2020లో 50 వేల యూనిట్లు, 2021లో ఇంకా ఎక్కువగా..!
ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్కి చెందిన ఎలక్ట్రిక్ వాహన విభాగం హీరో ఎలక్ట్రిక్, గడచిన సంవత్సరం (2020)లో దేశంలో 50,000 ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్సైకిళ్లను విక్రయించినట్లు పేర్కొంది.

ఈ మేరకు హీరో ఎలక్ట్రిక్ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో అత్యధిఖ సంఖ్యలో అమ్మకాలను నమోదు చేసి, ఈ విభాగంలోనే అగ్రగామిగా కొనసాగుతున్నామని కంపెనీ పేర్కొంది. హీరో ఎలక్ట్రిక్ విడుదల చేసిన ప్రకటనలో తమ అమ్మకాల నెట్వర్క్ 600 టచ్పాయింట్లను దాటిందని కంపెనీ తెలిపింది.

హీరో ఎలక్ట్రిక్ ప్రస్తుతం భారతదేశంలోని సుమారు 500కి పైగ నగరాల్లో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ఈ కంపెనీ ఇప్పుడు భారతదేశంలోనే ఇది అత్యధిక నెట్వర్క్ కలిగిన ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్గా అవతరించింది.

దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో, ఇటీవలి కాలంలో హీరో ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీ జోరందుకుంది. గత కొన్ని వారాలుగా తమ డీలర్షిప్ కేంద్రాలకు వినియోగదారుల తాకిడి పెరిగిందని, కస్టమర్లు తమ వద్ద ఉన్న పెట్రోల్ పవర్డ్ టూవీలర్లను హీరో ఎలక్ట్రిక్ టూవీలర్ల కోసం మార్పిడి (ఎక్సేంజ్) చేసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి కూడా ఎంక్వైరీలు వస్తున్నాయని కంపెనీ పేర్కొంది.

ఈ ఏడాది మరింత ఉత్తేజకరమైన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గాను, దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి హీరో ఎలక్ట్రిక్ గత సంవత్సరం నుండి 1,500 కొత్త ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో, హీరో ఎలక్ట్రిక్ ఈ ఏడాది తమ అమ్మకాల వృద్ధిని మరింత పెంచుకోవడం ద్వారా ఈ విభాగంలో తమ స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా, కంపెనీ ఇప్పటికే తమ లూధియానా ప్లాంట్లో ఎలక్ట్రిక్ టూవీలర్ల ఉత్పత్తిని కూడా పెంచింది.

హీరో ఎలక్ట్రిక్ ప్రస్తుత సంవత్సరానికి 70,000 యూనిట్ల ఎలక్ట్రిక్ టూవీలర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. రానున్న రోజుల్లో ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని మూడు రెట్లు, అంటే సుమారు 2.5 లక్షల యూనిట్లకు పెంచాలని హీరో ఎలక్ట్రిక్ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల వృద్ధిలో 15 శాతం పెరుగుదలను చూడటానికి ఇది సహాయపడుతుందని కంపెనీ భావిస్తోంది.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో హీరో ఎలక్ట్రిక్ వివిధ రకాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. వీటిలో లో-స్పీడ్ మరియు హై-స్పీడ్ మోడళ్లు కూడా ఉన్నాయి. హీరో ఎలక్ట్రిక్ అందిస్తున్న సిటీ స్పీడ్ ఎన్వైఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. గతేడాది అక్టోబర్ నెలలో విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.64,640 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

హీరో సిటీ స్పీడ్ ఎన్వైఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి చార్జ్పై 82 కిలోమీటర్ల రేంజ్ను ఆఫర్ చేస్తుంది. ఇందులో టాప్-రేంజ్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది, ఇది పూర్తి చార్జ్పై గరిష్టంగా 210 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తుంది. హీరో ఎలక్ట్రిక్ తన సిటీ స్పీడ్ సిరీస్లో ఆప్టిమా మరియు ఫోటాన్ అనే ఇతర మోడళ్లను కూడా విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications








