హోండా మోటార్సైకిల్స్ మరియు స్కూటర్స్పై సైబర్ అటాక్
సైబర్ నేరగాళ్లు ఆటోమొబైల్ కంపెనీలను కూడా వదలడం లేదు. తాజాగా జపనీస్ మోటార్సైకిల్ బ్రాండ్ హోండా మోటార్ కంపెనీపై సైబర్ అటాక్ జరిగింది. ఈ సైబర్ అటాక్ కారణంగా హోండా సర్వెర్లలో వైరస్ చొరబడి, ప్రొడక్షన్ ప్రక్రియలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

జపాన్లోని హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఫ్యాక్టరీపై జరిగిన ఈ సైబర్ అటాక్ ప్రభావం, ఈ సంస్థకు చెందిన వివిధ దేశాల్లోని 11 ఇతర ప్లాంట్లపై కూడా పడింది. అందులో భారతదేశానికి చెందిన ప్లాంట్ కూడా ఉంది. అమెరికాలో మొత్తం ఐదు ప్లాంట్లలో ద్విచక్ర మరియు కార్ల ఉత్పత్తి కేంద్రాలు కూడా ఈ సైబర్ డాడికి గురయ్యాయి.

హోండా గ్లోబల్ నెట్వర్క్ అవుటేజ్ కారణంగా భారత్లోని హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) కూడా ఈ సైబర్ అటాక్కు గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితంగా కంపెనీ ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలు స్వల్ప అంతరాయం ఏర్పడిందని, అయితే వెంటనే కంపెనీ తేరుకొని ఈ సమస్యను పరిష్కరించిందని తెలుస్తోంది.

అయితే, భారత్లో హోండాకు చెందిన కార్ల విభాగం అయిన హోండా కార్స్ ఇండియాలో మాత్రం ఉత్పత్తికి ఎలాంటి అంతరాయం కలగలేదని కంపెనీ పేర్కొంది.
ఈ విషయంపై హోండా అధికార ప్రతినిధి పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా హోండాకి సంబంధించిన నెట్వర్క్లో స్వల్ప అంతరాయం సంభవించిందని, దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ సాగుతోందని, రికవరీ ప్రాసెస్ కూడా చాలా వేగంగా జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ నెట్వర్క్ అవుటేజ్ వలన తమ డీలర్షిప్ నెట్వర్క్లో మాత్రం ఇన్వాయిస్ ప్రాసెసింగ్పై ఎలాంటి ప్రభావం పడలేదని అన్నారు.

లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా గడచిన మే నెలలో దేశంలోని తమ ఉత్పత్తి కేంద్రాల్లో వాహనాల తయారీని పునఃప్రారంభించింది. ఇందులో భాగంగానే, కంటైన్మెంట్ జోన్లు మినహా దేశవ్యాప్తంగా ఉన్న తమ అన్ని డీలర్షిప్ కేంద్రాలను కూడా హోండా రీఓపెన్ చేసింది. దీంతో దేశంలో తిరిగి హోండా బ్రాండ్ సేల్స్ మరియు సర్వీసులు ప్రారంభమయ్యాయి.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హోండా బ్రాండ్ తమ ప్రొడక్షన్ యూనిట్లలో మరియు డీలర్షిప్ కేంద్రాలలో వైరస్ వ్యాప్తి నివారణ చర్యలను పూర్తిస్థాయిలో పాటిస్తోంది. మే 2020లో హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా 54,000 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే సమయంతో పోల్చుకుంటే ఇది 88 శాతం క్షీణతను నమోదు చేసింది. మే 2019లో హోండా 4.82 లక్షల ద్విచక్ర వాహనాలను విక్రయించింది.

హోండా సైబర్ అటాక్పై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
కరోనా కట్టడి కోసం కేంద్రం ప్రకటించిన లాక్డౌన్లో కేంద్రం గత మే నెలలో సడలింపులు ప్రకటించిన నేపథ్యంలో హోండా బ్రాండ్ దేశంలో తమ కార్లు, మోటార్సైకిళ్ల వ్యాపారాన్ని దశల వారీగా తిరిగి ప్రారంభిస్తూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీ సైబర్ దాడికి గురవటం కాస్తంత విచారకరమే అయినప్పటికీ, భారత్లోని కంపెనీ ప్లాంట్లపై మాత్రం దాని ప్రభావం పెద్దగా లేకపోవటం అనేది మంచి విషయం. కోవిడ్-19 తర్వాత హోండా అమ్మకాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications








