంట్ నుండి ఆఖరి ఏథర్ వాహనాన్ని విడుదల చేస్తున్నాం. ఇక్కడ రోజుకు 7 వాహనాలను ఉత్పత్తి చేసే స్థితి నుండి రోజును 75 వాహనాలను ఉత్పత్తి చేసే దశకు చేరుకున్నాం. ఈ విషయంలో సిబ్బంది చాలా చక్కగా పనిచేశారు. ఇకపై హోసూర్ నుండి మా తదుపరి అధ్యాయం మొదలు కానుంది, ఎదురు చూస్తూ ఉండండి!" అని పేర్కొన్నారు.

ఏథర్ ఎనర్జీ మొదట బెంగుళూరులోని వైట్ఫీల్డ్ తయారీ కేంద్రంలో తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిని చేపట్టింది. ఈ స్టార్టప్ కంపెనీ తొలుత రోజుకు ఏడు స్కూటర్లను మాత్రమే ఉత్పత్తి చేయగలిగేది. ఆ తర్వాతి కాలంలో క్రమంగా కంపెనీ తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ వచ్చింది.

స్కూటర్ల తయారీ మరియు అసెంబ్లీ ప్రక్రియ యొక్క నిరంతర ఆప్టిమైజేషన్తో కంపెనీ ప్రతి షిఫ్ట్కి 75 స్కూటర్లను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యాన్ని చేరుకుంది. ప్రారంభ ఉత్పత్తి సంఖ్యతో పోలిస్తే, ఇది గణనీయమైన వృద్ధిని సాధించింది. అయితే, దేశంలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి కంపెనీ ఇప్పుడు పెద్ద ప్లాంట్ కోసం సన్నాహాలు చేస్తోంది.

ఇందులో భాగంగానే, తమిళనాడులోని హోసూర్లో ఏర్పాటు చేస్తున్న తమ కొత్త పెద్ద ప్లాంట్కు ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిని తరలించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ కొత్త ప్లాంట్ 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది మరియు ఈ ప్లాంట్ నుండి ఏటా 1,00,000 యూనిట్లను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉంది. కావాలనుకుంటే ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 లక్షల యూనిట్లకు పెంచుకునే వెసలుబాటు కూడా ఉంది.

ఏథర్ ఎనర్జీ ఇటీవలే 35 మిలియన్ డాలర్ల తాజా నిధులను కూడా పొందింది. ఈ ఇన్వెస్ట్మెంట్ రౌండ్కు సచిన్ బన్సాల్ నాయకత్వం వహించారు మరియు హీరో మోటోకార్ప్ మద్దతు కూడా లభించింది. దేశవ్యాప్తంగా ఏథర్ ఎనర్జీ బ్రాండ్ వేగంగా విస్తరణ కార్యక్రమాలు చేపట్టడానికి ఈ నిధులను ఉపయోగించనున్నారు.

ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాల నేపథ్యంలో, ఏథర్ ఎనర్జీ తమ వాహనాల ఉత్పత్తి కోసం ఆ రాష్ట్రాన్ని ఎంచుకుంది. తమిళనాడులో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కంపెనీ ఆ రాష్ట్రం అందించే ప్రోత్సాహకాలకు అర్హత పొందనుంది.

ఇందులో విద్యుత్ పన్ను 100 శాతం మినహాయింపు, భూమి కొనుగోలుపై స్టాంప్ డ్యూటీ మినహాయింపు, ఎలక్ట్రిక్ వాహన పన్ను మినహాయింపు వంటివి చాలానే ఉన్నాయి.

వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం నాటికి దేశంలోని 27 ప్రధాన నగరాల్లో తమ ఫ్లాగ్షిప్ 450 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దేశంలో తమ రెండవ దశ విస్తరణ ప్రణాళికలో భాగంగా ఉంటుంది. మొదటి దశలో భాగంగా, ఏథర్ ఎనర్జీ దేశవ్యాప్తంగా 16 కొత్త నగరాల్లో తమ పాపులర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేయనున్నట్లు తెలిపింది.

వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం నాటికి దేశంలోని ప్రతి ప్రధాన నగరంలో తమ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. వినియోగదారులు ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ప్రత్యక్షంగా తెలుసుకోవటం కోసం ప్రత్యేకమైన టెస్ట్ రైడ్లను ఏర్పాటు చేయడం ద్వారా ఇది ప్రారంభమవుతుంది. అదనంగా, దేశంలో వేగవంతమైన ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్, ఏథర్ గ్రిడ్లను ఏర్పాటు చేసేందుకు కంపెనీ వివిధ రీటైల్ భాగస్వాములతో చర్చిస్తోంది.

ఏథర్ ఎనర్జీ ప్రస్తుతం 11 వేర్వేరు నగరాల్లో 60కి పైగా పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. ఏథర్ అందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో అందుబాటులోకి రానున్నాయి. మరిన్ని నగరాల్లో ఏథర్ తమ ఉత్పత్తులను అందించేందుకు శరవేగంగా పావులు కదుపుతోంది.


Click it and Unblock the Notifications








