ఓకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్; భారీగా ఉత్పత్తి పెంపు!
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓకినావా ఆటోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్, భారత మార్కెట్లో ప్రతి ఏటా 1 మిలియన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందు కోసం కంపెనీ 150 కోట్ల రూపాయల పెట్టుబడితో రాజస్థాన్లోని భీవండి ప్లాంట్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయనుంది.

ప్రస్తుతం, ఈ కంపెనీ సంవత్సరంలో 5 నుండి 6 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను మాత్రమే తయారు చేస్తోంది. ఇటీవలి కాలంలో, భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో పెరిగిన పోటీని దృష్టిలో ఉంచుకొని, ఓకినావా తమ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసే దిశగా ప్లాన్ చేస్తోంది.

పెరుగుతున్న ఓకినావా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు
భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న హీరో ఎలక్ట్రిక్ తర్వాత రెండవ అతిపెద్ద సంస్థగా ఓకినావా కొనసాగుతోంది. దేశీయ విపణిలో ఓకినావా స్కూటర్ల అమ్మకాలు కూడా జోరందుకున్నాయి. గతేడాది ఓకినావా మొత్తం 30,930 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఓకినావా ప్రైస్ ప్రో ఈ కంపెనీ నుండి అత్యధికంగా అమ్ముడైన స్కూటర్గా నిలిచింది.

త్వరలో కొత్త మోడళ్ల ఉత్పత్తి ప్రారంభం కానుంది
రాజస్థాన్లోని భీవండి ప్లాంట్తో పాటుగా కొన్ని కొత్త మోడళ్ల ఉత్పత్తిని కూడా చేపట్టాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. రాబోయే ఓకి100 మరియు ఓకి90 ఎలక్ట్రిక్ బైక్లను కంపెనీ ఈ ప్లాంట్లో తయారు చేయనుంది. ఇవే కాకుండా క్రూయిజర్ విభాగంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్లను కూడా కంపెనీ తయారు చేయాలని ప్లాన్ చేస్తోంది.

స్థానికీకరణపై ప్రధాన దృష్టి
ప్రస్తుతం, ఓకినావాలో ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే 92 శాతం భాగాలు భారతదేశంలోనే తయారవుతున్నాయి. ఇందులో ఉపయోగించే బ్యాటరీలను మాత్రం కంపెనీ బయటి దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. అయింతే, రాబోయే కొన్నేళ్లలో మొత్తం పరికరాల తయారీలో పూర్తిగా 100 శాతం స్థానికీకరణను చేపట్టాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ పిఎల్ఐ పథకం యొక్క ప్రయోజనంపై కంపెనీ దృష్టి పెట్టింది.

కరోనా కారణంగా అస్తవ్యస్తంగా మారిన మార్కెట్
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా దేశీయ మార్కెట్ తీవ్రంగా ప్రభావితమైందని ఓకినావా పేర్కొంది. లాక్డౌన్ మరియు ప్లాంట్ల షట్డౌన్ల కారణంగా అమ్మకాలు మరియు ఉత్పత్తి ప్రతికూలంగా ప్రభావితమయ్యాయని, అయినప్పటికీ ఈ సమయంలో కంపెనీ తమ లాభాలను కోల్పోలేదని పేర్కొంది.

కోవిడ్-19 మార్గదర్శకాల దృష్ట్యా, సంస్థ తన కార్పొరేట్ కార్యాలయ ఉద్యోగులకు ఇంటి నుండి పని చేసే అవకాశాన్ని కల్పించింది. అదే సమయంలో, కంపెనీ తమ ప్లాంట్లలో పరిమిత సంఖ్యలో ఉద్యోగులను అనుమతించి వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు డ్రైవ్స్పార్క్ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








